బొగ్గు మంత్రిత్వ శాఖ
ధన్బాద్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే పర్యటన
బెల్గడియా టౌన్షిప్ పరిశీలనతో పాటు కొయ్లా భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 9:24PM by PIB Hyderabad
జార్ఖండ్లో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే ఈ రోజు ధన్బాద్ను సందర్శించారు. ఈ క్రమంలో, ఆయన బెల్గడియా టౌన్షిప్లో పునరావాస సంబంధిత కార్యక్రమాలనూ, అభివృద్ధి పనులనూ పరిశీలించారు. దీంతోపాటు, బీసీసీఎల్ ప్రధానకేంద్రంలో ఓ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు.
బెల్గడియా టౌన్షిప్ పరిశీలనతో మంత్రి తన పర్యటనను ఆరంభించారు. అక్కడ ఝరియా మాస్టర్ ప్లాన్లో భాగంగా.. ఝరియా బొగ్గు గనిలో సంభవించిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాల పునరావాసానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పునరావాస సంబంధిత పనులు ఎలా పురోగమిస్తోందీ మంత్రి సమీక్షించారు. పునరాశ్రయాన్ని కల్పించదలిచిన కుటుంబాలకు అందజేసే సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పన ఎంతవరకు వచ్చిందీ మంత్రి గమనించారు.

ఈ కార్యక్రమంలో ఝరియా శాసనసభ్యురాలు శ్రీమతి రాగిణీ సింగ్, ధన్బాద్ డిప్యూటీ కమిషనరు శ్రీ ఆదిత్య రంజన్, బీసీసీఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్, బీసీసీఎల్కు చెందిన ఫంక్షనల్ డైరెక్టర్లు, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో పాటు బీసీసీఎల్, జిల్లా పాలనాయంత్రాంగానికి చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
టౌన్షిప్ అయిదో దశలో నెలకొన్న పరిపాలనా భవనసముదాయంలో కేంద్ర మంత్రి సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ, నిర్వాసిత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో చేపట్టిన ఒక విస్తృత కార్యక్రమమే ‘బెల్గడియా టౌన్షిప్లో పునరావాస కల్పన కార్యక్రమం’ అన్నారు. ఈ ప్రక్రియ భౌతిక పునరావాసానికి మాత్రమే పరిమితం కాదని, దీని ముఖ్యోద్దేశం దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడమని వివరించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు కూడా పునరావాస ప్రక్రియలో చురుకుగా పాలుపంచుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

పనులను పూర్తి చేయడంలో పారదర్శకతకి, నాణ్యతకి, ఆయా పనులను అనుకున్న కాలం లోపల పూర్తి చేయడానికీ బాధ్యత వహిస్తూనే, పునరావాస ప్రణాళికలో అర్హత కల కుటుంబాలన్నిటికీ భాగం పంచడంపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు.
బీసీసీఎల్ అమలుచేయనున్న జీవనోపాధి, ఉపాధికల్పనల సంబంధిత ప్రాజెక్టు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. టౌన్షిప్లో అయిదుగురు లబ్ధిదారులకు ఈ-రిక్షాలను బీసీసీఎల్ కార్పొరేట్ సామాజిక మాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా అందజేశారు. సీఎస్ఆర్ పరిధిలో వివిధ జీవనోపాధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమాలను స్థానికంగా జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా తీసుకున్న సార్థక చర్యలుగా మంత్రి అభివర్ణించి, ప్రశంసించారు.
ఆ తరువాత కొయ్లా భవన్లో ఓ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీసీసీఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్, ధన్బాద్ డిప్యూటీ కమిషనరు శ్రీ ఆదిత్య రంజన్, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, బీసీసీఎల్కు చెందిన ఫంక్షనల్ డైరెక్టర్లు, ఎస్ఎస్పీ శ్రీ ప్రభాత్ కుమార్, సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులతో పాటు, బీసీసీఎల్, జిల్లా పాలనాయంత్రాంగానికి చెందిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

ఝరియా మాస్టర్ ప్లాన్లో భాగంగా అమలుచేస్తున్న ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృత సమీక్షను చేపట్టారు. కార్యనిర్వహణ తీరు, బొగ్గు నాణ్యతను మెరుగుపరిచే కార్యక్రమాలు, పునరావాస సంబంధిత కార్యక్రమాల పురోగతితో పాటు బొగ్గు గనుల తవ్వకం కార్యకలాపాల్లో భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించారు. పనితీరును మరింత పటిష్ఠపరుచుకోవాలనీ, భద్రత, పర్యావరణ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ మంత్రి సూచిస్తూ, అందుకు తగిన మార్గదర్శనాన్నీ, ఆదేశాల్నీ అందించారు.
మంత్రి ప్రసంగిస్తూ, దేశ ఇంధన భద్రతను పరిరక్షించడంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషించవలసి ఉందన్నారు. ఉత్పాదనకు సంబంధించిన సామర్థ్యంతో పాటే పునరావాసం, పర్యావరణ స్థిరత్వం, ఉద్యోగుల సంక్షేమం కలగలిసి ఉండేటట్టు సమతౌల్య దృష్టికోణాన్ని అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. పునరావాస సంబంధిత కార్యక్రమాలను సమర్థంగా అమలుపరచడంలో బీసీసీఎల్, జేఆర్డీఏలు పరస్పర సమన్వయాన్ని ఏర్పరుచుకొని కృషి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఝరియా బొగ్గుగని ప్రాంతంలో పునరావాసం, సుస్థిరాభివృద్ధి, సురక్షిత బొగ్గుగనుల తవ్వక కార్యకలాపాల దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ఈ పర్యటన కార్యక్రమం మరింత బలోపేతం చేయగలదని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2260929)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2