భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనపై జాతీయ సదస్సు
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 6:24PM by PIB Hyderabad
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: హెచ్.డీ. కుమారస్వామి
"పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన"పై భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) మే 12, 2026న బెంగళూరులో జాతీయ సదస్సును నిర్వహించింది.
సదస్సులో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డీ. కుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలో స్వచ్ఛ రవాణాకు మద్దతుగా ఆధునిక, నమ్మకమైన ఈవీ ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను పట్టణ ప్రాంతాల్లోనే కాక, గ్రామీణ భారతానికి అందుబాటులోకి తీసుకురావాలని, తక్కువ ధరలో విశ్వసనీయమైన ప్రయాణాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తెలియజేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారీ స్థాయిలో ఈవీల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం అత్యవసరమని స్పష్టం చేశారు.
కర్ణాటకలో రూ.123.26 కోట్ల వ్యయంతో 1,243 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకు గౌరవ మంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, సీపీఎస్ఈల పరిధిలో మొత్తం 4,874 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటునకు రూ. 503.86 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ఆమోదిత ప్రతిపాదనల్లో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ హనిఫ్ ఖురేషీ మాట్లాడుతూ.. అవాంతరాలు లేని, భవిష్యత్తు అవసరాలకు అనువైన ఈవీ ఛార్జింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కీలకమని అన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, ట్రక్కుల ఛార్జింగ్ వ్యవస్థలకు ఎంహెచ్ఐ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. దేశంలో తదుపరి తరం విద్యుత్ రవాణా అభివృద్ధికి అవసరమైన సమర్థవంతమైన ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీహెచ్ఈఎల్, ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు, పరిశ్రమ భాగస్వాముల మధ్య సమన్వయం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
పీఎం ఈ-డ్రైవ్తో పాటు ఈవీలను ప్రోత్సహించేందుకు ఎంహెచ్ఐ పలు పథకాలను అమలు చేస్తోంది. అవి.. పీఎల్ఐ ఆటో (రూ. 25,938 కోట్లు), పీఎల్ఐ ఏసీసీ (రూ. 18,100 కోట్లు), పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (రూ. 3,435 కోట్లు), అరుదైన ఖనిజ అయస్కాంతం కోసం ఉద్దేశించిన పథకం (రూ. 7,280 కోట్లు).
దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయటంపై దృష్టి సారించిన సమావేశం
దేశవ్యాప్తంగా ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల (ఈవీ పీసీఎస్) విస్తరణను వేగవంతం చేయటం, భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థను బలోపేతం చేయటం వంటి అంశాలపై చర్చించేందుకు కీలక వేదికగా ఈ సమావేశం నిలిచింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులు, ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు (సీపీఓలు), ఈవీ తయారీదారులు (ఓఈఎంలు), చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ఆటోమొబైల్ పరిశ్రమ సంఘాలు, ఇతర కీలక వాటాదారులు పాల్గొన్నారు.
ఉత్తమ పద్ధతులు, అమలు వ్యూహాలను పంచుకున్న రాష్ట్రాలు
ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన శాఖ) ఐఏఎస్ శ్రీ నవీన్ మిట్టల్, కేరళ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (విద్యుత్ శాఖ) ఐఏఎస్ శ్రీ పునీత్ కుమార్, కేరళ ప్రభుత్వ కేఎస్ఈబీ, సీఎండీ శ్రీ మిన్హాజ్ ఆలం, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (ఇంధన శాఖ) శ్రీ గౌరవ్ గుప్తా, ఒడిశా ప్రభుత్వ రవాణా కమిషనర్ శ్రీ అమితాబ్ ఠాకూర్ వంటి సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణ, వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధించి అనుభవాలను, విధానపరమైన నిర్ణయాలను, రాష్ట్ర స్థాయి వ్యూహాలను అధికారులు పంచుకున్నారు.
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్త ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా విద్యుత్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఈవీ వ్యవస్థ అభివృద్ధికి మద్దతుగా రూ.10,900 కోట్లను కేటాయించేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వివిధ వాహన వర్గాలు, విడిభాగాల విషయంలో డిమాండ్ ప్రోత్సాహకాలను, మౌలిక సదుపాయాల మద్దతును అందిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (ఈ-2డబ్ల్యూ), ఈ-రిక్షాలు, ఈ-కార్టులు, ఎల్5 కేటగిరీ వాహనాలతో కలిపి దాదాపు 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు (ఈ-3డబ్ల్యూ) ప్రోత్సాహకాలను అందించాలని, అదనంగా 14,028లకు పైగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి రూ. 4,391 కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించారు. వాణిజ్య, ప్రజా సేవా రంగాల్లో వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ-అంబులెన్స్లు, ఈ-ట్రక్కులకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు.
మొత్తం కేటాయింపుల్లో రూ.3,679 కోట్లను ఈ-2డబ్ల్యూలు, ఈ-3డబ్ల్యూలు, ఈ-అంబులెన్సులు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగాలకు ప్రోత్సాహకంగా అందించేందుకు కేటాయించారు.
దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. అదనంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణ, ఉన్నతీకరణకు రూ. 780 కోట్లు కేటాయించారు.
విస్తరించగల, విశ్వసనీయమైన ఈవీ మౌలిక సదుపాయాలకు కీలక సహకారం
దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, పరస్పర అనుసంధానత, ప్రామాణీకరణ, విశ్వసనీయతతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఓఎంసీలు, ఓఈఎంలు, సీపీఓలు, అమలు సంస్థల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని ఈ సదస్సు స్పష్టం చేసింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ వ్యవస్థకు మద్దతుగా ఛార్జింగ్ నెట్వర్క్ను వేగంగా విస్తరించటం, ఉమ్మడి సాంకేతిక ప్రమాణాలను పాటించటం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని ప్రతినిధులు తెలిపారు.
స్వచ్ఛ రవాణా లక్ష్యాల పట్ల నిబద్ధతను స్పష్టం చేసిన ఎంహెచ్ఐ
భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు, సంబంధిత సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మరోసారి స్పష్టం చేసింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించటం, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించటంలో స్వచ్ఛ రవాణా వ్యవస్థ కీలకమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2260699)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8