ఆర్థిక మంత్రిత్వ శాఖ
1.5 బిలియన్ డాలర్ల ‘భారత్ నౌకా వాణిజ్య బీమా నిధి’ని ప్రారంభించిన ఆర్థిక సేవల విభాగం
మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకా వాణిజ్య బీమా కవరేజీల్లో అంతరాయాలను తొలగించడం లక్ష్యంగా 1.4 బిలియన్ డాలర్ల (రూ. 12,980 కోట్లు) సార్వభౌమ హామీ
బీఎంఐపీ కింద న్యూ అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జారీ చేసిన తొలి నౌకా నిర్మాణ - యంత్ర యుద్ధ విధాన పత్రాన్ని హోజర్ ఆఫ్షోర్ అండ్ మెరైన్ సంస్థకు అందజేసిన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 8:07PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘భారత్ నౌకా వాణిజ్య బీమా నిధి (బీఎంఐపీ)ని ప్రారంభించారు. అంతరాయం లేకుండా నౌకా వాణిజ్య బీమా సౌకర్యాన్ని కల్పించడం కోసం 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ దేశీయ బీమా నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి 1.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12,980 కోట్లు) సార్వభౌమ హామీని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ నౌకలు లేదా భారత్ నియంత్రణలో ఉన్న నౌకలు లేదా భారత్ నుంచి వెళ్లే/ భారత్కు వచ్చే నౌకలకు ఎదురయ్యే అవకాశమున్న కొన్ని రకాల ముప్పుల నుంచి ఈ నిధి రక్షణ కల్పిస్తుంది. ఓడ స్థూల భాగాలు - యంత్రాలకు వాటిల్లే నష్టం, సరుకు, రక్షణ - పరిహారం, యుద్ధ ప్రమాదాల వంటి అన్ని నౌకా వాణిజ్య ముప్పులతో వాటిల్లే నష్టాలు ఈ నిధి పరిధిలోకి వస్తాయి.
ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, అదనపు కార్యదర్శి శ్రీ దేబాశిష్ ప్రుస్టీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ శ్రీ హితేశ్ జోషి, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ సీఎండీ శ్రీమతి గిరిజా సుబ్రమణియన్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ శ్రీమతి కస్తూరి సేన్గుప్త, ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ ఓపేశ్ కుమార్ శర్మ సహా ఆర్థిక సేవల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోగర్ ఆఫ్షోర్ అండ్ మెరైన్ సంస్థకు.. బీఎంఐపీ కింద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ జారీ చేసిన మొదటి నౌకా నిర్మాణ - యంత్ర యుద్ధ విధాన పత్రాన్ని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు అందించారు. యుద్ధ ముప్పు పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో నౌకలకు ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అలాగే కేబుల్ వైర్ల దిగుమతి కోసం వేదాంత స్టెరిలైట్ కాపర్ సంస్థకు కూడా సముద్ర సరుకు రవాణా యుద్ధ విధాన పత్రాన్ని అందించారు. బలరాంపూర్ చిని మిల్స్ సంస్థకు కూడా ఈ తరహా విధానపత్రాలను జారీ చేశారు.
అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో లేదా ఆంక్షలు ఉన్న ప్రదేశాల మధ్య సాగే నౌకాయానానికి బీమా కవరేజీని నిలిపివేయడం లేదా పరిమితం చేయడం వల్ల రవాణా కార్యకలాపాలు, కీలక వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలుగుతుంది. ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం నుంచి వచ్చే సరుకు లేదా సరుకును తీసుకువెళ్లే నౌకకు వర్తించే ఏదైనా బీమా పాలసీకి.. తిరిగి బీమా చేసే విదేశీ సంస్థలు (రీఇన్సూరర్లు) ఈ ఆంక్షల కారణంగా మద్దతును ఉపసంహరించుకునే అవకాశముంటుంది. రక్షణ, పరిహారం (పీ&ఐ) బీమా కోసం భారతీయ నౌకలు అంతర్జాతీయ రక్షణ - పరిహార క్లబ్బులపైనే ఆధారపడుతుండడం మరో ఆందోళనకరమైన అంశం. చమురు కాలుష్యం, శిథిలాల తొలగింపు, సరుకు నష్టం, సిబ్బందికి గాయాలు, నౌకల మధ్య జరిగే ప్రమాదాల వంటి థర్డ్ పార్టీ బాధ్యతలకు ఈ పీ అండ్ ఐ బీమా రక్షణ కల్పిస్తుంది. సార్వభౌమిక హామీతో కూడిన ఈ బీమా నిధి.. నష్టభయాలను ఎదుర్కొనేందుకు సరిపడా పూచీని సమర్థంగా అందిస్తుంది. తద్వారా నౌకావాణిజ్యంపై దేశానికి పూర్తి స్థాయి నియంత్రణను మరింత మెరుగుపరుస్తుంది.
ఈ బీమా నిధి పనితీరును పర్యవేక్షించడానికి ఒక పాలక మండలిని ఏర్పాటు చేశారు. సార్వభౌమిక హామీ వినియోగానికి సంబంధించిన ఆమోదాలపై ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. దీనితోపాటు నిధికి ఎదురయ్యే అవకాశమున్న సంకటాలను విచక్షణతో, స్థిరంగా, సాంకేతికంగా విశ్లేషించడం కోసం ఒక పూచీకత్తు కమిటీని (అండర్ రైటింగ్ కమిటీ) కూడా ఏర్పాటు చేశారు. ఈ నిధికి పాలక బాధ్యతల్లో జీఐసీ వ్యవహరిస్తుంది. రిటర్నులు, పునర్ భీమా వివరాలు, నిధి పనితీరుపై నివేదికలను ఈ సంస్థ సమర్పిస్తుంది.
నిధి ఉమ్మడి పూచీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని.. ఈ నిధిలో సభ్యత్వమున్న దేశీయ బీమా సంస్థలు పాలసీలను జారీ చేస్తాయి. ఈ రిస్కులకు నిధిలోని సభ్య సంస్థలన్నీ అవి అంగీకరించిన వాటా నిష్పత్తిలో తిరిగి బీమా చేస్తాయి.
100 మిలియన్ డాలర్ల వరకు వచ్చే బీమా క్లెయింలను ఈ నిధి స్వయంగా పరిష్కరిస్తుంది. ఒకవేళ క్లెయిమ్ మొత్తం 100 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటే వాటిని పరిష్కరించడం కోసం సార్వభౌమిక హామీని అమలు చేస్తారు. అయితే నిధిలో ఉన్న నిల్వలు, సభ్యుల వాటాలు, తిరిగి చేసిన బీమా ఏర్పాట్లన్నీ పూర్తిగా ఖర్చయిపోయిన తర్వాతే.. చివరి ఆయుధంగా దీనిని వినియోగిస్తారు.
ఈ బీమా నిధి నౌకావాణిజ్యంపై దేశ సార్వభౌమ నియంత్రణను బలోపేతం చేయడంతోపాటు.. ఆంక్షలు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విదేశీ బీమా సంస్థలు పునర్ భీమా కవరేజీని ఉపసంహరించుకున్నా మన వాణిజ్యం అంతరాయం లేకుండా నడిచేలా చూస్తుంది. నౌకావాణిజ్య ముప్పులను ఎదుర్కోవడంలో దేశ రక్షణ వ్యవస్థను ఇది పటిష్టం చేస్తుంది. భవిష్యత్తులో సురక్షితమైన అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తూ.. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని పెంపొందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2260519)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11