శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సీఎస్ఐఆర్లో జాతీయ సాంకేతికత దినోత్సవం..
సీఎస్ఐఆర్-సెంట్రల్ బిల్డింగ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ రూపుదిద్దిన 13 స్వదేశీ సాంకేతికతలు పరిశ్రమకు బదలాయింపు
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ, మన్నిక కలిగివుండే నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల పరిరక్షణ సంబంధిత సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ సాంకేతికతలు పరిశ్రమకు అప్పగింత
నాడు పోస్టు చేయడమైనది:
12 MAY 2026 10:37AM by PIB Hyderabad
జాతీయ సాంకేతికత దినోత్సవ సూచకంగానూ, సాంకేతికత సారథ్యంలో అభివృద్ధి సాధనతో పాటు స్వయంసమృద్ధి పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూనూ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్ (సీఎస్ఐఆర్) న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ప్రధానకేంద్రంలో తన నెలవారీ సాంకేతికత బదిలీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ‘‘రూర్కీలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ బిల్డింగ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ) ఆధ్వర్యంలో సాంకేతిక బదిలీలు’’ అంశంపై దృష్టిని కేంద్రీకరించారు. దీన్లో భాగంగా.. సంస్థ అభివృద్ధిపరిచిన 13 స్వదేశీ సాంకేతికతల్ని పరిశ్రమలతో పాటు అంకుర సంస్థలకు బదలాయించారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారికి సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ అజయ్ చౌరాసియా స్వాగతం పలికారు. ఆయన.. దేశంలో నూతన ఆవిష్కరణలు ప్రధానపాత్రను పోషిస్తుండగా అభివృద్ధి సాధనలో మునుముందుకు పయనించడంలో పరిశ్రమల అవసరాలను తీర్చడమే ముఖ్యమైన సాంకేతికత వ్యాప్తికి ప్రాధాన్యాన్నివ్వాల్సి ఉందన్నారు.
సంస్థ సాంకేతిక విజయాలతో పాటు సమాజానికి ఉపయోగకరమైన నూతన ఆవిష్కరణలను గురించి సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ డైరెక్టరు ఆచార్య ఆర్. ప్రదీప్ కుమార్ సభకు వివరించారు. సాంకేతికత బదిలీ కార్యక్రమాన్ని జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకొందని ఆయన అన్నారు. సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ తీర్చిదిద్దిన దేశీయ సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలను పరిశ్రమకు అందించడం భారత్ పరిశోధన అనుబంధ విస్తారిత వ్యవస్థ శక్తి అంతకంతకూ బలోపేతం అవుతుండటాన్నీ, దేశ నిర్మాణం దిశగా ఈ సంస్థ అందిస్తున్న తోడ్పాటునీ ప్రతిబింబిస్తోందని ఆచార్య కుమార్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు.. ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణానికి అద్దంపట్టడంతో పాటు సుస్థిర ప్రాతిపదిక ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనలోనూ, సాంకేతికత ఆధారిత అభివృద్ధిని సాకారం చేయడంలోనూ ఒక ముఖ్యపాత్రను కూడా పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూపొందించిన 13 సాంకేతికతలను వివిధ పరిశ్రమలకీ, అంకుర సంస్థలకీ లాంఛనప్రాయంగా ఈ కార్యక్రమంలో బదలాయించారు. ఈ సాంకేతికతలు.. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ, మన్నికైన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల భద్రత, ఇంధన సామర్థ్యంతో పాటు ఉన్నత ప్రమాణాలను కలిగివుండే భవననిర్మాణ సామగ్రి వంటి రంగాలతో ముడిపడిన సాంకేతికతలు కావడం గమనార్హం.
బదలాయించిన ప్రధాన సాంకేతికతల్లో.. :
• కలప, కలపకు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసిన పదార్థాలతో రూపొందించిన ఉపరితలాలపై మంటలు చెలరేగడాన్ని అడ్డుకొనే, పారదర్శక, దృఢ కోటింగ్.
• ఆర్సీసీ నిర్మాణాల భద్రతకు రూపొందించిన ఐపీఎన్ కోటింగ్ సంబంధిత సాంకేతికత.
• కర్బనం పాళ్లను తక్కువ స్థాయిలో వెలువచరించే ఇటుకల తయారీకి సంబంధించిన సాంకేతికత.
• హైబ్రిడ్ సౌర-సహాయంతో రూపుదిద్దిన హీట్ పంప్ వ్యవస్థ.
• గోడలను కాపాడడానికి ఉద్దేశించిన ముందుగానే నిర్మించిన (ప్రి-ఫ్యాబ్రికేటెడ్), అధిక శక్తిమంతమైన స్టీల్ కార్డ్ సంబంధిత అదనపు బలాన్నందించే సాంకేతికత.. వంటివి ఉన్నాయి.
ఈ సందర్భంగా, ‘‘సీఎస్ఐఆర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమం’’ గురించి ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. ఈ వీడియోలో గ్రామీణాభివృద్ధి, సుస్థిర ప్రాతిపదికతో కూడిన సాంకేతికతలలో సీఎస్ఐఆర్ అందించిన తోడ్పాటును కళ్లకు కట్టారు. సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ 2025-26 వార్షిక నివేదికనూ ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.
సభను ఉద్దేశించి సీఎస్ఐఆర్ డెరెక్టర్ జనరల్, డీఎస్ఐఆర్ కార్యదర్శి డాక్టర్ ఎన్. కలైసెల్వి ప్రసంగించారు. సైన్సు, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత చోదకశక్తిగా నిలుస్తుండగా అభివృద్ధి సాధన.. ఇవి అభివృద్ధి చెందిన దేశం దిశగా భారత్ పురోగమిస్తున్న క్రమంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని ఆమె అన్నారు. సీఎస్ఐఆర్ ప్రయోగశాలల్లో అభివృద్ధిపరిచిన దేశవాళీ సాంకేతిక ప్రక్రియల్ని పరిశ్రమలకు అప్పగించడం వల్ల దేశంలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో పటిష్ఠమవుతుందనీ, స్వయంసమృద్ధ భారత్ దృష్టికోణాన్ని త్వరిత గతిన సాకారం చేసుకోవడం సాధ్య పడుతుందనీ ఆమె అన్నారు. ఇటీవల కొన్ని సంవత్సరాల్లో ప్రభావవంతమైన దేశీయ సాంకేతికతలను అనేకంగా అభివృద్ధి చేయడంతో పాటు సామాజికంగానూ, పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగానూ ఉండే సాంకేతికతల రూపంలోకి పరిశోధనల ఫలితాలను మార్చడానికి శ్రమించిన సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ బృందాన్ని డాక్టర్ కలైసెల్వి అభినందించడమే కాక ప్రశంసలను కురిపించారు.
చీఫ్ సైంటిస్టు డాక్టర్ ఎస్.కె. పాణిగ్రాహి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు.
***
(రిలీజ్ ఐడి: 2260184)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15