ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సంరక్షణ రంగంలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్న ఇండియాఏఐ, ఐసీఎంఆర్
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 5:57PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇండియాఏఐ, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)తో ఇవాళ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. భారతదేశంలో బయోమెడికల్, ఆరోగ్య పరిశోధనలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎంఆర్. కృత్రిమ మేధ (ఏఐ)ని బాధ్యతాయుతంగా, విస్తృత స్థాయిలో వినియోగించడం ద్వారా వైద్య సేవల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు.
సహకారానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను ఈ ఎంఓయూ ఏర్పరుస్తుంది. ఇది ఇండియాఏఐ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఏఐ వ్యవస్థ సామర్థ్యాలను బయోమెడికల్ పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో ఐసీఎంఆర్కున్న అనుభవంతో అనుసంధానిస్తుంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన, పరస్పరం అనుసంధానించగల ఏఐ వ్యవస్థను సృష్టించటం ఈ భాగస్వామ్య లక్ష్యం.
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు పరస్పరం సామర్థ్యాలను వినియోగించుకుంటాయి. ఇండియాఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలు, డేటాసెట్ వేదికలు, ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఐసీఎంఆర్ బయోమెడికల్ పరిశోధనా నైపుణ్యం, మెడికల్ ఇన్ఫర్మేషన్ డేటా ఫర్ ఏఐ సొల్యూషన్స్ (ఎంఐడీఏఎస్) వ్యవస్థను సమన్వయం చేయనున్నారు. తద్వారా ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల్లో ఆవిష్కరణలు, పరిశోధనలు, వాటి అమలును ఈ భాగస్వామ్యం ద్వారా ప్రోత్సహించవచ్చు.
సహకారానికి కీలక ఆధారాలు
-
ఏఐకోష్ డేటాసెట్ వేదిక
ఎంఐడీఏఎస్ వ్యవస్థ ద్వారా ఐసీఎంఆర్ రూపొందించిన ఆరోగ్య పరిశోధన డేటాసెట్లు, ఏఐ మోడళ్లు, టూల్కిట్లను ఏఐకోష్ వేదికకు అందించనుంది. ఈ డేటాసెట్లు వ్యక్తిగత వివరాలు వెల్లడించవు. నైతిక నిబంధనల ప్రకారం ఆమోదం పొందినవి. వీటివల్ల భారతదేశంలోని పరిశోధకులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బయోమెడికల్ డేటా సులభంగా అందుబాటులోకి వస్తుంది.
-
కంప్యూట్ యాక్సెస్
భారత ప్రభుత్వం చేపట్టిన ఇండియాఏఐ కార్యక్రమం, నిర్ణీత సేవా ఒప్పందాలకు లోబడి ఐసీఎంఆర్ సంస్థకు సబ్సిడీ ధరలకే జీపీయూ ఆధారిత, అత్యున్నత స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణా రంగంలో అత్యాధునిక ఏఐ పరిశోధనలను మరింత విస్తృతం చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాల అంతరాన్ని ఇది తీరుస్తుందని భావిస్తున్నారు.
-
సహకార ఏఐ వినియోగ పద్ధతుల రూపకల్పన
భారతదేశంలోని ప్రధాన ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం ఏఐ ఆధారిత పరిష్కారాల సహ-అభివృద్ధికి తోడ్పడుతుంది. ఐసీఎంఆర్ వద్ద ఉన్న వ్యాధుల గణాంకాలు, ఇండియాఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరిష్కారాలను రూపొందిస్తారు.
రెండు సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారానికి ఈ ఎంఓయూ కీలకమైనది. 2025 సెప్టెంబర్లో ఇండియాఏఐ, ఐసీఎంఆర్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ డేటా సైన్సెస్ (ఎన్ఐఆర్డీహెచ్డీఎస్) సంస్థలు హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ వ్యవస్థ (జీఆర్ఎన్) ద్వారా అగ్రగామి దేశాలుగా గుర్తింపు పొందాయి. ఆరోగ్య రంగంలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని పెంపొందించేందుకు బ్రిటన్, సింగపూర్లతో కలిసి బహుళ దేశాల ఉమ్మడి కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది.
ఇండియాఏఐ, ఐసీఎంఆర్ (ఎన్ఐఆర్డీహెచ్డీఎస్), హెల్త్ఏఐల మధ్య జరిగిన ఎంఓయూ ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారతదేశ ఆరోగ్య రంగంలో పటిష్ఠమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటానికి ఇది కీలకంగా మారింది.
సాంకేతికత, ప్రజారోగ్య రంగాలను అనుసంధానిస్తూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించటమే ఇండియాఏఐ-ఐసీఎంఆర్ భాగస్వామ్య ఉద్దేశం. నైతిక విలువలు, డేటా గోప్యత, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా ఈ సహకారం తోడ్పడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2258932)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7