|
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, న్యూజిలాండ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక భాగస్వామ్యాన్నీ, అవకాశాల నూతన శకాన్నీ ముందుకు తీసుకెళ్లేలా చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన భారత్, న్యూజిలాండ్ అరుదైన అవకాశాలను అందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే భారత్-న్యూజిలాండ్ ఎఫ్టీఏ: న్యూజిలాండ్ వాణిజ్యం, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్క్లే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం దిశగా కొత్త తరం వాణిజ్య ఒప్పందం: యువత, రైతులు, మహిళలు, చేతివృత్తుల వారు, ఎంఎస్ఎంఈలకు సాధికారత కల్పించేలా సుంకాలను, ప్రతిభను, పెట్టుబడులను, వ్యవసాయ దిగుబడులను భాగం చేస్తుంది ఒప్పందంలోని ప్రాధాన్యాంశాలు: 100 శాతం సుంక రహిత ప్రవేశం, ఫార్మారంగంలో ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, వ్యవసాయ దిగుబడుల్లో భాగస్వామ్యం, ప్రతిభావంతుల చలనశీలత, అంతర్జాతీయ స్థాయికి ఆయుష్, బలమైన మేధో సంపత్తి హక్కులు జౌళి, తోలు, పాదరక్షలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆహార శుద్ధి రంగాలకు ప్రోత్సాహమిచ్చేలా మార్కెట్ అవకాశాల విస్తరణ వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పరిశ్రమలకు ప్రోత్సాహం: భారత దేశం నుంచి ఎగుమతయ్యే 100 శాతం ఉత్పత్తులకు సున్నా సుంకంతో మార్కెట్ అవకాశాలు న్యూజిలాండ్ ద్వైపాక్షిక ఒప్పందంలో 95 శాతాన్నికవర్ చేస్తూ 70 శాతం వస్తువులకు మార్కెట్ అవకాశాలను అందించిన భారత్ వ్యవసాయం, తయారీ, మౌలికవసతులు, అంకురసంస్థలు, ఆవిష్కర్తలు, నూతన సాంకేతికతలను ప్రోత్సహించేలా భారత్లో 20 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులకు అంగీకారం రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పిస్తూ.. పాడి సహా ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ప్రవేశం లేదు: వీటిలో కాఫీ, పాలు, క్రీమ్, చీజ్, పెరుగు, వే, కెసిన్లు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంట నూనెలు, రబ్బర్లు... మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ మార్కెట్ అవకాశాలను, సేవలను అందించిన న్యూజిలాండ్: కంప్యూటర్ ఆధారిత, వృత్తి పరమైన, ఆడియో-విజువల్, టెలికమ్యూనికేషన్, నిర్మాణం, పర్యాటకం, ప్రయాణ సంబంధిత సేవలు సహా 118 సేవా రంగాల్లో నిపుణులకు, అంకుర సంస్థలకు, సేవా సంస్థలకు అత్యధిక విలువ కలిగిన అవకాశాలు 139 ఉప రంగాల్లో అత్యంత ప్రాధాన్య దేశంగా గుర్తింపు ఎలాంటి సంఖ్యాపరమైన పరిమితులు లేకుండా విద్యార్థులకు న్యూజిలాండ్లో విద్యానంతర ఉద్యోగ వీసా జారీ, వృత్తిపరమైన అవకాశాల కల్పన
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 4:05PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఐఎన్-ఎన్జడ్ ఎఫ్టీఏ)పై భారత్, న్యూజిలాండ్ దేశాలు సంతకాలు చేశాయి. భారత దేశ అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఈ ఒప్పందం కుదిరింది. భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్యం, పెట్టుబడుల మంత్రి శ్రీ టాడ్ మెక్క్లే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రెండు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. న్యూజిలాండ్ వాణిజ్యం, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్క్లే నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, 30కి పైగా వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది.
ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయ ప్రారంభాన్ని భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం సూచిస్తుందని శ్రీ మెక్క్లే అన్నారు. ఇది ఉమ్మడి లక్ష్యం, బలమైన సంబంధాలు, పరస్పరం ప్రయోజనం కలిగించే వృద్ధి పట్ల చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని చరిత్రాత్మక సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ తన సందేశంలో వర్ణించారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ఇది మార్కెట్ అవకాశాలను విస్తరిస్తుందనీ, ఎగుమతుల వృద్ధికి తోడ్పడుతుందనీ అన్నారు. వ్యవసాయం లాంటి రంగాల్లో సహకారాన్ని సాధ్యం చేస్తుందని చెప్పారు. అదే సమయంలో స్థిరమైన, నియమాల ఆధారిత వాణిజ్యం, బలమైన ప్రజా సంబంధాల పట్ల ఉమ్మడి నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలియజేశారు.
‘తరానికోసారి లభించే అరుదైన’ అవకాశంగా ఈ ఒప్పందాన్ని శ్రీ మెక్క్లే వర్ణించారు. ఇది ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను అందిస్తుందనీ, ఉద్యోగాలను కల్పిస్తుందనీ, గణనీయమైన ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీస్తుందనీ వివరించారు. ఈ ఒప్పందం ఇప్పటికే కొనసాగుతున్న వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా... రెండు దేశాల మధ్య కొత్త భాగస్వామ్యాల ఏర్పాటును వేగవంతం చేస్తుందనీ, సమగ్ర ఆర్థిక సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
న్యూజిలాండ్ నుంచి బలమైన భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తూ.. 40 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వెల్లడించారు. వారిలో ఎగుమతిదారులు, ఈ రంగంలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు భారత్ వచ్చారని ఆయన తెలియజేశారు. ఇది ఈ ఒప్పందానికున్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుందన్నారు.
మార్కెట్ విస్తృతిని పెంపొందించడం, అవరోధాలను తగ్గించడం, స్పష్టమైన, ఊహించదగిన నియమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఒప్పందం వాణిజ్యాన్ని, పెట్టుబడులను సులభతరం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా అన్ని రకాల పరిమాణాల్లోని వ్యాపారాలకు తోడ్పాటునిస్తుంది. విస్తృత వాణిజ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ప్రజా సంబంధాలు కీలకమైనవని మంత్రి స్పష్టం చేశారు. న్యూజిలాండ్ జనాభాలో సుమారు 6 శాతం మంది భారతీయ మూలాలను కలిగి ఉన్నారని చెప్పారు. వ్యాపారం, విద్య, సైన్స్, సంస్కృతి, క్రీడలు, ప్రజా జీవితం తదితర రంగాల్లో భారతీయ సంతతికి చెందినవారు విశేష సేవలు అందిస్తున్నారని తెలియజేశారు.
ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్న మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఉమ్మడి సైనిక చరిత్ర, క్రికెట్ ప్రధానంగా కొనసాగుతున్న క్రీడా సంబంధాలతో సహా రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి ఆయన వివరించారు.
మారుతున్న అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో, విశ్వసనీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, ఉమ్మడి సంక్షేమాన్ని పెంపొందించడంలో కీలకమైన భాగస్వామిగా భారత్ను న్యూజిలాండ్ భావిస్తోంది..
భారత్ సాధిస్తున్న వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని మంత్రి గుర్తించారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా ఉండేందుకు న్యూజిలాండ్ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.
చర్చల్లో భాగస్వాములైన అధికారుల వృత్తి నైపుణ్యాన్ని, అంకితభావాన్ని మంత్రి అభినందించారు. సమతుల్యమైన, ముందుచూపు కలిగిన, ప్రయోగాత్మక ఫలితాలను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ఒప్పందాన్ని సమర్థంగా అమలు చేయడానికి, ఫలప్రదం చేయడానికి ఉభయపక్షాలు కలసి పనిచేస్తాయి.
ఇరు దేశాల నాయకత్వ దార్శనికతకు, అంకితభావానికి ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు. పరస్పరం గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తులో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే స్పష్టమైన లక్ష్యంపై ఆధారపడి ఉందన్నారు.
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని రైట్ ఆనర్ క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా 2025 మార్చి 16న ఈ చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇండో-పసిఫిక్ అంతటా వాణిజ్యాన్నీ, ఆర్థిక సహకారాన్నీ, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం కోసం రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలు, భాగస్వామ్యంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంది. ఓషియానియా, భారత్ మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 2024-25లో సుమారుగా 26 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. ఓషియానియా ప్రాంతంలో భారత్కు రెండో అతి పెద్ద భాగస్వామిగా న్యూజిలాండ్ ఉంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారుగా 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం అమలుతో రెండు దేశాల మధ్య మెరుగైన మార్కెట్ అవకాశాలు, విస్తృత వాణిజ్య సౌలభ్యం, బలమైన ఆర్ధిక సంబంధాలతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని అంచనా.
అయిదు విడతలుగా జరిగిన అధికారిక చర్చలు, అనేక మధ్యంతర సమావేశాల ద్వారా కేవలం 9 నెలల వ్యవధిలోనే 2025 డిసెంబర్ 22న ఈ ఒప్పందాన్ని రెండు దేశాలూ పూర్తి చేశాయి. అభివృద్ధి చెందిన దేశంతో అత్యంత వేగంగా భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది.
ఒప్పందంపై సంతకాల సందర్భంగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ భాగస్వామ్యంలో నిర్వచనాత్మక మైలురాయిని ఈ ఒప్పందం సూచిస్తుంది. మన రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. గడచిన కొన్నేళ్లలో 38 అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ కుదుర్చుకున్న తొమ్మిదో ఒప్పందమిది. ఎగుమతులు, వ్యవసాయ దిగుబడులు, విద్యార్థులకు ప్రయాణం, నైపుణ్యాలు, పెట్టుబడులు, సేవలను పెంపొందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. 20 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న న్యూజిలాండ్ నిర్ణయం భారత దేశ వృద్ధిపై బలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మహిళా నేతృత్వంలోని సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో రాణించేలా చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది’’ అని వివరించారు.
భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఈ భాగస్వామ్యం పరస్పర విశ్వాసం, సామర్ధ్యాలపై ఆధారపడి ఉంది. న్యూజీలాండ్కు ఎగుమతులు చేయడంలో ఇప్పుడు భారత్ కు సమాన అవకాశాల వేదిక లభించింది. వ్యవసాయ ఉత్పాదకత, సేంద్రియ ఉత్పత్తులు, సేవలు, చలనశీలత, ఆయుష్, మందుల లభ్యతకు తన పరిధిని విస్తరించడం ద్వారా ఈ ఒప్పందం అవకాశాలను సమ్మిళితంగా, భవిష్యత్ ఆధారితంగా మారుస్తుంది. ఈ ఒప్పందం భారత కార్మిక ఆధారిత రంగాలకు బలమైన పోటీతత్వాన్ని అందిస్తుంది. భారత ఎగుమతిదారులకు న్యూజిలాండ్ లోని విస్తృత ప్రాంతీయ వాణిజ్య వ్యవస్థలలో సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. భారతీయ ఎగుమతిదారులు ఇండో-పసిఫిక్లో అధిక పరిమాణంలో, వైవిధ్యంతో కార్యకలాపాలు సాగించగలరు. నేటి అనిశ్చిత ప్రపంచంలో ఈ ఒప్పందం స్థిరత్వాన్ని కల్పిస్తుంది” అని వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సమగ్ర, సమ్మిళిత, విశ్వసనీయ, జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన కొత్త తరం వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటోంది. ఇవి మన కార్మిక ఆధారిత రంగాలకు వాస్తవ మార్కెట్ అవకాశాలను, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాలను అందిస్తాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వాణిజ్యం ద్వారా ఉద్యోగాల సృష్టికి దోహదపడుతూ, యువత, మహిళలు ఎంఎస్ఎంఈలకు సాధికారత కల్పించే ఒక కొత్త దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే, వికసితభారత్ 2047 లక్ష్య సాధన దిశగా సమ్మిళిత, ఆర్థిక స్థిరత్వం దృష్టితో సజావుగా అనుసంధానమై ఉంటుంది. రెండు దేశాల్లోనూ స్థానికంగా ప్రక్రియలు, అనుమతులు పూర్తయిన తర్వాత ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుంది.
ఉత్పాదకత నుంచి ప్రజలకు సంపద: సుంకాలు, నైపుణ్యం, వికసిత్ భారత్ 2047 కోసం మార్పు
వస్తు వాణిజ్యం: ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే న్యూజిలాండ్ విపణిలో నూటికి నూరు శాతం సుంక రహిత ప్రవేశం.
-
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం న్యూజిలాండ్ విపణిలో భారత ఎగుమతులకు నూటికి నూరు శాతం సుంకం లేని ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇది అన్ని రకాల సుంకాలకు వర్తిస్తుంది. వస్త్రాలు, దుస్తులు, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, యంత్రపరికరాలు, శుద్ధి చేసిన ఆహార పదార్థాల వంటి కార్మిక ఆధారిత రంగాల్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ఉపాధికి గణనీయమైన ఊతాన్నిస్తుంది.
-
గతంలో న్యూజిలాండ్ పింగాణీ వస్తువులు, తివాచీలు, వాహనాలు, వాహన విడిభాగాలు వంటి ముఖ్యమైన భారతీయ ఎగుమతులపై పది శాతం వరకు అత్యధిక సుంకాలు విధించేది.
-
న్యూజిలాండ్ ఇతర వాణిజ్య భాగస్వాములతో సమానంగా, ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి లభించే సుంక రహిత విపణి ప్రవేశంతో భారతీయ ఉత్పత్తులు న్యూజిలాండ్లో పూర్తిగా పోటీనివ్వగలవు. ఈ సమాన అవకాశాలు దేశవ్యాప్త కార్మికులు, కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువత, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా తోడ్పాటునందిస్తాయి.
-
ముఖ్యంగా, భారత్ తన తయారీ రంగం కోసం కలప, కోకింగ్ బొగ్గు, లోహ వ్యర్థాలు, తుక్కులను సుంక రహితంగా పొందుతుంది. ఇది ఉత్పత్తి వ్యయాలను తగ్గిస్తూ భారత పరిశ్రమల అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది.
ప్రణాళికాబద్ధమైన మార్కెట్ ప్రవేశం, సున్నిత రంగాలకు రక్షణ
-
భారత ద్వైపాక్షిక వాణిజ్య విలువలో 95 శాతం పరిధిలోకి వచ్చే 70.03 శాతం సుంకం శ్రేణులపై సుంకాల సడలింపులను ప్రతిపాదించింది. దేశ సున్నిత రంగాలను కాపాడుకునేందుకు, 29.97 శాతం సుంకం శ్రేణులను మినహాయింపు జాబితాలో ఉంచింది.
-
మినహాయింపు జాబితాలో చేర్చిన ప్రధాన ఉత్పత్తులు: పాడి ఉత్పత్తులు (పాలు, మీగడ, వే, పెరుగు, చీజ్), జంతు ఉత్పత్తులు (గొర్రె మాంసం మినహాయించి), వ్యవసాయ ఉత్పత్తులు (ఉల్లిపాయలు, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం), చక్కెర, కృత్రిమ తేనె, జంతు, వృక్ష, సూక్ష్మజీవ కొవ్వులు, నూనెలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రత్నాలు, ఆభరణాలు, రాగి, రాగి తయారీ వస్తువులు (కాథోడ్లు, కార్ట్రిడ్జ్లు, రాడ్లు, బార్లు, కాయిల్స్), అల్యూమినియం, అల్యూమినియం తయారీ వస్తువులు (ఇంగోట్లు, బిల్లెట్లు, వైర్ బార్లు) వంటివి.
-
సుంక శ్రేణులలో 30.00%పై తక్షణ సుంకం రద్దు అమలవుతుంది. ఇందులో కలప, ఉన్ని, గొర్రె మాంసం, ముడి చర్మం వంటివి ఉన్నాయి.
-
35.60% సుంకం శ్రేణులను 3, 5, 7, 10 ఏళ్ల వ్యవధిలో దశలవారీగా తొలగిస్తారు. వీటిలో పెట్రోలియం ఆయిల్, మాల్ట్ సారం, వనస్పతి నూనెలు, ఎంపిక చేసిన విద్యుత్, యాంత్రిక పరికరాలు, పెప్టోన్లు మొదలైనవి ఉన్నాయి.
-
4.37 శాతం ఉత్పత్తులు సుంకం తగ్గింపును పొందుతున్నాయి. వీటిలో వైన్, ఔషధాలు, పోలీమీర్స్, అల్యూమినియం, ఇనుము, ఉక్కు వస్తువులు మొదలైనవి ఉన్నాయి.
-
మనుకా తేనె, ఆపిల్ పండ్లు, కివీ పండ్లు, పాల ఆల్బుమిన్లతో సహా ఆల్బుమిన్లు 0.06% సుంక రేటు కోటాల పరిధిలోకి వస్తాయి.
వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యం, రైతుల ఆదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల పెంపుదల.
-
ఈ భాగస్వామ్యం ప్రతిభా కేంద్రాల స్థాపన, ఆధునిక ప్లాంటింగ్ సామాగ్రి, రైతులకు సామర్థ్య పెంపు, ఉమ్మడి పరిశోధన, తోటల నిర్వహణ, కోత అనంతర పద్ధతులు, సరఫరా వ్యవస్థ పనితీరు, ఆహార భద్రత కోసం సాంకేతిక సహకారాన్ని కలిగి ఉంది. యాపిల్ సాగుదారుల ప్రాజెక్టులు, స్థిరమైన తేనెటీగల పెంపక పద్ధతులు ఉత్పత్తిని, నాణ్యతా ప్రమాణాలను పెంచుతాయి.
-
న్యూజిలాండ్ నుంచి ఎంపిక చేసిన వ్యవసాయ ఉత్పత్తులు (ఆపిల్ పండ్లు, కివీ పండ్లు, మానుకా తేనె), ఆల్బుమిన్లకు మార్కెట్ ప్రవేశాన్ని కనిష్ట దిగుమతి ధర, ఇతర భద్రతా చర్యలతో కూడిన సుంక రేటు కోటా వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. ఇది దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, నాణ్యమైన దిగుమతులు, వినియోగదారుల ఎంపికకు దోహదపడుతుంది.
-
ఆపిల్, కివీ, మానుకా తేనె సుంకం రేటు కోటాలను వ్యవసాయ ఉత్పాదకత కార్యాచరణ ప్రణాళికలతో అనుసంధానించారు. సంయుక్త వ్యవసాయ ఉత్పాదకత మండలి వీటిని పర్యవేక్షిస్తుంది. ఇవి సున్నిత దేశీయ వ్యవసాయ రంగాల రక్షణ, మార్కెట్ ప్రవేశాన్ని సమతుల్యం చేస్తాయి.
మానుకా తేనె: ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం 66 శాతం. న్యూజిలాండ్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న దిగుమతులు 14.2 మెట్రిక్ టన్నులు (0.3 మిలియన్ అమెరికన్ డాలర్లు). ప్రపంచం నుంచి: 356.8 మెట్రిక్ టన్నులు (1.9 మిలియన్ అమెరికన్ డాలర్లు). కోటా పరిధిలోని సుంకం రేటు కోటా సంవత్సరానికి 200 మెట్రిక్ టన్నులు. ఇది కిలోకు 20 అమెరికన్ డాలర్ల కనిష్ట దిగుమతి ధరతో, 5 ఏళ్ల కాలంలో 75 శాతం సుంకం తగ్గింపును కలిగి ఉంటుంది. కోటా వెలుపల కిలోకు 30 అమెరికన్ డాలర్ల కనిష్ట దిగుమతి ధర, 5 ఏళ్లలో 75 శాతం సుంకం తగ్గింపు వర్తిస్తుంది. సుంకం వివరాలు: మొదటి ఏడాది 56.1 శాతం, రెండో ఏడాది 46.2 శాతం, మూడో ఏడాది 36.3 శాతం, నాలుగో ఏడాది 26.4 శాతం, ఐదో ఏడాది ఆపై 16.5 శాతం.
-
ఆపిల్ పండ్లు: ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం: 50%. న్యూజిలాండ్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న దిగుమతులు: 31,392.6 మెట్రిక్ టన్నులు (32.4 మిలియన్ అమెరికన్ డాలర్లు). ప్రపంచం నుంచి: 519,651.8 మెట్రిక్ టన్నులు (424.6 మిలియన్ అమెరికన్ డాలర్లు).కోటా పరిధిలోని సుంకం రేటు కోటా (టీఆర్క్యూ): 32,500 మెట్రిక్ టన్నులు (మొదటి ఏడాది), ఇది ఆరో ఏడాది నాటికి 45,000 మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది. ఇది 25% సుంకం, కిలోకు 1.25 అమెరికన్ డాలర్ల కనిష్ట దిగుమతి ధరతో ఉంటుంది (సీజనల్ విండో: ఏప్రిల్ 1 - ఆగస్టు 31). కోటా వెలుపల: ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం వర్తిస్తుంది.
-
కివీ పండ్లు: ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం: 33%. న్యూజిలాండ్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న దిగుమతులు: 5,840 మెట్రిక్ టన్నులు (16.9 మిలియన్ అమెరికన్ డాలర్లు). ప్రపంచం నుంచి: 49,167 మెట్రిక్ టన్నులు (61.4 మిలియన్ అమెరికన్ డాలర్లు). కోటా పరిధిలోని సుంకం రేటు కోటా: 6,250 మెట్రిక్ టన్నులు (మొదటి ఏడాది), ఇది ఆరో ఏడాది నాటికి 15,000 మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది (0% సుంకం వద్ద). ఇది కిలోకు 1.80 అమెరికన్ డాలర్ల కనిష్ట దిగుమతి ధరతో ఉంటుంది (సీజనల్ విండో: ఏప్రిల్ 1 - అక్టోబర్ 15). కోటా వెలుపల: కిలోకు 2.50 అమెరికన్ డాలర్ల కనిష్ట దిగుమతి ధరతో 50% మార్జిన్ ఆఫ్ ప్రిఫరెన్స్ వర్తిస్తుంది.
-
ఆల్బుమిన్లు (పాల ఆల్బుమిన్తో సహా): ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం: 22%. న్యూజిలాండ్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న దిగుమతులు: 3,429.7 మెట్రిక్ టన్నులు (28.9 మిలియన్ అమెరికన్ డాలర్లు). ప్రపంచం నుంచి దిగుమతులు: 18,801.4 మెట్రిక్ టన్నులు (175.3 మిలియన్ అమెరికన్ డాలర్లు). కోటా పరిధిలోని సుంకం రేటు కోటా: 1,000 మెట్రిక్ టన్నులు (మొదటి ఏడాది), ఇది ఐదో ఏడాది నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది (11% సుంకం వద్ద). కోటా వెలుపల: ప్రస్తుతం అమలులో ఉన్న సుంకం వర్తిస్తుంది.
సేవలు: న్యూజిలాండ్ అందించిన అత్యుత్తమ ప్రతిపాదనతో భారత యువత, మహిళలు నిపుణులకు సాధికారత
-
న్యూజిలాండ్లో సుమారు 118 సేవా రంగాలలో భారతదేశానికి మార్కెట్ ప్రవేశ కట్టుబాట్లు ఉన్నాయి. వీటిలో భారతదేశానికి ఆసక్తి ఉన్న కీలక రంగాలైన కంప్యూటర్ సంబంధిత సేవలు, వృత్తిపరమైన సేవలు, ఆడియో విజువల్ సేవలు, ఇతర వ్యాపార సేవలు, టెలికమ్యూనికేషన్ సేవలు, నిర్మాణ సేవలు, పంపిణీ సేవలు, విద్యా సేవలు, పర్యావరణ సేవలు, ఆర్థిక సేవలు, పర్యాటక,ప్రయాణ సంబంధిత సేవలు మొదలైనవి ఉన్నాయి.
-
భారతదేశానికి ముఖ్య ఆసక్తి గల రంగాలను కలిగి ఉన్న సుమారు 139 అనుబంధ రంగాలలో అత్యంత అనుకూల దేశ (మోస్ట్-ఫేవరెడ్ నేషన్ - ఎంఎఫ్ఎన్) నిబద్ధత.
నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు, ప్రపంచ అనుభవాలకు మార్గాల విస్తరణ:
-
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నైపుణ్యం కలిగిన వృత్తులలోని భారతీయ నిపుణుల కోసం ఒక కొత్త 'తాత్కాలిక ఉపాధి ప్రవేశ' వీసా మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఎప్పుడైనా 5,000 వీసాల కోటా ఉంటుంది. మూడు సంవత్సరాల వరకు బస చేసే అవకాశం కల్పిస్తుంది.
-
ఈ మార్గం ఆయుష్ ప్రాక్టీషనర్లు, యోగా శిక్షకులు, భారతీయ వంట నిపుణులు, సంగీత ఉపాధ్యాయుల వంటి భారతీయ వృత్తులకు, అలాగే ఐటి, ఇంజనీరింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్య , నిర్మాణ రంగాల వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాలకు వర్తిస్తుంది. ఇది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి వలసలను, సేవల వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది.
భారతీయ నిపుణులు, విద్యార్థులు, యువత కోసం మెరుగైన చలనశీలత మార్గాలు.
గతంలో ఏ దేశంతోనూ లేని విధంగా మొదటిసారిగా, న్యూజిలాండ్ భారతదేశంతో విద్యార్థుల చలనశీలత, పోస్ట్ స్టడీ వర్క్ వీసాలపై ఒక ప్రత్యేక మార్గాన్ని రూపొందించింది. ఈ ఒప్పందం భారతీయ విద్యార్థులపై ఉన్న సంఖ్యాపరమైన పరిమితులను తొలగిస్తుంది. చదువుకునే సమయంలో వారానికి కనీసం 20 గంటల పనికి హామీ ఇస్తుంది. అలాగే, చదువు తర్వాత ఎస్టీఈఎం బ్యాచిలర్, మాస్టర్స్ గ్రాడ్యుయేట్లకు మూడు సంవత్సరాల వరకు, డాక్టరేట్ హోల్డర్లకు నాలుగు సంవత్సరాల వరకు పని చేసే అవకాశాలను పొడిగిస్తుంది. ఇది నైపుణ్యాభివృద్ధికి, గ్లోబల్ కెరీర్లకు స్పష్టమైన మార్గాలను సృష్టిస్తుంది.
-
అంతర్జాతీయ అనుభవాన్ని, నైపుణ్యాల సముపార్జనను, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించే విధంగా ఈ ఒప్పందం ఏటా 1,000 మంది భారతీయ యువతకు 12 నెలల చెల్లుబాటు గల మల్టిపుల్-ఎంట్రీ వర్కింగ్ హాలిడే వీసాల ద్వారా వారి ప్రవేశాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
దేశ ఆవిష్కర్తలు, పరిశ్రమలు, స్టార్టప్ రంగాల కోసం 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి
-
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ).. భారత్లోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేయడంతోపాటు దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా దేశ వృద్ధి, అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
-
పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు ఆధునిక మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉమ్మడి వ్యూహాలను రూపొందించారు.
-
ఒప్పందంలో భాగంగా హామీ ఇచ్చిన పెట్టుబడులు రావడంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక సమతుల్య సవరణ నిబంధనను చేర్చారు. ఇది ఆర్థిక ఫలితాలు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా, స్పష్టంగా కనిపించేలా సహాయపడుతుంది.
ఔషధాలు, వైద్య పరికరాల కోసం అభివృద్ధి చెందిన మార్కెట్లో వేగవంతమైన ప్రవేశం: కీలక పరిణామం
-
ఔషధ,వైద్య పరికరాల కోసం ఈ ఒప్పందం మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. ఇందులో భాగంగా యూఎస్ ఎఫ్డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, హెల్త్ కెనడా వంటి అంతర్జాతీయ స్థాయి నియంత్రణ సంస్థలు ఇచ్చిన జీఎంపీ, జీసీపీ తనిఖీ నివేదికలను నేరుగా అంగీకరిస్తుంది.
-
దీనివల్ల ఒకే రకమైన తనిఖీలు పదే పదే జరగాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా నిబంధనల అమలు ఖర్చు తగ్గి, ఉత్పత్తులకు వేగంగా అనుమతులు లభిస్తాయి.
ఇది న్యూజిలాండ్కు భారతీయ ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులు పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది.
మేధో సంపత్తి హక్కులు
-
ప్రస్తుతం న్యూజిలాండ్ భౌగోళిక గుర్తింపు చట్టాల ప్రకారం భారత్కు చెందిన వైన్లు, స్పిరిట్లను మాత్రమే అక్కడ నమోదు చేసుకోవడానికి వీలుంది.
-
మేధో సంపత్తి హక్కుల విషయంలో ఒప్పందం అమలులోకి వచ్చిన 18 నెలల్లోపు న్యూజిలాండ్ తన అంతర్గత భౌగోళిక గుర్తింపు చట్టాన్ని సవరించడానికి అంగీకరించింది. భారత్కు చెందిన వైన్లు, స్పిరిట్లతో పాటు ‘ఇతర వస్తువుల’ను కూడా అక్కడ నమోదు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల గతంలో ఐరోపా యూనియన్కు ఇచ్చిన సమాన హోదాను భారత్కు విస్తరించనుంది.
-
ఇది న్యూజిలాండ్ మార్కెట్లో భారతీయ ప్రతిష్టాత్మకమైన జీఐ ఉత్పత్తులకు అధికారిక రక్షణ, గుర్తింపు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తుంది.
ఎంఎస్ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఇంక్యుబేటర్లు, ప్రపంచ విలువ వ్యవస్థ అనుసంధానానికి ఊతం
-
ఈ ఒప్పందం అందరినీ కలుపుకునిపోయేలా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ముఖ్యంగా శ్రమశక్తి ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఎంఎస్ఎంఈలకు,ఉపాధి కల్పనకు ఇది భారీగా తోడ్పడుతుంది.
-
వాణిజ్యపరమైన అడ్డంకులు తగ్గడం, నిబంధనలపై స్పష్టత రావడం వల్ల భారతీయ తయారీ రంగం బలోపేతం అవుతుంది. దీనివల్ల వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులు, దుస్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, ఆహార శుద్ధి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములు అయ్యే అవకాశం లభిస్తుంది.
-
ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ఈ నిర్మాణాత్మక సహకారంలో వాణిజ్య సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఎగుమతులకు సిద్ధం చేసే కార్యక్రమాలను నిర్వహించడం, న్యూజిలాండ్లోని ఎస్ఎంఈ వ్యవస్థతో మన సంస్థల అనుసంధానం వంటివి ఉంటాయి. ముఖ్యంగా మహిళలు, యువత యాజమాన్యంలోని సంస్థలు, అంకుర సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
-
రైతులు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, విద్యార్థులు ఈ ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందుతారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశం, వాణిజ్య అడ్డంకుల తగ్గింపు వారి ఎదుగుదలకు, నూతన ఆవిష్కరణలకు సరికొత్త అవకాశాలను కల్పిస్తాయి.
మూలాధార నియమాలు: సమతుల్యమైన, పటిష్టమైన వ్యవస్థ
-
ఈ ఒప్పందం ప్రతి వస్తువుకు సంబంధించి నిర్దిష్టమైన, సమతుల్యమైన ‘ప్రొడక్ట్ స్పెసిఫిక్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ (ఉత్పత్తి నిర్ధిష్ట మూలాధార నియమాలు)ను అందిస్తుంది. కీలక రంగాల్లో ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థలకు ఇబ్బంది కలగకుండా వస్తువు తయారీలో కీలకమైన మార్పులు ఇరు దేశాల సరిహద్దుల్లోనే జరగాలని సూచిస్తుంది.
-
చిన్న మార్పులు చేసినా లేదా అర్హత లేని పనులు చేసినా ఆ వస్తువులను ఈ ఒప్పందం కింద గుర్తించరు. దీని కోసం సమయపాలనతో కూడిన పటిష్టమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రాయితీలను నిలిపివేసే లేదా రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది.
-
ఈ కఠినమైన చర్యల వల్ల నిబంధనలను పక్కదారి పట్టించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం లేదా ఒప్పందాన్ని దుర్వినియోగం చేయడం సాధ్యపడదు. తద్వారా ఒప్పందం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు కేవలం భారతీయ ఎగుమతిదారులకు మాత్రమే అందుతాయి.
వాణిజ్య పరిష్కార మార్గాలు: భారత పరిశ్రమలకు రక్షణ కవచం
-
యాంటీ-డంపింగ్, రాయితీలు, కౌంటర్ వెయిలింగ్ చర్యలు, ప్రపంచ స్థాయి రక్షణ చర్యలపై ప్రపంచ వాణిజ్య సంస్థ అందించిన నిబంధనలకు ఇరు పక్షాల కట్టుబడి ఉంటాయని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.
-
ఈ ఒప్పందం కింద పన్ను తగ్గింపుల వల్ల ఒకవేళ దిగుమతులు ఒక్కసారిగా పెరిగి, దానివల్ల మన దేశీయ పరిశ్రమలకు నష్టం వాటిల్లినా లేదా ముప్పు పొంచి ఉన్నా.. వెంటనే ఒక ద్వైపాక్షిక రక్షణ యంత్రాంగాన్ని ఈ ఒప్పందం అందిస్తుంది.
-
ఒకవేళ దిగుమతులు భారీగా పెరిగి స్వదేశీ పరిశ్రమలకు నష్టం కలిగిస్తే, ప్రభుత్వం తక్షణమే పలు చర్యలు తీసుకుంటుంది. ఒప్పందంలో భాగంగా ఇస్తున్న అదనపు పన్ను తగ్గింపులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. లేదా దిగుమతి పన్నులను పెంచవచ్చు. అయితే ఈ పెంపు ఒప్పందం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న గరిష్ట పరిమితిని మించకూడదు.
ఎగుమతుల కోసం ఉపయోగించే ముడి సరుకుల దిగుమతులకు వేగవంతమైన విధానం, కస్టమ్స్ ప్రక్రియ, వాణిజ్య సరళీకరణ
-
లావాదేవీల ఖర్చులను తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి, సరిహద్దుల వద్ద తనిఖీ విధానాలను ఆధునీకరించడానికి ఈ ఒప్పందం సమగ్రమైన వాణిజ్య సౌలభ్య చర్యలను చేపట్టింది.
-
సాధారణ వస్తువుల క్లియరెన్స్ ప్రక్రియను 48 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ డెలివరీ, త్వరగా పాడైపోయే వస్తువులను 24 గంటల్లోపు క్లియరెన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
-
అధికారిక ఆర్థిక నిర్వాహకులు, ఆటోమేషన్, కాగితరహిత సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థలకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
-
ఎగుమతి చేసే వస్తువుల తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల దిగుమతి కోసం వేగవంతమైన విధానాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల పన్ను రాయితీల ప్రయోజనం నేరుగా మార్కెట్ ప్రవేశానికి దారితీస్తుంది. ఇది ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవసాయ ఎగుమతిదారులకు ఎంతో మేలు చేస్తుంది.
-
ఇది వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యంలో ముందస్తు అంచనా వేయగలగడం, పారదర్శకత, స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు సుంకాల విధానాలను ఆధునికీకరిస్తుంది.
సురక్షితమైన, సులభతరమైన వాణిజ్యం కోసం స్మార్ట్ నియంత్రణ: పారిశుద్ధ్య, ఫైటోశానిటరీ చర్యలు
-
ఈ ఒప్పందంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య, ఫైటో శానిటరీ (మొక్కల ఆరోగ్య సంరక్షణ), సాంకేతిక వాణిజ్య అడ్డంకులపై ప్రత్యేక అధ్యాయాలు ఉన్నాయి. ఇవి పరస్పర ప్రాతిపదికన మార్కెట్ అందుబాటు దరఖాస్తులను వేగవంతం చేయడం, ధ్రువీకరణ, దిగుమతి అనుమతి విధానాలను సరళతరం చేస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఎస్పీఎస్ ధ్రువీకరణకు వీలు కల్పిస్తాయి.
-
టీబీటీ అధ్యాయం కింద మెరుగైన నియంత్రణ సహకారం, పారదర్శకత వల్ల సుంకాలే కాకుండా ఇతర విధానపరమైన అడ్డంకులు కూడా తగ్గుతాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ముఖ్యంగా ఆహార, వ్యవసాయ, తయారీ రంగాల్లో ఉన్నవారు, న్యూజిలాండ్ మార్కెట్లోకి తక్కువ ఖర్చుతో, సులభంగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.
-
ఈ నిబంధనలు మానవ, జంతు, వృక్ష జీవరాశుల రక్షణకు, ఆరోగ్య భద్రతకు, వస్తువుల వాణిజ్య సౌలభ్యానికి మధ్య సరైన సమతుల్యతను నిర్ధారిస్తాయి.
-
న్యూజిలాండ్ ఉన్నత స్థాయి నియంత్రణ ప్రమాణాల దృష్ట్యా, ఈ గుర్తింపు అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది లావాదేవీల ఖర్చులను తగ్గించి, అవసరమైన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వాణిజ్యం సాఫీగా సాగేలా చేస్తుంది.
మార్గదర్శక ఆర్థిక సహకారం, సాంకేతిక భాగస్వామ్యం
-
వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలలో ఇరు దేశాలకు ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గొప్ప అవకాశాలను కల్పిస్తుంది.
-
ఈ సహకార కార్యకలాపాలలో సామర్థ్య పెంపు, సాంకేతిక సహాయం, ఉత్పాదకతను పెంచే ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడతాయి. కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పరిశోధన, అభివృద్ధి, శిక్షణ, ఆవిష్కరణల వరకు ఈ సహకారం విస్తరిస్తుంది.
-
వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన శాఖ, తేనె, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం, వైన్ తయారీ రంగాలలో పరస్పర సహకారం ఉంటుంది.
-
వ్యవసాయేతర రంగాలలో సాంస్కృతిక మార్పిడిని, రంగాలవారీ వినూత్న ఆవిష్కరణలను బలోపేతం చేసే లక్ష్యంతో.. సాంప్రదాయ వైద్య విధానాలు (ఆయుష్), సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ఆడియో-విజువల్, సృజనాత్మక పరిశ్రమలు, క్రీడలు, పర్యాటక రంగానికి కూడా సహకారం విస్తరిస్తుంది.
సాంస్కృతిక వాణిజ్యం, సాంప్రదాయ జ్ఞానం, ప్రజల మధ్య సహకారం: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో తొలిసారి
-
సంస్కృతి, వాణిజ్యం, సాంప్రదాయ జ్ఞానం, ఆర్థిక సహకారంపై ప్రత్యేకంగా కేటాయించిన ఒక అధ్యాయం ఇరు దేశాల ప్రజల ఆర్థిక, సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చడానికి పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుంది.
-
వాణిజ్య ఒప్పందాల చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ ఆరోగ్య, సాంప్రదాయ వైద్య సేవల అందుబాటు కోసం ప్రత్యేక నిబంధనను చేర్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశీయ ఆయుష్ విధానాలకు అంతర్జాతీయ గుర్తింపును తెస్తుంది. వైద్య విలువ ఆధారిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యం, వెల్నెస్ సేవలలో సహకారానికి తోడ్పడటమే కాకుండా సాంప్రదాయ వైద్య సేవల రంగంలో భారత్ను ప్రపంచ కేంద్రంగా మరింత బలపరుస్తుంది.
-
ఈ ఒప్పందం భారతీయ ఆయుష్ విభాగాలైన ఆయుర్వేదం, యోగా , ప్రకృతి వైద్యం, యునాని, సోవా-రిగ్పా, సిద్ధ, హోమియోపతితోపాటు న్యూజిలాండ్కు చెందిన మావోరీ ఆరోగ్య పద్ధతులకూ ప్రాధాన్యతనిస్తుంది.
-
ఆడియో-విజువల్, సృజనాత్మక పరిశ్రమలు, సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థల పరిరక్షణ, క్రీడలు, పర్యాటక రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా భారత్-న్యూజిలాండ్ మధ్య సాంస్కృతిక, మానవీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
-
ఇది సృజనాత్మక పరిశ్రమలకు, సాంస్కృతిక వినిమయానికి, ప్రజల ప్రయోజనాలే కేంద్రంగా సాగే అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తుంది.
పరస్పర గుర్తింపు ఒప్పందం ద్వారా సేంద్రీయ వాణిజ్యం: ఇండో పసిఫిక్ ప్రాంతానికి ముఖద్వారం
-
ఈ ఒప్పందంలో భాగంగా పరస్పరం అంగీకరించిన మూడో దేశం (ఆస్ట్రేలియా) ప్రమాణాల ఆధారంగా పరస్పర గుర్తింపు ఒప్పందం అమలులోకి వస్తుంది.
-
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 80కి పైగా సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇదే కాలంలో భారత్ నుంచి న్యూజిలాండ్కు జరిగిన మొత్తం సేంద్రీయ ఎగుమతులు 2,401.53 మెట్రిక్ టన్నులు కాగా, వీటి విలువ 3.18 మిలియన్ డాలర్లు. ఈ పరస్పర గుర్తింపు ఒప్పందం తర్వాత మరింత ఆదరణ, మార్కెట్ లభిస్తుందని భావిస్తున్న సేంద్రీయ ఉత్పత్తులలో బాస్మతి బియ్యం, అవిసె గింజలు, అరాబికా చెర్రీ ఏబీ, ఇసాబ్గోల్ (సైలియం హస్క్), సోయాబీన్ ఆయిల్ కేక్, సేంద్రీయ బ్లాక్ టీ వంటివి ఉన్నాయి.
ద్వైపాక్షిక వాణిజ్యం: బలమైన పురోగతి, అపార అవకాశాలు
-
2024 సంవత్సరంలో వస్తు, సేవల మొత్తం వాణిజ్యం 2.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇటీవలి కాలంలో భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక వాణిజ్యం బలమైన వృద్ధిని కనబరిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 1.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది గతేడాది వాణిజ్యంతో పోలిస్తే 49 శాతం వృద్ధిని సూచిస్తుంది.
-
ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడంతో సుంకాల రద్దు, సేవల లభ్యత పెంపు, 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, బలమైన సంస్థాగత వ్యవస్థల ఏర్పాటు వంటి చర్యలు సాధ్యమవుతాయి. ఈ ఒప్పందం వల్ల రాబోయే సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పుంజుకుంటుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఎగుమతులు విస్తరిస్తాయని, ఇరు దేశాల మధ్య మరింత పటిష్టమైన ఆర్థిక భాగస్వామ్యం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
వ్యవసాయం, మత్స్య సంపద నుంచి కర్మాగారాల వరకు: కీలక రంగాలు, రాష్ట్రాలకు బలం
దేశంలోని ప్రధాన ఎగుమతి రంగాలకు సుంకాలు లేని మార్కెట్ సదుపాయం గణనీయమైన ఊతాన్నిస్తుంది. ఎగుమతులకు కీలకమైన టెక్స్టైల్స్, దుస్తుల రంగం, గృహోపకరణాలు, ఫైబర్లు, నూలు, చేనేత ఉత్పత్తులలో అధిక వృద్ధిని, ఉపాధి కల్పనను చూస్తుంది. పండ్లు, మసాలా దినుసులు, తృణధాన్యాలు, కాఫీ, కోకో వంటి ఉత్పత్తులపై సుంకాల రద్దు వల్ల వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు అంతర్జాతీయంగా మరింత పోటీతత్వాన్ని పొందుతుంది. గరిష్ట సుంకాల తొలగింపు వల్ల తోలు, పాదరక్షల పరరిశ్రమ లాభపడుతుంది. తద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. సుంకాల తగ్గింపు ద్వారా యంత్రాలు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బరు వంటి ఇంజనీరింగ్, ఉత్పాదక రంగాలు ప్రయోజనం పొందుతాయి. ఇది దేశ వైవిధ్యభరితమైన ఎగుమతి ఆధారాన్ని, ప్రపంచ విలువ వ్యవస్థలో లోతైన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.
రాష్ట్రాల స్థాయిలో భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఎగుమతి రంగం వైవిధ్యభరితమైన, ప్రత్యేక స్వభావాన్ని ప్రతిబింబిస్తూ, విస్తృతమైన ప్రయోజనాలను అందించనుంది. గుజరాత్-రసాయనాలు, రత్నాలు, మహారాష్ట్ర-ఔషధాలు, ఆటో విడిభాగాలు, తమిళనాడు-వస్త్రాలు, తోలు ఆటో విడిభాగాలు, ఉత్తర ప్రదేశ్-తోలు, తివాచీలు, హస్తకళలు, పంజాబ్-వ్యవసాయ ఉత్పత్తులు, కర్ణాటక-ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పశ్చిమ బెంగాల్-తేయాకు, ఇంజనీరింగ్ వస్తువులు వంటి కీలక ఎగుమతి రాష్ట్రాలు మెరుగైన ధరల పోటీతత్వం వల్ల లబ్ధి పొందనున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి తీరప్రాంత రాష్ట్రాలు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు తేయాకు, సుగంధ ద్రవ్యాలు, వెదురు, సేంద్రీయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభ్యతను పొందగలవు. మొత్తంగా ఈ ఒప్పందం దేశ ఎగుమతుల స్వరూపాన్ని మరింత విస్తృతం చేసి, ప్రపంచ వేదికపై దేశ ఆర్థిక మూలాలను బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2256165)
|