రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని నౌ సేనా భవన్లో నావికా దళ కమాండర్ల సదస్సు-2026 మొదటి ఎడిషన్ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 10:22AM by PIB Hyderabad
నౌసేనా భవన్లో 2026 ఏప్రిల్ 14న భారత నావికాదళ కమాండర్ల సమావేశం (01/2026) ప్రారంభమైంది. నావికా దళాధ్యక్షుడు అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నౌకాదళాధికారులు, ఇతర ప్రాంతాల ఆపరేషనల్, ఏరియా కమాండర్లు, సైనిక ప్రధాన కార్యాలయాలు, నావికా దళ ప్రధాన కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో, ఇంధన భద్రత సహా.. దేశ నౌకాయాన ప్రయోజనాల పరిరక్షణలో నావికా దళ విజయాలను అడ్మిరల్ ప్రశంసించారు. కార్యకలాపాల్లో పెరిగిన వేగం, సేవల్లో సమన్వయం మెరుగుపడడాన్ని అభినందించారు. పోరాట సన్నద్ధతపై నిరంతరం దృష్టి సారించాలని, అలాగే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా.. అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకొని మన దళాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మారుతున్న భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో, అవతలి ప్రాంతంలో తన బాధ్యతలకు భారత నావికా దళం కట్టుబడి ఉంటుందని నావికా దళాధ్యక్షుడు పునరుద్ఘాటించారు. స్నేహపూర్వక దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా.. సమన్వయంతో కూడిన, విశ్వసనీయ విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఈ సమావేశంలో రక్షణ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఇతర సైనిక విభాగాలతో సమన్వయం, నౌకలు - తీర ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచుకోవడం, నిర్వహణ - మరమ్మతులు, సమీకృత భద్రతా పద్ధతులు, శిక్షణ, విదేశీ సహకారం, మానవ వనరుల సమస్యలు, ఆవిష్కరణలు - దేశీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
నావికా దళ కమాండర్లనుద్దేశించి.. రక్షణ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగించారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు. వేగంగా మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా.. ఆర్థిక, సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.
***
(రిలీజ్ ఐడి: 2252676)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7