యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘‘నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిర్వహణలో భాగమయ్యే వారిపై క్రిమినల్ చర్యలను తీసుకోనున్న ప్రభుత్వం’’: కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా
వాడా గైన్ ముగింపు సదస్సులో అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సహకారాన్ని బలోపేతం చేసిన భారత్
‘‘డోపింగ్ ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత చర్య కాదు... అదొక వ్యవస్థీకృత బహుళజాతి సంస్థగా మారింది’’: డా. మాండవియా
‘‘భారత్ కేవలం క్రీడల్లో రాణించడంపైనే కాదు...అత్యున్నత స్థాయి నైతిక విలువలు, సమగ్రతను కాపాడటానికి కూడా కట్టుబడి ఉంది’’: కేంద్ర క్రీడల శాఖ మంత్రి
దేశంలో స్వచ్ఛమైన క్రీడలకు బలమైన చట్టపరమైన సంస్కరణలు, విద్య, సాంకేతికతతో ముందడుగు
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 2:06PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16, 2026: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యాంటీ-డోపింగ్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్స్ నెట్వర్క్ (జీఏఐఐఎన్) ముగింపు సమావేశ ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన... స్వచ్ఛమైన క్రీడలు, డోపింగ్ను ఎదుర్కోవడంలో సహకారంపై భారత్ కు ఉన్న బలమైన నిబద్ధతను వివరించారు.
అంతర్జాతీయ సహకార ప్రాముఖ్యత గురించి కేంద్రమంత్రి తెలిపారు. ‘దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ‘ప్రపంచ డోపింగ్ వ్యతిరేక నిఘా, విచారణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా డోపింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న కీలక భాగస్వాములను ఒకచోట చేర్చిందని ఆయన అన్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ మాండవియా మాట్లాడుతూ భారత్ కేవలం నిబంధనలను పాటించడం కోసమే కాకుండా, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధితో చురుకైన సంస్కరణలను అమలు చేస్తోందని అన్నారు.
జాతీయ డోపింగ్ నిరోధక చట్టం 2022ను ఒక పటిష్టమైన శాసనబద్ధ నిర్మాణంగా పేర్కొంటూ ‘జాతీయ డోపింగ్ నిరోధక సవరణ చట్టం 2025’ నిబంధనలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చిందని తెలిపారు.
నిషేధిత పదార్థాలను సరఫరా చేయడంలో లేదా అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డాక్టర్ మాండవియా స్పష్టం చేశారు.
గతంలో డోపింగ్ నియంత్రణ ప్రయత్నాలు కేవలం ప్రయోగశాల పరీక్షలు, క్రీడాకారుల నిబంధనలకే పరిమితమయ్యేవని డాక్టర్ మాండవీయ గుర్తు చేశారు. అయితే నేడు డోపింగ్ అనేది కేవలం ఒక వ్యక్తి చేసే తప్పు కాదని, అది ఒక వ్యవస్థీకృత బహుళజాతి సంస్థగా మారిందని అని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవస్థలను సమర్థవంతంగా నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బలమైన ప్రపంచ భాగస్వామ్యాల అవసరాన్ని ప్రస్తవిస్తూ వాడా అధ్యక్షుడు విటోల్డ్ బాంకా, ‘‘జాతీయ డోపింగ్ నిరోధక సంస్థలు, చట్ట అమలు సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే విధంగా వాడా తన నిఘా, దర్యాప్తుల నమూనాను అభివృద్ధి చేసింది’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ నమూనా పూర్తిగా భాగస్వామ్యాల మీద ఆధారపడి ఉంటుంది. డోపింగ్ నిరోధక నిపుణుల నైపుణ్యాన్ని, చట్ట అమలు సంస్థల సామర్థ్యాలను ఒకచోట చేర్చుతుంది. దీనికి యూరోపోల్, ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ సంస్థల మద్దతు కూడా ఉంది’’ అని తెలిపారు.
ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న తీరు గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. .వాడా వర్క్షాప్లు, ప్రస్తుత సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల మన దేశ దర్యాప్తు సామర్థ్యాలు, డోపింగ్ నిరోధక వ్యవస్థ గణనీయంగా బలోపేతం అయ్యిందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సరైన దిశలో, వేగంతో ప్రపంచ క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలిపారు.
మౌలిక సదుపాయాలు, ప్రతిభను గుర్తించడం, శాస్త్రీయ శిక్షణ వంటి క్రీడల అభివృద్ధి రంగాల్లో భారత్ చేస్తున్న పెట్టుబడులను మంత్రి మాండవీయ ఈ సందర్భంగా వివరించారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు క్రీడా రంగాన్ని సమూలంగా మారుస్తున్నాయని, తద్వారా క్రీడలు మన జాతీయ గుర్తింపులో అంతర్భాగంగా మారుతున్నాయని అన్నారు.
నైతిక విలువల ప్రాముఖ్యత గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘‘క్రీడా నైపుణ్యంలో క్రీడాకారుల విలువలే అత్యంత ప్రధానమైనవి’’ అని పేర్కొన్నారు. ‘‘క్రమశిక్షణను, నిజాయితీని, వ్యక్తిత్వాన్ని పెంపొందించే శక్తి క్రీడలకు ఉందని, కానీ పెరుగుతున్న పోటీ ఒత్తిళ్ల కారణంగా కొన్నిసార్లు అనాలోచిత లేదా అనైతిక నిర్ణయాలకు దారితీయవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ప్రతి క్రీడా స్థాయిలోనూ నిష్పక్షపాతాన్ని, నిజాయితీని, గౌరవాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
నివారణ చర్యల గురించి చర్చిస్తూ... ‘‘నివారణే అత్యంత ప్రభావవంతమైన వ్యూహం’’ అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ‘‘సరైన సమయంలో సరైన సమాచారాన్ని కలిగి ఉండటం వల్ల క్రీడాకారులు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. దీనివల్ల ఉద్దేశపూర్వకంగా, పొరపాటున చేసే నిబంధనల ఉల్లంఘనలను నివారించవచ్చు’’ అని అన్నారు. ఒక క్రీడాకారుడి ప్రయాణంలో విద్య, అవగాహన నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు.
భారత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)... వర్క్షాప్లు, సెమినార్లు, డిజిటల్ ప్రచారాలు, క్రీడా ఈవెంట్ల ద్వారా అవగాహన కల్పించడం కోసం సమగ్రమైన బహుళ అంచెల విధానాన్ని అనుసరిస్తోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక రూపకల్పన విధానం ద్వారా దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేక విద్యా మాడ్యూళ్లను రూపొందించినట్లు మాండవీయ వెల్లడించారు.
భారత్ అవలంబిస్తున్న క్రియాశీలక విధానం గురించి క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు వివరించారు. ‘‘చట్ట అమలు సంస్థలతో సన్నిహిత సమన్వయం, మెరుగైన సమాజార మార్పిడితో సహా... జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సంస్థాగత, దర్యాప్తు సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి క్రీడల మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కలుషితమైన లేదా నియంత్రణ లేని పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ (భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ), సీడీఎస్ఈఓ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) వంటి సంస్థలతో భాగస్వామ్యం ఎంతో కీలకం. ఇవి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయి’’ అని పేర్కొన్నారు.
క్రీడాకారుల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక పరిష్కారాలను మంత్రి ప్రస్తావించారు. “నో యువర్ మెడిసిన్” అనే మొబైల్ యాప్ ద్వారా క్రీడాకారులు తాము వాడే మందులలో నిషేధిత పదార్థాలు ఉన్నాయో లేదో స్వయంగా తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. కలుషితమైన మందుల సమస్యను పరిష్కరించడానికి, క్రీడాకారుల రక్షణ కోసం ప్రముఖ సంస్థలలో అధునాతన పరీక్షా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
డోపింగ్ పరీక్షలు, అమలులో సాధించిన పురోగతిని డాక్టర్ మాండవీయ వివరించారు. 2019లో సుమారు 4,000గా ఉన్న డోపింగ్ నిరోధక పరీక్షల సంఖ్యను గత ఏడాదిలో దాదాపు 8,000కు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. 2019లో 5.6 శాతంగా ఉన్న ఉల్లంఘనల రేటు ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. నిరంతర అవగాహన, నివారణ చర్యల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
నాడా ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ అనంత్ కుమార్ దేశపు డోపింగ్ నిరోధక ప్రయత్నాల పరిధిని, పరిణామ క్రమాన్ని వివరించారు. ‘‘ఇటీవలి కాలంలో మా పరీక్షా విధానం గణనీయంగా విస్తరించింది. దీనికి తోడు ప్రమాదాల గుర్తింపు, ఫలితాల ఆధారిత విధానాల వైపు మేం మారాము. అయితే కేవలం పరీక్షలు మాత్రమే సరిపోవని గుర్తించి సమగ్రత, నిఘా, విద్యా అవగాహనలను మా డోపింగ్ నిరోధక వ్యవస్థలో ప్రధాన భాగాలుగా చేర్చాం’’ అని పేర్కొన్నారు.
పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థను మరింత బలోపేత చేయడానికి, వాడా ప్రమాణాలకు అనుగుణంగా భారత్ లో కొత్త డ్రగ్ పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
భారతదేశ నిబద్ధతను తెలియజేస్తూ... ‘‘ఏ ఒక్క సంస్థ కూడా ఒంటరిగా డోపింగ్ సవాలును ఎదుర్కోలేదు’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, క్రీడా సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. ‘‘భారత్ కేవలం క్రీడల్లో రాణించడం మీదనే కాకుండా.. అత్యున్నత స్థాయి సమగ్రతను కాపాడటానికి కూడా కట్టుబడి ఉంది’’ అని పేర్కొన్నారు. క్రీడలు ఎప్పుడూ నిష్పక్షపాతంగా, క్రీడా విలువలకు అనుగుణంగా ఉండేలా చూడటమే మనందరి ఉమ్మడి లక్ష్యానికి ఈ సమావేశం ఒక నిదర్శమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాడా నిఘా, పరిశోధనల డైరెక్టర్ శ్రీ గుంటర్ యంగర్, ఇంటర్పోల్ ప్రతినిధి శ్రీ ఫ్రాన్సిస్కో పోర్చుగల్ కూడా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252647)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10