ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్-2026 తొలి సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రజా కేంద్రీకృత, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" బ్రిక్స్-2026 ఇతివృత్తం
సహకారం, పరస్పరం నేర్చుకోవటం, ఆధారాలతో విధాన రూపకల్పన ద్వారా అనుకూలమైన, స్థితిస్థాపకత గల ఆరోగ్య వ్యవస్థల నిర్మాణమే లక్ష్యంగా దృష్టి సారించనున్న ఆరోగ్య కార్యవర్గం: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
నివారణ, ప్రజా సంక్షేమం, సమగ్ర ఆరోగ్యమే లక్ష్యంగా "ఆరోగ్యకరమైన జీవనశైలి”, "మానసిక వికాస ప్రోత్సాహం" వంటి రెండు నూతన ప్రాధాన్యతా అంశాలను ప్రవేశపెట్టిన భారత్
భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ వ్యూహాత్మక లక్ష్యాలుగా కొనసాగనున్న ప్రాధాన్యతా అంశాలు క్షయ వ్యాధి పరిశోధనా వ్యవస్థ, సాక్ష్యాధారిత సంప్రదాయ వైద్యం
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 7:12PM by PIB Hyderabad
బ్రిక్స్ వ్యవస్థ ద్వారా హెల్త్ వర్కింగ్ గ్రూప్ (హెచ్డబ్ల్యూజీ)-2026 తొలి సమావేశాన్ని భారత ప్రభుత్వ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించింది. ప్రజారోగ్య రంగంలో పరస్పర సహకారం, ప్రాధాన్యతా అంశాలపై చర్చించటానికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా వంటి బ్రిక్స్ సభ్యదేశాల నుంచి సీనియర్ ఆరోగ్య అధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్-2026 "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" ఇతివృత్తంతో సాగుతుంది. రియో-2025 సదస్సులో గౌరవ ప్రధానమంత్రి స్పష్టం చేసినట్లుగా.. ఇది ప్రజా సంక్షేమం, మానవత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతిస్పందించే, సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సహకార వ్యవస్థలను బలోపేతం చేయాలన్న భారత నిబద్ధతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది.

సమావేశం ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ.. బ్రిక్స్ సభ్య దేశాలకు స్వాగతం పలికారు. ప్రజారోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించటానికి హెల్త్ వర్కింగ్ గ్రూప్ కీలక వేదికని ఆమె అన్నారు.
ఇటీవల సంవత్సరాల్లో జరిగిన బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, తక్కువ ధరకే మందుల లభ్యత వంటి కీలక ఆరోగ్య సవాళ్లపై సహకారానికి మార్గం సుగమం చేశాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత, ఆరోగ్య రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, అందరికీ ఆరోగ్య భద్రతను అందించటంలో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి.
భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్-2026లో ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. బ్రిక్స్ దేశాల విభిన్న ఆరోగ్య వ్యవస్థలను, సామాజిక-ఆర్థిక పరిస్థితులను గుర్తిస్తూనే.. సమగ్రమైన, స్థిరమైన, సాక్ష్యాధారిత ఆరోగ్య సహకారాన్ని పెంపొందించటమే ఆరోగ్య వర్కింగ్ గ్రూప్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. విస్తరించదగిన, ప్రభావవంతమైన ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించటానికి అనుకూలత, పరస్పరం నేర్చుకోవటం, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించుకునే ప్రాముఖ్యతను ఆమె తెలియజేశారు.
ఉత్తమ విధానాలను పంచుకోవటం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించగల స్థితిస్థాపక ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలకు వరుసగా జరిగిన బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాలు, డిక్లరేషన్లు నిరంతరం ప్రాధాన్యతనిస్తున్నాయని కార్యదర్శి స్పష్టం చేశారు. ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, టీకాలు, ఔషధాల సమాన లభ్యత, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రస్తుత ప్రాధాన్యతలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూనే భారత అధ్యక్షతన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రెండు నూతన ప్రాధాన్యతా అంశాలను ప్రతిపాదించారు.
-
ఆరోగ్యకరమైన జీవనశైలికి బ్రిక్స్ మిషన్... ఇది ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించటం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం, పొగాకు వాడకం, మద్యపానం వంటి ప్రధాన ప్రమాద కారకాలను అరికట్టటం లక్ష్యంగా పెట్టుకుంది.
-
మానసిక ఆరోగ్యం, వికాసాన్ని పెంపొందించటం... మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయటం, సామాజిక వివక్షను తొలగించటం, మానసిక ఆరోగ్యాన్ని విస్తృత ప్రజారోగ్య వ్యవస్థలో చేర్చటంపై ఇది దృష్టి సారిస్తుంది.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ, సుస్థిరాభివృద్ధి సాధనలో.. జీవవైవిధ్యం, దేశీయ విజ్ఞాన వ్యవస్థల ఆధారంగా రూపొందిన సాక్ష్యాధారిత సంప్రదాయ వైద్యం అత్యంత విలువైనదని ఆమె స్పష్టం చేశారు. ఈ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
వివిధ దేశాల మధ్య సహకారం, భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ... హెల్త్ ట్రాక్ పరిధిలో జరిగే చర్చలు బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయని, పరస్పర అవగాహనను పెంచుతాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో ఉమ్మడి లక్ష్యాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చటానికి ప్రతినిధులందరూ క్రియాశీలకంగా పాల్గొని, సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించటంలో సమగ్రమైన, సమష్టి విధానాన్ని ప్రతిబింబిస్తూ.. బ్రిక్స్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ గుర్తించిన తొమ్మిది ప్రాధాన్యత అంశాలపై ఈ సమావేశం చర్చించింది. వీటిలోని అంశాలు: (I) బ్రిక్స్ టీబీ పరిశోధన వ్యవస్థ (ii) బ్రిక్స్ వైద్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థల మధ్య సహకారం (iii) సామూహిక అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందనకు బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (iv) నిరంతర సంరక్షణకు డిజిటల్ హెల్త్ ఆర్కిటెక్చర్ (v) ఆరోగ్యకరమైన జీవనశైలికి బ్రిక్స్ మిషన్ (vi) మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించటం (vii) సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్యం (టీసీఐఎం) (viii) సామాజిక పరిస్థితుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై పోరాటం (డీడీఎస్డీహెచ్) (ix) జాతీయ ప్రజారోగ్య సంస్థల బ్రిక్స్ వ్యవస్థ.

పరిశోధన, ఆవిష్కరణలు, నియంత్రణల సమన్వయం, డిజిటల్ ఆరోగ్యం, అందరికీ సమానంగా ఆరోగ్య సేవలను అందించటంలో సహకారాన్ని బలోపేతం చేయటమే కాక, బ్రిక్స్ దేశాల మధ్య సమష్టి సంసిద్ధతను, స్థిరత్వాన్ని పెంపొందించటమే ఈ ప్రాధాన్యతా అంశాల లక్ష్యం.
భారతదేశ నాయకత్వాన్ని, ఆవిష్కరణలు, సహకారం, స్థిరత్వం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించాలనే ఉమ్మడి ఇతివృత్తాన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మానసిక సంక్షేమాన్ని పెంపొందించటం వంటి నూతన ప్రాధాన్యతలతో పాటు సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య పద్ధతులను ఆరోగ్య వ్యవస్థల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనకు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాలు మద్దతిచ్చాయి. బ్రిక్స్ టీబీ రీసెర్చ్ వ్యవస్థ ద్వారా క్షయవ్యాధి నివారణలో సహకారాన్ని మరింత పెంచటం, అంటువ్యాధుల కోసం ఉద్దేశించిన బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను బలోపేతం చేయటం, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచటం ద్వారా (ముఖ్యంగా మారుమూల, వెనుకబడిన వర్గాలకు) వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావటం వంటి అంశాలపై వారు ఆసక్తి కనబరిచారు. ఔషధాల నియంత్రణలో పరస్పర సహకారం, మందులు, వ్యాక్సిన్ల స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. వివిధ ప్రకటనల ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీ, సామాజిక పరిస్థితుల వల్ల తలెత్తే వ్యాధులను, ఆరోగ్యానికి సంబంధించిన సామాజిక అంశాలను పరిష్కరించటం, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటం వంటి ఉమ్మడి లక్ష్యాలని సభ్య దేశాలు స్పష్టం చేశాయి.

ప్రాధాన్యత గల లక్ష్యాలపై ఏకాభిప్రాయంతో బ్రిక్స్ హెల్త్ ట్రాక్-2026 పరిధిలో జరగబోయే సాంకేతిక సమావేశాలు, మంత్రిత్వ స్థాయి చర్చల ద్వారా భవిష్యత్ కార్యాచరణపై అంగీకారంతో ఈ సమావేశం ముగిసింది.
భాగస్వామ్యం, ఆవిష్కరణలు, ఉమ్మడి బాధ్యత ద్వారా ప్రపంచ ఆరోగ్య భద్రతకు అర్థవంతమైన సహకారాన్ని అందించేందుకు బ్రిక్స్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2252618)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23