ఉప రాష్ట్రపతి సచివాలయం
ఐఐపీఏలో ‘‘సుపరిపాలన కోసం ఏఐ’’ అంశంపై జరిగిన 5వ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి.. సమాజ శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఒక శక్తిమంతమైన సాధనంగా మలుచుకోవాలని పిలుపు
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ ఆలయ సందర్శనను గుర్తుచేసుకుంటూ.. ఆయన సంకల్పాన్ని కొనియాడిన ఉపరాష్ట్రపతి
ప్రభుత్వాలు గతంలో కంటే మెరుగ్గా సేవలు అందించడంలో సహాయపడుతున్న కృత్రిమ మేధ: ఉపరాష్ట్రపతి
సమ్మిళిత, సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వికసిత్ భారత్ నిర్మాణానికి ఏఐ శక్తిమంతమైన సాధనం: ఉపరాష్ట్రపతి
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతను బలోపేతం చేసే ఏఐ వినియోగంలో ముందు వరుసలో భారత్: ఉపరాష్ట్రపతి
కృత్రిమ మేధ కేవలం సాంకేతిక విప్లవం మాత్రమే కాదు.. అది ఒక మానవ విప్లవం: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 1:28PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలో జరిగిన ఐఐపీఏ 72వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ముఖ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘‘సుపరిపాలన కోసం కృత్రిమ మేధ’’ అంశంపై 5వ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వార్షిక స్మారక ఉపన్యాసం ఇచ్చారు.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు ఘన నివాళులు అర్పిస్తూ... ఆయన నైతిక విలువలను, దృఢ సంకల్పాన్ని ఉపరాష్ట్రపతి కొనియాడారు. అప్పటి కాలంలోని ప్రముఖ నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, రాజేంద్ర ప్రసాద్ వెనకడుగు వేయకుండా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజేంద్ర ప్రసాద్ నిరాడంబరత, నిజాయితీ, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నిజమైన పాలన అంటే అధికారం చలాయించడం కాదని, ప్రజలకు సేవ చేయడమేనని ఆయన జీవితం నిరూపించిందని చెప్పారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా, భారత తొలి రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన పేరు మీద ఈ ఉపన్యాస కార్యక్రమం నిర్వహించడం ఎంతో గౌరవమని కొనియాడారు.
ప్రస్తుతం ప్రపంచం మానవ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన దశలో ఉందని, మనం కృత్రిమ మేధ యుగంలో జీవిస్తున్నామని ఉపరాష్ట్రపతి అన్నారు. యంత్రాలు నేర్చుకోగలవు, వ్యవస్థలు ఆలోచించగలవు అనే స్థితికి చేరుకున్నామన్నారు. పాలన రంగాన్ని కృత్రిమ మేధ సరికొత్తగా మారుస్తోందని, ప్రభుత్వాలకు ఇది ఒక అద్భుత శక్తి వంటిదని ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడం, స్పందించడం, గతంలో కంటే మెరుగ్గా సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. పాలన అంటే కేవలం నియమాలు, వ్యవస్థలకు మాత్రమే కాదని, ప్రజలకు సాధికారత కల్పించడం, ఎవరూ వెనకబడిపోకుండా చూడటమే అసలైన లక్ష్యామని. దానిని సాధించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
2047 నాటికి వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో కృత్రిమ మేధ కీలక సాధనమని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. దీని వల్ల పాలన మరింత వేగంగా, తెలివిగా, పారదర్శక సమాచారంతో సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అత్యంత వెనకబడిన వారికి కూడా ప్రభుత్వ సేవలు ఎంతో గౌరవప్రదంగా, కచ్చితత్వంతో అందేలా ఏఐ వీలు కల్పిస్తోందని.. దీనివల్ల లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందుతాయని చెప్పారు. దీంతో అవినీతి లేదా వృథాను తగ్గించడం ద్వారా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికత బలోపేతం అవుతుందని తెలిపారు. విధానాలకు, ప్రజలకు మధ్య ఏఐ ఒక వారధిలా పనిచేస్తుందని, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని అన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రజలకు ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం పెంచడానికి ఇది తోడ్పడుతుందని తెలిపారు.
కృత్రిమ మేధ రంగంలో పురోగతిని ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమ్మిళిత పాలన కోసం ఏఐని ఉపయోగించడంలో మన దేశం ప్రపంచంలోనే ముందంజలో ఉందని ఉపరాష్ట్రపతి చెప్పారు. భారత్ వంటి విభిన్న భాషలున్న దేశంలో ఏఐ ఆధారిత వేధికలు భాషాపరమైన అడ్డంకులను అధిగమిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటు పత్రాలు ఇప్పుడు కృత్రిమ మేధ ద్వారా అనేక భారతీయ భాషల్లో అందుబాటులోకి రావడం గర్వకారణమని చెప్పారు. సమ్మిళిత పాలన, భాషా సాధికారత దిశగా భారత్ కు చెందిన ఏఐ ఆధారిత భాషా వేదిక అయినటువంటి భాషిణి ఒక గొప్ప చర్యగా ఆయన కొనియాడారు.
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం గురించి ఉపరాష్ట్రపతి వివరించారు. ఆరోగ్య రంగంలో ఏఐ సహాయక టీబీ స్క్రీనింగ్, పోర్టబుల్ ఎక్స్-రే పరికరాలు, ఈ-సంజీవని వంటి టెలిమెడిసిన్ వేదికలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని ఆయన అన్నారు. దీనివల్ల వైద్యం అందుబాటుకు దూరం అనేది ఇకపై ఒక అడ్డంకి కాబోదని చెప్పారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, సైబర్ భధ్రత, న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థల్లో కూడా ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. పాలన ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్నట్లే.. ఇప్పుడు ఏఐ కూడా ప్రతి రంగంపై తన ప్రభావాన్ని చూపుతోందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన భారత్ చేరిందని.. ముఖ్యంగా ఏఐ అభివృద్ధిలో మన దేశం ఉన్నత స్థానంలో నిలిచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలోని సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇండియా ఏఐ మిషన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి కీలక పథకాలను ఆయన ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ నాయకత్వం వహించడంపై ప్రపంచ గుర్తింపు లభించిందని, భారత ఏఐ సామర్థ్యంపై అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.
కృత్రిమ మేధ వంటి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని యువత, నిపుణులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ప్రజల్లో ఉన్న అపోహాలను గుర్తు చేస్తూ.. సాంకేతికత అనేది ఎప్పుడూ కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, ప్రజలను శక్తిమంతులను చేస్తుందని చెప్పారు. ఏఐ రంగంలో నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడం ముఖ్యమని అన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్, జాతీయ విద్యా విధానం, యువ ఏఐ వంటి కార్యక్రమాలు భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా యువతను సిద్ధం చేస్తున్నాయని వివరించారు.
కృత్రిమ మేధ వినియోగంలో నైతికత గురించి మాట్లాడుతూ.. ప్రతి సాంకేతిక శక్తి బాధ్యతాయుతంగా ఉండాలని ఉపరాష్ట్రపతి హెచ్చరించారు. కృత్రిమ మేధ అనేది ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంగా, నైతిక విలువలతో కూడి ఉండాలని, అప్పుడే అది మానవాళికి మేలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఏఐ కేవలం సాంకేతిక విప్లవం మాత్రమే కాదని, అది ఒక మానవ విప్లవమని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. సుపరిపాలన కోసం కృత్రిమ మేధను ఒక శక్తిగా వాడుకోవాలని, తద్వారా న్యాయమైన, సమ్మిళితమైన, కరుణతో కూడిన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. మెరుగైన భవిష్యత్తు కోసం వివేకంతో, బాధ్యతతో ఈ మార్పునకు నాయకత్వం వహించాలని అందరినీ కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, ఐఐపీఏ కార్యనిర్వాహక మండలి చైర్మన్ డాక్టర్ జితేంద్ర సింగ్, ఐఐపీఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్డేతో పాటు ఇతర ప్రముఖులు, అధ్యాపకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2252229)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12