ఔషధాల విభాగం
9వ ఇండియా ఫార్మా ముఖ్యాంశాలు: విధానపరమైన ప్రోత్సాహం, ఆవిష్కరణలే ఈ రంగ వృద్ధికి కీలకం
బయోసిమిలర్స్, ప్రత్యేక ఔషధాలపై దృష్టి సారించటం ద్వారా ప్రపంచ ఔషధ రంగంలో అగ్రగామిగా భారత్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా
కేవలం ఉత్పత్తులకు పరిమితం కాకుండా, నూతన ఆవిష్కరణలపై ఔషధ రంగం దృష్టి సారించాలన్న కేంద్ర సహాయమంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్.. పరిశ్రమలు-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 3:54PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధాల విభాగం (డీఓపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఫార్మా-2026, 9వ ఎడిషన్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు (ఏప్రిల్ 13 నుంచి14), అంతర్జాతీయ ఫార్మా, ఆరోగ్య సంరక్షణ రంగ కీలక భాగస్వాములను ఒకచోటకు చేర్చింది. ఆవిష్కరణలు, స్వావలంబన, ప్రపంచ నాయకత్వం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు.
సమావేశ ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించారు. ఈ వేదిక భారత ఔషధ రంగ శక్తిని, అంతర్జాతీయంగా ఈ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందన్నారు. తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను అందించటంలో అగ్రగామిగా ఉన్న భారత్.. "ప్రపంచ ఫార్మసీ" గా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రపంచం ఇప్పుడు బయోలాజిక్స్, బయోసిమిలర్స్, ప్రత్యేక ఔషధాల వైపు ఆసక్తి చూపుతోందని చెప్పారు. "మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ మారటమే కాక, ప్రపంచ నాయకత్వ శక్తిగా ఎదగటానికి సిద్ధంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, పరిశోధనా సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూ.10,000 కోట్ల వ్యయంతో ఇటీవల ప్రారంభించిన బయోఫార్మా శక్తి కార్యక్రమం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఫార్మాస్యూటికల్, వైద్య సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే పీఆర్ఐపీ పథకం వంటి అనుబంధ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఇవి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటానికి, వినూత్న చికిత్సా పద్ధతుల అభివృద్ధిని వేగవంతం చేయటానికి దోహదపడతాయి. స్వావలంబన, పటిష్టమైన సరఫరా వ్యవస్థలను పెంపొందించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు, బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాల మద్దతుతో దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయటం ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా సరసమైన ధరలకే నాణ్యమైన మందులు అందించే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చౌకగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
చర్చలను ప్రోత్సహించేందుకు, భాగస్వామ్యాలను పెంపొందించేందుకు, ఈ రంగానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఇండియా ఫార్మా-2026 కీలక వేదిక కానున్నట్లు ఆయన తెలిపారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి జెనరిక్ ఔషధాల అగ్రగామి దేశం స్థాయి నుంచి బయోఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్త జెనరిక్ ఔషధాల సరఫరాలో దాదాపు 20 శాతాన్ని భారత్ అందిస్తోందని, ప్రపంచ టీకాల అవసరాల్లో సుమారు 70 శాతం భారత్ తీరుస్తోందని వెల్లడించారు. ఇది దేశ తయారీ రంగంలో పటిష్టమైన సామర్థ్యాలను స్పష్టం చేస్తున్నాయన్నారు.
భవిష్యత్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.."ప్రపంచవ్యాప్తంగా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి బయోసిమిలర్స్ మార్కెట్ 75 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువలో దాదాపు 87 శాతం వాటా వినూత్న ఔషధాలదేనని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఆవిష్కరణల ఆధారిత విభాగాలపై భారత్ మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
ఔషధాల పరిశోధన, అభివృద్ధిలో కృత్రిమ మేధ అనుసంధానం గురించి శ్రీమతి పటేల్ వివరించారు. అధునాతన పరిశోధనలు, ఆవిష్కరణలకు సహకరించేందుకు ఎన్ఐపీఈఆర్, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా మానవ వనరులను బలోపేతం చేయటం కీలకమని ఆమె స్పష్టం చేశారు.
ఆవిష్కరణల వేగాన్ని పెంచాల్సిన అవసరముందని, అంకుర సంస్థల వ్యవస్థలను బలోపేతం చేయాలని, క్లినికల్ ట్రయల్స్, అధునాతన పరిశోధనల కోసం పటిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్మించాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి స్పష్టం చేశారు. మెరుగైన నిధుల లభ్యత, పరిశ్రమ, ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారం, నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రసంగిస్తూ.. నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించటానికి, పరిశోధనల నిర్వహణను సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా భారతదేశాన్ని "ప్రపంచ ఫార్మసీ" స్థాయి నుండి "ప్రపంచ ఆవిష్కర్త"గా మార్చడమే లక్ష్యమని తెలిపారు.
ఫిక్కీ ఫార్మా కమిటీ ఛైర్మన్, మ్యాన్ కైండ్ ఫార్మా సీఓఓ శ్రీ అర్జున్ జునేజా మాట్లాడుతూ.. భారతదేశపు పటిష్టమైన ఔషధ రంగాన్ని కొనియాడారు. దేశంలో 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ కేంద్రాలున్నాయని.. వీటిలో అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకనుగుణంగా పనిచేసే ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు. ఆవిష్కరణల వృద్ధిని సాధించేందుకు భారత్, అంతర్జాతీయ సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని స్పష్టం చేశారు.
ఫిక్కీ ఫార్మా కమిటీ సహాధ్యక్షుడు, సిప్లా కంపెనీ ఎండీ, గ్లోబల్ సీఈఓ శ్రీ అచిన్ గుప్తా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రెండు రోజుల పాటు జరిగే సదస్సు, ప్రదర్శనలో.. ఆవిష్కరణల కోసం విధానపరమైన ముసాయిదాలు, ఔషధ ఆవిష్కరణల్లో కృత్రిమ మేధ, భవిష్యత్ సాంకేతికతలు, జీవ శాస్త్ర రంగంలో భారత ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చలు జరగనున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగ భవిష్యత్ ప్రణాళికను రూపొందించటంలో, ప్రపంచ ఆరోగ్యత సంరక్షణ రంగాలో అగ్రగామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయటంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2251661)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5