యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పురోగతికి పార్లమెంటులో మహిళల పాత్ర కీలకం: డాక్టర్ మాండవీయ
మై భారత్ మహిళా యూత్ పార్లమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నారీ శక్తి
నారీ శక్తి అధినియం... విప్లవాత్మక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 APR 2026 8:15PM by PIB Hyderabad
'నారీ శక్తి: వికసిత్ భారత్ కీ ఆవాజ్-సమ్మిళిత ప్రజాస్వామ్య బలోపేతం' ఇతివృత్తంతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ కామర్స్ కాలేజీలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ (మై భారత్), మహిళా యువ పార్లమెంటును విజయవంతంగా నిర్వహించింది. వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశభక్తితో, స్ఫూర్తిదాయకంగా కొనసాగింది.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి శాఖ కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో మహిళల నిర్మాణాత్మక పాత్రను కొనియాడారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల వరకూ ఎదిగేలా భారత ప్రజాస్వామ్యం మహిళలను శక్తిమంతంగా మార్చిందని స్పష్టం చేశారు. సమ్మిళిత పరిపాలన దేశ పురోగతిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. నారీ శక్తి అధినియంపై ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. శాసనసభల్లో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించటంలోని చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా సమగ్ర, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ఇది కీలక అడుగని తెలిపారు.
ఢిల్లీ శాసనసభ స్పీకర్ శ్రీ విజేందర్ గుప్తా ప్రసంగిస్తూ.. “దేశ నిర్మాణానికి మహిళలే పునాది. రాజకీయాల్లో వారి భాగస్వామ్యం వల్ల విధానాలు మరింత సున్నితంగా, సమ్మిళితంగా, ప్రభావవంతంగా రూపొందుతాయి. నిర్ణయాధికారంలో మహిళల పాత్ర కీలకమైనది. సాధికారత సాధించిన మహిళలు సమాజంలో సమతుల్యత, న్యాయం, పురోగతిని కల్పిస్తూ.. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తారు” అని పేర్కొన్నారు.
మహిళా సాధికారత, నారీ శక్తి స్ఫూర్తిని బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. మహిళల అభిప్రాయాలను వ్యక్తపరచటానికి, ప్రజాస్వామ్య ప్రక్రియలను అర్థం చేసుకోవటానికి, విధాన రూపకల్పనలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు అత్యుత్తమ వేదికను అందించటమే ఈ మహిళా యువ పార్లమెంట్ ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. వీరిలో ఢిల్లీ, ఉత్తరాఖండ్కు చెందిన 37 మంది యువ ప్రతినిధులు వివిధ మంత్రిత్వ శాఖల తరపున హాజరై, మాక్ యూత్ పార్లమెంటులో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు "నారీ శక్తి వందన్ అధినియం"పై అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ.. మహిళల భాగస్వామ్యం, నాయకత్వం, సమగ్ర పాలన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితేష్ కుమార్ మిశ్రా, మై భారత్ సీఈఓ డాక్టర్ ప్రియాంకా శుక్లా, శ్రీరామ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిమ్రిత్ కౌర్ వంటి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్లమెంటరీ కార్యకలాపాలను అనుకరిస్తూ అభిప్రాయాలను సమర్థవంతంగా వ్యక్తం చేశారు. పాలనలో మహిళల ప్రాతినిధ్యానికి సమష్టిగా మద్దతు పలికారు. యువతుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, పౌర బాధ్యతను పెంపొందించడటానికి ఈ కార్యక్రమం ఎంతగానో సహకరించింది.
కార్యక్రమం ముగింపు సందర్భంగా డాక్టర్ ప్రియాంకా శుక్లా ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయులైన అతిథులు, ప్రతినిధులు, మాక్ యూత్ పార్లమెంట్ విజయవంతమయ్యేందుకు సహకరించిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వికసిత భారత్ నిర్మాణంలో మహిళల కీలకమైన, నిర్ణయాత్మకమైన పాత్రను స్పష్టం చేస్తూ.. వారి గళాన్ని వినిపించేందుకు గొప్ప వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
(రిలీజ్ ఐడి: 2251465)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28