విధానపరమైన నిర్ణయాల్లో యువ శక్తికి ప్రాధాన్యతనివ్వాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ విస్తృతస్థాయి జాతీయ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. కేంద్ర బడ్జెట్-2026లోని పలు ఆలోచనలు.. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ)-2026లో జరిగిన చర్చల నుంచి స్ఫూర్తి పొందినవే. జాతీయ ప్రాధాన్యతలను రూపొందించటంలో యువతతో జరిగిన సంప్రదింపుల నిర్మాణాత్మక పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
దేశవ్యాప్తంగా ముంబయి (మహారాష్ట్ర), అమరావతి (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), భోపాల్ (మధ్యప్రదేశ్), రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), భువనేశ్వర్ (ఒడిశా), హిసార్ (హర్యానా), ఢిల్లీ, చంఢీగఢ్, షిల్లాంగ్ (ఈశాన్య ప్రాంతం), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), జైపూర్ (రాజస్థాన్), రాంచీ (జార్ఖండ్), లక్నో (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్), శ్రీనగర్ (జమ్మూ, కాశ్మీర్)లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది కార్యక్రమ విస్తృతిని, వైవిధ్యాన్ని, సమ్మిళిత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
విద్యా, సామాజిక, ప్రాంతం వంటి విభిన్న నేపథ్యాల నుంచి యువతులు పాల్గొనటం ద్వారా భారత ప్రజాస్వామ్య, అభివృద్ధి ప్రయాణంలోని కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నారీ శక్తి యూత్ పార్లమెంట్ విశ్వసనీయ, వ్యవస్థీకృత వేదికగా నిలిచింది. అన్ని జోన్లలో పాల్గొన్నవారంతా సంప్రదింపులు, పార్లమెంటరీ తరహా చర్చలు నిర్వహించి ప్రజాస్వామ్య విలువలు, విజ్ఞానాత్మక సంభాషణలు, జనభాగీదారీ పట్ల నిబద్ధతను తెలియజేశారు.
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయటంపై జరిగిన చర్చలు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 17 జోన్లలో జరిగిన ఈ కార్యక్రమాలు అధికారిక తీర్మానాన్ని ఆమోదించటంతో ముగిశాయి. రాజ్యాంగ (సవరణ) బిల్లు-2026కు ఏకగ్రీవ మద్దతు లభించింది. ఈ బిల్లు ప్రకారం.. లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంచటంతో పాటు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి నారీ శక్తి వందన్ అధినియం-2023ని సకాలంలో అమలు చేయటాన్ని ఈ తీర్మానం సమర్థిస్తోంది. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తక్షణమే, సమర్థవంతంగా సాకారం చేయటానికి, అమలును నియోజకవర్గాల పునర్విభజన పరిమితుల నుంచి వేరు చేయాల్సిన అవసరాన్ని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది. తద్వారా సమ్మిళిత, భాగస్వామ్య ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తుంది.
వివిధ జోన్లలో జరిగిన ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో నాయకులు, నిర్ణేతలుగా పెరుగుతున్న నారీ శక్తి పాత్రను తెలియజేశారు. యువతుల అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచటానికి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి, దేశవ్యాప్త చర్చల్లో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని అందించటానికి శక్తిమంతమైన వేదికగా యూత్ పార్లమెంట్ నిలిచింది.
విధానపరమైన చర్చలకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ స్పృహ, శారీరక దృఢత్వం, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించటం ద్వారా 'స్వచ్ఛ, వికసిత్ భారత్' నిర్మాణంలో ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఒకే సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు యువతను ఒకచోట చేర్చి సమగ్ర నమూనాను ఆవిష్కరించాయి. ఇందులో యువతులు నిర్మాణాత్మక విధానపరమైన చర్చలకు నాయకత్వం వహించగా, సాధారణ యువత సామాజిక మార్పునకు మద్దతిస్తూ.. భాగస్వామ్య, సమ్మిళిత దేశ నిర్మాణ దృక్పథాన్ని సమష్టిగా ముందుకు నడిపించారు.
దేశవ్యాప్తంగా 17 జోన్లలో ఈ భారీ స్థాయి కార్యక్రమాన్ని ఒకే సమయంలో విజయవంతంగా నిర్వహించటం.. యువతను పెద్దఎత్తున ఒకచోట చేర్చి, జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయి భాగస్వామ్యంగా మార్చటంలోనూ మై భారత్ సంస్థాగత సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. వికసిత్ భారత్ @2047 లక్ష్యం దిశగా భారత్ పయనిస్తున్న తరుణంలో కొత్త తరం ఆవిర్భావాన్ని నారీ శక్తి యువ పార్లమెంట్ స్పష్టం చేస్తోంది. అవగాహన, స్పష్టమైన వ్యక్తీకరణ, కార్యాచరణ కలిగిన ఈతరం నారీ శక్తి కేవలం పాలనలో భాగం పంచుకోవటమే కాక, దేశ భవిష్యత్తును క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోంది.
***