వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బహ్రెయిన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌరవ అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రోతో సమావేశమైన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
సుస్థిరత, సరఫరా వ్యవస్థ బలోపేతం, బలమైన ఆర్థిక సంబంధాలపై భారత్-బహ్రెయిన్ చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 7:20PM by PIB Hyderabad
బహ్రెయిన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రోతో... భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, శ్రీ గోయల్ ఈ ప్రాంతానికి ప్రకటించిన కాల్పుల విరమణను స్వాగతించారు. కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఘర్షణల వల్ల తలెత్తిన ఇబ్బందుల నుంచి బహ్రెయిన్ సహా ఈ ప్రాంతంలోని దేశాలు త్వరగా కోలుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నౌకా వాణిజ్యం, ఇతర మార్గాల ద్వారా అంచనా వేసిన వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగేలా చూడాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ ప్రధానంగా ప్రస్తావించారు.
బహ్రెయిన్కు భారత్ తరపున పూర్తి సంఘీభావం తెలుపుతూ... ఆ దేశంలోని కీలక సంస్థలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్ర మంత్రి ఖండించారు. నౌకా వాణిజ్య భద్రత సహా ఆ దేశ భద్రత, స్థిరత్వానికి మద్దతును పునరుద్ఘాటించారు.
భారతీయ పౌరులకు బహ్రెయిన్ అందించిన మద్దతును శ్రీ గోయల్ అభినందించారు. భారతీయ పౌరుల క్షేమం కోసం కృషి చేసిన బహ్రెయిన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిరంతర సహకారం, సన్నిహిత భాగస్వామ్యం ద్వారా భారత్-బహ్రెయిన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2251017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15