రైల్వే మంత్రిత్వ శాఖ
పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణం, మెరుగైన ప్రయాణ అనుభవానికి అత్యంత ప్రాధాన్యం
గణనీయంగా తగ్గిన ప్రమాదాలు, రికార్డు స్థాయి సరుకు రవాణా, ప్రత్యేక రైళ్లు నడపడం అభినందనీయం
రైల్వే స్టేషన్లు భారతీయ రైల్వే ముఖచిత్రాలు... అధికారులు అంకితభావంతో పనిచేస్తూ వాటి పరిశుభ్రతను నిర్ధారించాలి
జీవనోపాధికి ఇబ్బందిలేకుండా రైల్వే భూ ఆక్రమణల సున్నిత సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
స్టేషన్ ప్రాంగణంలో, వెలుపల రైల్వే ట్రాక్లను దాటేందుకు అండర్పాస్లకు ప్రాధాన్యమివ్వాలి: కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 5:02PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీలోని రైల్ భవన్లో దేశవ్యాప్త రైల్వే అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించడమే భారతీయ రైల్వేల ప్రధాన ప్రాధాన్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత సంవత్సరం రైల్వే కుటుంబం కనబరిచిన ప్రశంసనీయమైన పనితీరుకు శ్రీ వైష్ణవ్ అభినందనలు తెలిపారు. రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గడం, రికార్డు స్థాయి సరుకు రవాణా దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే ప్రతిష్ఠను గణనీయంగా పెంచాయని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పండుగల సమయంలో పెరిగిన ప్రయాణాల డిమాండ్ను తీర్చడం కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను సమర్థంగా నడపడాన్నీ ఆయన అభినందించారు.
సమయపాలనతో రైళ్ల కార్యకలాపాలను నిర్ధారించడంలో జోన్ల పనితీరునూ కేంద్ర రైల్వే మంత్రి ప్రశంసించారు. కచ్చితమైన సమయపాలనను పాటించిన జోన్లనూ ఆయన అభినందించారు. కార్యాచరణ సవాళ్లు ఉన్నప్పటికీ 85 శాతానికి పైగా సమయపాలనను నిర్ధారించడం ద్వారా తమ పనితీరును మెరుగుపరుచుకున్న జోన్లను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ప్రయాణికుల అనుభవానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ... ప్రజలకు సేవలందించడంలో భాగంగా రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలనీ, వాటిని చక్కగా నిర్వహించాలనీ పిలుపునిచ్చారు. అన్ని స్టేషన్లలో పరిశుభ్రతను, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను నిర్ధారించడానికి అధికారులు పూర్తి అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు. గత దశాబ్దంలో రైల్వేల ఆధునికీకరణకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ... రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి అధికారులు ఈ నిధులను గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు.
రద్దీ సమయాల్లో, ముఖ్యంగా పండుగల సమయంలోనూ ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్లాట్ఫారమ్లకు చేరుకుని రైళ్లు ఎక్కేందుకు వీలుగా రద్దీ నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికులకు సౌకర్యం, అందుబాటులో ఉండుటను మెరుగుపరచడం కోసం కేటాయించిన నిధుల వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ అంశంపైనా చర్చ జరిగింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైతే ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి రాష్ట్ర రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అనుభవజ్ఞులైన విశ్రాంత అధికారుల నైపుణ్యాన్ని వినియోగించుకునేందుకు వారి సాయం కోరాలని శ్రీ వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.
రైల్వే ట్రాక్ల సమీపంలో నివసించే ప్రజలకు సంబంధించిన సున్నితమైన సమస్యపై ప్రసంగిస్తూ... వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం లేకుండా చూడాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూనే ఇటువంటి ఇబ్బందులను పరిష్కరించడంలో మానవతా దృక్పథంతో, సున్నితంగా వ్యవహరించాలని ఆయన రైల్వే అధికారులను ఆదేశించారు. ఇది అనేక పట్టణ ప్రాంతాల్లో కీలక సమస్యగా ఉందనీ... దీనికి సకాలంలో, కరుణతో కూడిన పరిష్కారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రైలు అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్నీ సమీక్షించారు. స్టేషన్ ప్రాంగణం లోపల, వెలుపల రైల్వే ట్రాక్లను దాటడం కోసం సాధ్యమైనంత వరకు ఫుట్ ఓవర్బ్రిడ్జ్ల కంటే సౌకర్యవంతమైన, సులభంగా అందుబాటులో ఉండే అండర్పాస్లకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. అండర్పాస్లు మరింత సౌకర్యంగా ఉంటాయనీ, ప్రజలు వాటిని తరచుగా ఉపయోగించే అవకాశం ఉంటుందనీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి అండర్పాస్లను నిర్మించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలనీ నిర్ణయించారు. వీటిని పాదచారులకే కాకుండా సైకిళ్లు, స్కూటర్లు, మోటార్సైకిళ్ల రాకపోకలనూ సులభతరం చేసేలా రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో వెడల్పైన నిర్మాణాలు ట్రాక్టర్లు, ఇతర వాహనాల రాకపోకలకూ వీలు కల్పిస్తాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా డిజైన్లను రూపొందిస్తారు.
నిరంతర ప్రయత్నాలు, సమర్థ ప్రణాళిక, ప్రయాణికుల కేంద్రిత విధానంతో... భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికుల కోసం భద్రత, సేవల నాణ్యత, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తూనే ఉంటుందని శ్రీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2248955)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12