రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో జల ప్రవేశం చేసిన భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ తారాగిరి’
దేశపు సాంకేతిక బలానికి, స్వావలంబనకు, పటిష్టమైన నౌకాదళానికి ఈ యుద్ధనౌక నిదర్శనం: రక్షణశాఖ మంత్రి
‘‘ఈ రోజుల్లో శక్తిమంతమైన, సమర్థవంతమైన నౌకాదళాన్ని నిర్మించడం అత్యవసరం”
దేశ ప్రయోజనాలకు కీలకమైన సముద్ర మార్గాలను, వ్యూహాత్మక జలసంధులను, డిజిటల్ వ్యవస్థలను కాపాడుతోన్న భారత నౌకాదళం.. ఇది ప్రపంచంలోనే భారత్ను ఒక బాధ్యతాయుతమైన శక్తిగా నిలబెడుతోంది: శ్రీ రాజ్నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 3:51PM by PIB Hyderabad
ప్రాజెక్టు 17-ఏ శ్రేణిలో నాలుగో శక్తిమంతమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగారిని 3 ఏప్రిల్ 2026న రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత నావికాదళంలోకి ప్రవేశించింది. ఆధునిక నౌకా నిర్మాణ రంగంలో ఒక అద్భుతమైన నమూనాగా నిలిచే ఈ అత్యాధునిక యుద్ధ నౌక.. సుమారు 6,670 టన్నుల బరువు కలిగి ఉంటుంది. వివిధ రకాల యుద్ధ కార్యకలాపాలను నిర్వహించగల ఈ నౌకను వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా.. ఎంఎస్ఎంఈల సహకారంతో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ దీనిని నిర్మించింది. ఇది శత్రువుల రాడార్ల కళ్లుగప్పే అధునాతన స్టెల్త్ సాంకేతికతను కలిగి ఉంది. దీనివల్ల యుద్ధ సమయాల్లో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేసే సామర్థ్యం ఈ నౌక సొంతం.
75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యంత తక్కువ కాలంలో నిర్మించిన ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకా నిర్మాణ నైపుణ్యానికి, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి ఒక నిదర్శనం. ఐఎన్ఎస్ తారాగిరిని కేవలం ఒక యుద్ధనౌకగా మాత్రమే కాకుండా, దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యం, స్వయం సమృద్ధి, తిరుగులేని నౌకాదళ శక్తికి ప్రతీకగా రక్షణశాఖ మంత్రి అభివర్ణించారు.
ఈ సందర్భంగా శ్రీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ నౌక అత్యంత వేగంగా ప్రయాణించగలదు. సుదీర్ఘకాలం పాటు సముద్రంలో మోహరించి ఉండగలదు. శత్రువుల కదలికలను కనిపెట్టడానికి, సొంత రక్షణను నిర్ధారించుకోవడానికి, అవసరమైతే తక్షణమే స్పందించడానికి అవసరమైన అత్యాధునిక వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఆధునిక రాడార్, సోనార్, బ్రహ్మోస్ వంటి క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు దీని కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. తీవ్రస్థాయి యుద్ధాల నుంచి సముద్ర భద్రత, సముద్రపు దొంగల వేట, తీరప్రాంత నిఘా, మానవతా దృక్పథంతో చేసే సహాయక చర్యల వరకు.. ప్రతి పాత్రలోనూ ఇది సరిగ్గా సరిపోతుంది. ఇది ఒక ప్రత్యేకమైన నౌకా వేదిక’’ అని పేర్కొన్నారు.
11,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం కలిగి, మూడు వైపులా సముద్రమే సరహద్దుగా ఉన్న భారత్.. తన అభివృద్ధిని సముద్రం నుంచి వీడిదీసి చూడలేదని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ వాణిజ్యంలో సుమారు 95 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుందని, అలాగే ఇంధన భద్రత కూడా సముద్రంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కారణాల వల్ల శక్తిమంతమైన, సామర్థ్యం గల నౌకాదళాన్ని నిర్మించడం కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని, అది తప్పనిసరి అని అన్నారు.
మారుతున్న భద్రతా పరిణామాల్లో సముద్ర రంగానికి ఉన్న అపారమైన ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా భారత నావికాదళం నిరంతర నిఘా ఉంచుతోందని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. “విశాలమైన సముద్రంలో ఎన్నో సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ సరుకుల రవాణా సాఫీగా సాగేలా చూడటానికి మన నౌకాదళం నిరంతరం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు రక్షణ కల్పించడానికి భారత నౌకాదళం రంగంలోకి దిగుతోంది. ఇది కేవలం దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన పౌరులను, వాణిజ్య మార్గాలను రక్షించడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సామర్థ్యమే భారత్ను ఒక బాధ్యతాయుతమైన, ఎదురులేని సముద్ర శక్తిగా పటిష్టంగా నిలబెడుతోంది’’ అని అన్నారు.
ఆధునిక డిజిటల్ యుగంలో ప్రపంచంలోని అత్యధిక డేటా సముద్ర అంతర్భాగంలోని ఇంటర్నెట్ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుందని, వాటికి ఏవైనా నష్టం వాటిల్లితే ప్రపంచ వ్యవస్థే అతలాకుతలం అవుతుందని రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. సముద్ర భద్రతను కేవలం సంప్రదాయ కోణంలోనే కాకుండా, సమగ్రమైన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మనం కేవలం మన తీర ప్రాంతాల రక్షణకే పరిమితం కాకూడదు. మన జాతీయ ప్రయోజనాలతో విడదీయరాని సంబంధం కలిగిన కీలకమైన సముద్ర మార్గాలు, జల సంధులు, డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను కూడా మనం ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి. ఈ భద్రతా ప్రయత్నాలన్నింటిలోనూ భారత నావికాదళం అత్యంత కీలకంగా పాల్గొంటోంది. ఈ విధానమే మనల్ని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేస్తుంది. ఐఎన్ఎస్ తారాగిరి వంటి అత్యాధునిక యుద్ధ నౌకలను భారత్ నిర్మించి, రంగంలోకి దించినప్పుడల్లా.. అది ఈ మొత్తం ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు భరోసాగా నిలుస్తుంది’’ అని అన్నారు.
సంక్షోభ సమయాల్లో పౌరుల తరలింపు ప్రక్రియలైనా, మానవతా దృక్పథంతో చేసే సహాయ కార్యక్రమాలైనా.. భారత నావికాదళం ఎల్లప్పుడూ ముందుండి నిలుస్తుందని శ్రీ రాజ్నాథ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశపు నైతిక విలువలకు, అచంచలమైన అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ‘‘ఐఎన్ఎస్ తారాగిరి మన నావికాదళం బలాన్ని, విలువలను, అంకితభావాన్ని మరింత రెట్టింపు చేస్తుంది’’ అని చెప్పారు.
స్వదేశీ పరిశ్రమల అండతో రాబోయే కాలంలో భారత నావికాదళాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దళాలలో ఒకటిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిబద్ధతను రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో రక్షణ రంగ తయారీ ఒక జాతీయ లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. “నేడు మనం కేవలం మన అవసరాలను తీర్చుకోవడానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాం. రూపకల్పన, అభివృద్ధి నుంచి తుది వినియోగం వరకు ప్రతి దశలోనూ దేశ భాగస్వామ్యం కీలకంగా ఉంది. మన భద్రతను మాత్రమే కాకుండా, మన భవిష్యత్తును కూడా మనమే రూపొందించుకోగల సామర్థ్యం మనకు ఉందనే నమ్మకాన్ని ఇది ఇస్తోంది. ఐఎన్ఎస్ తారాగిరి సరిగ్గా ఇదే దార్శనికతకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.” అని తెలిపారు.
గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన మార్పును వివరిస్తూ.. యువతకు, పరిశ్రమలకు నిరంతరం ఆవిష్కరణలు, తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే ఒక బలమైన వ్యవస్థను ప్రభుత్వం సృష్టించిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉండాలంటే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం తప్ప భారత్కు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. భద్రతా ప్రయత్నాలు కేవలం భూమి, నీరు, ఆకాశానికే పరిమితం కాకూడదని, అవి అంతరిక్షం, సైబర్ స్పేస్, ఆర్థిక రంగాలకు కూడా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. అదే దార్శనికతతో ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్, ఇతర రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు అందిస్తున్న నిరంతర సానుకూల సహకారాన్ని రక్షణ మంత్రి అభినందించారు. ఈ 16 ప్రభుత్వ రక్షణ సంస్థలను రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు కేంద్ర బిందువులుగా ఆయన అభివర్ణించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్లకు చేరడంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగం చేసిన కృషిని కొనియాడారు. “13-14 ఏళ్ల క్రితం మనం కేవలం రూ. 1,200 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసేవాళ్లం. నేడు అది దాదాపు రూ. 39,000 కోట్లకు చేరుకుంది. దేశీయ స్వయం సమృద్ధి క్రమంగా పెరుగుతోందని, మనం స్వశక్తితో నిలబడుతున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని అన్నారు.
ఈ సందర్భంగా నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ తారాగిరి గొప్ప చరిత్రను గుర్తు చేశారు. 1980లో నావికాదళంలో చేరిన పూర్వపు లియాండర్ తరగతి యుద్ధనౌక.. జలాంతర్గాములను ఎదుర్కోవడంలో, కార్యాచరణ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో భారత్కు ఒక మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. మారుతున్న సముద్ర వాణాజ్య భద్రతా వాతావరణం గురించి ప్రస్తావిస్తూ.. చురుకైన భౌగోళిక రాజకీయాలు, కొత్త సాంకేతికతలు, సంప్రదాయేతర ముప్పుల కారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంక్లిష్టతలు పెరుగుతున్నాయని చెప్పారు. జాతీయ సముద్ర ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా కాపాడేందుకు.. భారత నావికాదళం ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా, నమ్మకమైన, సమన్వయంతో కూడిన, సవాళ్లను ఎదుర్కొనే శక్తిగా ఉండేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ వేడుకలో భాగంగా నౌకపై మొదటిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే నావికాదళానికి చెందిన ప్రత్యేక జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోత్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, మజగావ్ డాక్ ఎండీ కెప్టెన్ జగ్మోహన్ (విశ్రాంత) వంటి ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ తారాగిరి గురించి
ఈ యుద్ధ నౌక గత నమూనాల కంటే ఎంతో ఆధునికమైనది. దీని ప్రత్యేకమైన రూపం, అత్యంత తక్కువ రాడార్ గుర్తింపు పరిధి కారణంగా ఇది శత్రువులకు చిక్కకుండా అత్యంత రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించగలదు. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక.. దేశీయ పారిశ్రామిక వ్యవస్థ పరిణతికి నిదర్శనం. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ నౌక నిర్మాణంలో 200లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి, తద్వారా వేలాది మంది భారతీయులకు ఉపాధి లభించింది.
బయటకు చూడటానికి ఈ నౌక ఆధునికంగా కనిపించడమే కాకుండా, లోపల శక్తిమంతమైన కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ ఇంజిన్తో పనిచేసే వ్యవస్థ ఉంటుంది. దీనిని అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫాం మేనేజ్మెంట్ వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ నౌక ఏ సమయంలోనైనా, ఎక్కడైనా తనకు అప్పగించిన ఎలాంటి లక్ష్యాన్ని అయినా విజయవంతంగా పూర్తి చేయగల బహుముఖ సామర్థ్యం గల నౌకగా సేవలు అందిస్తుంది.
ఈ యుద్ధనౌక ప్రపంచ స్థాయిలో దాడి చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇందులో అత్యంత శక్తిమంతమైన సూపర్నోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులు, జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక స్వదేశీ వ్యవస్థలు ఉన్నాయి. మారుతున్న ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితుల్లో ఈ నౌక రాక ఒక ముఖ్యమైన భౌగోళిక రాజకీయ సంకేతాన్ని ఇస్తోంది. సంక్లిష్టమైన యుద్ధనౌకలను నిర్మించడంలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా నిలించింది. శత్రువులను భయపెట్టడమే కాకుండా మహాసాగర్ దార్శనికతతో సమష్టి ప్రాంతీయ స్థిరత్వానికి భారత్ తన వంతు సహకారం అందిస్తోంది.
తూర్పు తీరంలోని తూర్పు నౌకాదళంలో ఐఎన్ఎస్ తారాగిరి చేరుతుండటంతో దశాబ్దాలుగా దేశానికి సేవలందించిన పూర్వ తారాగిరి నౌక పేరును, ఘనమైన వారసత్వాన్ని ఇది ముందుకు తీసుకువెళుతోంది. నేడు ఈ నౌక మీద (డెక్) మీద ఉన్న అక్షరాలు అక్షర సత్యం. దేశ సముద్రాలను భారతీయులే రూపొందించిన, భారతీయులు నిర్మించిన, భారతీయులు నడిపే నౌకలు కాపాడుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2248954)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16