యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒకప్పుడు నక్సలిజం ఉన్నచోట ఇప్పుడు క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయి… సంఘర్షణలకు నిలయంగా ఉన్న ప్రాంతంలో
క్రీడలు సరికొత్త ఆశలను నింపుతున్నాయి: ఖేలో ఇండియా గిరిజన క్రీడలు (కేఐటీజీ) 2026లో కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే
2,500మందికి పైగా గిరిజన క్రీడాకారులను భవిష్యత్ ఒలింపియన్లుగా ప్రశంసించిన శ్రీమతి రక్షా ఖడ్సే
కేఐటీజీ 2026లో హాకీ, ఫుట్బాల్, స్విమ్మింగ్ లో అధిక పతకాలు సాధించిన అస్మిత లీగ్ పూర్వ క్రీడాకారులు
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 6:47PM by PIB Hyderabad
ప్రస్తుతం జరుగుతున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడలు (కేఐటీజీ) 2026లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ఈ రోజు రాయ్పూర్ ను సందర్శించారు. అక్కడి వాతావరణం నూతన శక్తితో, ఆశతో, మార్పుతో నిండి ఉందని ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) బృందం చేసిన కృషిని ఆమె అభినందించారు. క్రీడాకారులు, స్థానిక సమాజం, ఆ ప్రాంత ప్రజల నుంచి స్పందన అత్యద్భుతంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,500 మందికి పైగా క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీపడుతున్న ఈ కేఐటీజీ 2026, గిరిజన యువత తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక వేదికను కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని శ్రీమతి రక్షా ఖడ్సే అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ క్రీడలు ఒక కొత్త ఆశను అందిస్తున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి, అత్యున్నత స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నామనే సంకేతాన్ని ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
"ఒకప్పుడు ఛత్తీస్గఢ్ నక్సలిజానికి పేరుగాంచింది. ఇక్కడి ప్రజలను వెనుకబడిన వర్గాలుగా భావించేవారు. కానీ ఈరోజు, ఈ ప్రాంతానికి ఒక కొత్త దిశ ఏర్పడుతోందని నేను భావిస్తున్నాను. నక్సలిజం అంతమైపోయింది. ఈ గడ్డపై ఉన్న యువతకు ఇప్పుడు క్రీడల ద్వారా తమ శక్తిని, సామర్థ్యాన్ని చాటుకుంటూ దేశం కోసం ఆడే అవకాశం లభించింది." అని మంత్రి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు, దేశవ్యాప్తంగా నక్సలిజం అంతమైనట్టు ప్రకటించిన హోం మంత్రి శ్రీ అమిత్ షాకు, క్యాబినెట్ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు, కేఐటీజీ 2026ను ఒక మైలురాయిగా మార్చిన మొత్తం ఎస్ఏఐ బృందానికీ ఈ ఘనత చెందుతుందని మంత్రి వాఖ్యానించారు. ఈ క్రీడల్లో పోటీపడుతున్న క్రీడాకారులలో చాలామంది భవిష్యత్తులో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారనే పూర్తి విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
గ్రామీణ భారతదేశం నుంచి మహిళలను పోటీ క్రీడల్లోకి తీసుకురావడానికి, వారికి ఒక గుర్తింపును, అవకాశాన్ని కల్పించడానికి ప్రధానమంత్రి మోదీ దార్శనికతతో 2021లో ప్రారంభించిన అస్మిత లీగ్ ద్వారా వచ్చిన ప్రభావాన్ని కూడా మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"కేఐటీజీ 2026లో ఫలితాలు చాలా స్పష్టంగా ఉన్నాయి: హాకీ,ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటున్న బాలికల్లో సుమారు 60 నుంచి 70 శాతం మంది అస్మిత లీగ్లో పతకాలు సాధించిన పూర్వ క్రీడాకారులే. వారిలో అంజలి ముందా వంటి ప్రతిభావంతులు కూడా ఉన్నారు. అలాగే ఈ పోటీల్లో స్విమ్మింగ్లో వచ్చిన మొత్తం ఐదు స్వర్ణ పతకాలను కూడా అస్మిత లీగ్ క్రీడాకారులే కైవసం చేసుకున్నారు" అని మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే తెలిపారు.
“ మహిళా క్రీడాకారుల భాగస్వామ్యం నిరంతరం పెరిగేలా, అస్మిత లీగ్ను క్షేత్రస్థాయిలో గ్రామాలకు సైతం విస్తరించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని ఆమె పేర్కొన్నారు
***
(రిలీజ్ ఐడి: 2248098)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14