రైల్వే మంత్రిత్వ శాఖ
రైలు ప్రయాణికుల భద్రత, రక్షణే ప్రథమ ప్రాధాన్యం
50,000 కన్నా ఎక్కువ మంది దోషులకు వ్యతిరేకంగా కోర్టుల్లో ఫిర్యాదులు
2021–2025 మధ్య కాలంలో 52,000కు మించి అరెస్టులు...
గత 5 ఏళ్లలో దుండగులు చేసిన పనుల వల్ల రైలు పట్టాలు తప్పిన ఘటనలు మూడు మాత్రమే
గడచిన అయిదేళ్ల (2021–2025)లో రాళ్ల దాడి ఘటనలు 12,157
8,441 మందిని అరెస్టు చేసిన ఆర్పీఎఫ్, జీఆర్పీ
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2026 7:29PM by PIB Hyderabad
రైల్వే ఆస్తుల్ని కాపాడే బాధ్యతను రైల్వే పరిరక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించారు. దొంగతనం, దుర్వినియోగానికి పాల్పడడం, దుష్ప్రేరేపణ, కుమ్మక్కు కావడం, కుట్ర వంటి వాటిపై రైల్వే ఆస్తి (చట్టవిరుద్ధ కబ్జా) చట్టం-1966 నిబంధనల్లో భాగంగా కేసులను నమోదు చేసేందుకు ఆర్పీఎఫ్కు అధికారాలు ఉన్నాయి. దోషులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, సాధికార న్యాయస్థానం... అంటే ఈ సందర్భంలో ప్రత్యేక రైల్వే మేజిస్ట్రేట్ కోర్టులోనూ, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయని కొన్ని రాష్ట్రాల్లోనూ.. ఫిర్యాదులను దాఖలు చేసి విచారణ జరుపుతున్నారు.
గత అయిదు సంవత్సరాల్లో (2021–2025 మధ్య కాలంలో), మొత్తం 52,494 మందిని ఆర్పీ (యూపీ) చట్టం-1966 నిబంధనల్లో భాగంగా అరెస్టు చేశారు. వీరిలో 50,432 మంది దోషులపై సంబంధిత న్యాయస్థానాల్లో ఫిర్యాదులను దాఖలు చేశారు.
గత అయిదు సంవత్సరాల్లో (2021–2025 మధ్య కాలంలో), రాళ్లు రువ్విన ఘటనలు మొత్తం 12,157 నమోదయ్యాయి. వాటిలో 8,441 మందిని ఆర్పీఎఫ్, జీఆర్పీలు అరెస్టు చేశాయి.
గత అయిదు సంవత్సరాల్లో (2021–2025 మధ్య కాలంలో), భారతీయ రైల్వేల్లో ఆకతాయి చేష్టల కారణంగా రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు కేవలం మూడు చోటు చేసుకున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్, నార్త్ సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ డివిజన్, సదరన్ రైల్వే లోని చెన్నై డివిజన్లలో ఇలాంటి ఒక్కొక్క ఘటన నమోదైంది.
దీనికి తోడు, రైలు పట్టాలకు సంబంధించి ఏ విధమైన నేరపూర్వక కార్యకలాపాలకైనా పాల్పడే ఘటనల్ని నిరోధించడానికి ఈ కింద పేర్కొన్న చర్యలను రైల్వేలు తీసుకుంటున్నాయి:-
రైల్వేలకు చెందిన రాష్ట్ర స్థాయి భద్రతా సంఘం (ఎస్ఎల్ఎస్సీఆర్) సమావేశాలను క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఈ కమిటీలను ప్రతి ఒక్క రాష్ట్రంలో సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, పోలీస్ కమిషనర్ల అధ్యక్షతన ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్ యూనిట్ల ప్రతినిధులకు స్థానం కల్పించారు. దీనికి అదనంగా, విద్రోహ ఘటనలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ నేరాల నియంత్రణ, కేసులు నమోదు చేయడం, వాటిపై దర్యాప్తు, రైళ్లను సురక్షితంగా నడిపేటట్లు చూడటానికి గోప్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికీ రాష్ట్ర పోలీసు, జీఆర్పీ ప్రాధికార సంస్థలతో కలిసి అన్ని స్థాయుల్లో సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొన్నారు.
రహస్య సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తోడు ఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగమైన క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (సీఐబీ), స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ)ని రంగంలోకి దించారు. ఈ విధమైన రహస్య సమాచారం ఏవైనా నేర కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకోవడానికి సంబంధిత ప్రాధికార సంస్థలతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టడానికి దోహదపడుతుంది.
గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో రైల్వేలు, ఆర్పీఎఫ్, జీఆర్పీలతో పాటు పోలీసు శాఖ తరచుగా గస్తీని నిర్వహిస్తున్నాయి.
రైలు పట్టాల దగ్గర్లో పడేసిన సామగ్రిని రైలు మార్గానికి అడ్డంకులను సృష్టించడానికి ఆకతాయిలు ఉపయోగించే ప్రమాదం పొంచి ఉండడంతో ఆ సామగ్రిని తొలగించే ప్రయత్నాలు చేపడుతున్నారు.
పట్టాలపై ఎలాంటి వస్తువులు పెట్టినా, రైలు పట్టాలకు సంబంధించిన భాగాలను తొలగించినా, రీళ్లు చిత్రీకరించడం వంటి పనులు చేసినా ఎలాంటి పర్యవసానాలు కలుగుతాయో రైల్వే పట్టాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి తెలియజేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారాన్ని అందించాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పర్యవేక్షణ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అలాగే సౌర శక్తితో పని చేసే స్టాండ్ అలోన్ సీసీటీవీ కెమెరాలను కూడా అమరుస్తున్నారు.
ఈ సమాచారాన్ని బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2246036)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7