మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
చట్టవిరుద్ధంగా మత్స్యకారుల చేపల వేట
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 12:19PM by PIB Hyderabad
సముద్రంలో పన్నెండు నాటికల్ మైళ్ల వరకు ఉండే ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టే అంశం రాష్ట్ర జాబితాలోని 21వ ఎంట్రీ పరిధిలోకి వస్తుందనీ, దీనికి సంబంధించిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే బాధ్యత కోస్తాతీర రాష్ట్ర ప్రభుత్వాలదీ, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీస్)దీ. 12 నాటికల్ మైళ్ల ఆవలి భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్)లో చేపలు పట్టే అంశం కేంద్ర జాబితాలో 57వ ఎంట్రీలో భాగం కావడం వల్ల తత్సంబంధిత కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంది. దీనికి అనుగుణంగానే కోస్తా తీర రాష్ట్రాలు, యూటీలు ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టడాన్ని క్రమబద్ధీకరించడానికి తమ తమ మరీన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్టుల (ఎమ్ఎఫ్ఆర్ఏస్)ను అమలు చేస్తుంటాయి. చేపలు పట్టేందుకు యంత్రాల సహాయం లేకుండానూ (నాన్‑మోటరైజ్డ్), యంత్రాధారితంగానూ (మోటరైజ్డ్) పని చేసే పడవలను ఉపయోగిస్తున్న సాంప్రదాయిక మత్స్యకారులకు ప్రత్యేకంగా కొన్ని మండలాలను (జోన్స్) కూడా అనేక రాష్ట్రాలు, యూటీలు నిర్ధారించాయి. ఆ జోన్లలో యంత్రాధారిత ఓడలు ప్రవేశించకుండా నిషేధం విధించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రాదేశిక జలాల్లోనూ, పులికాట్ సరస్సు ప్రాంతంలోనూ తమిళనాడు, పుదుచ్చేరిల నుంచి వస్తున్న పడవలు చట్టవిరుద్ధంగా చేపల వేటకు దిగుతున్న ఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ఇలాంటి అంతర్ రాష్ట్ర చేపల వేట సంబంధిత అంశాలను పరిష్కరించడానికీ, అంతర్ రాష్ట్ర మండలి సలహా మేరకు, కేంద్ర ప్రభుత్వ మత్స్య విభాగం 2023 మార్చి నెల 29 నాటి ఉత్తర్వు ద్వారా.. మూడు ప్రాంతీయ మత్స్య నిర్వహణ మండళ్లను (ఆర్ఎఫ్ఎంసీస్) ఏర్పాటు చేసింది. వీటిలో పశ్చిమ, తూర్పు, దక్షిణ ఆర్ఎఫ్ఎంసీలు ఉన్నాయి. ఈ ఆర్ఎఫ్ఎంసీలు రాష్ట్రాలు, యూటీలకు అంతర్ రాష్ట్రీయ మత్స్య పాలన సంబంధిత వివాదాలను సహకారపూర్వకంగా పరిష్కరించడంతో పాటు సముద్ర వనరుల సమాన ప్రాప్తిని నిర్ధారించడానికి ఒక వేదిక లాగా పని చేస్తున్నాయి. భారత తీరరక్షక దళానికి ఈ మూడు ఆర్ఎఫ్ఎంసీలలోనూ ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రాలు, యూటీలు ప్రస్తావించే అంశాలను సంబంధిత ఆర్ఎఫ్ఎంసీ చర్చాంశాల జాబితాలో చేరుస్తారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఆపడానికీ, చేపల వేట కార్యకలాపాలు శాంతియుతంగా, నిరంతరాయంగా కొనసాగడానికీ పొరుగు కోస్తాతీర రాష్ట్రాలూ, యూటీలతో కలిసి ప్రస్తుత సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయపూరిత కార్యాచరణను చేపడుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. మత్స్యకారుల భద్రతనీ, జీవనోపాధినీ దృష్టిలో పెట్టుకొని సంస్థాగత యంత్రాంగాల్ని పటిష్ఠపరచడానికి క్రియాత్మక చర్యలను తీసుకుంటున్నట్లు కూడా తమిళనాడు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ 2023 ఆగస్టు 19 నాటి ఆర్ఎఫ్ఎంసీ సమావేశంలో ప్రస్తావించిన ఆందోళనలను లెక్కలోకి తీసుకొని తమిళనాడు ప్రభుత్వం 2024 జనవరి 31న ఒక ఉత్తర్వును జారీ చేసింది. అందులో జిల్లా స్థాయి సంఘాన్ని నియమించినట్లు తెలిపింది. ఈ సంఘంలో తమిళనాడు లోని తిరువల్లూర్, చెన్నై, చెంగల్పట్టు లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల కలెక్టర్లకూ, అధికారులకూ స్థానం కల్పించారు. మత్స్యకారులకు అవగాహన కలిగించడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య చేపల వేటకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యతను ఈ సంఘానికి అప్పజెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సాక్ష్యాల (వీటిలో పోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి) ఆధారంగా.. ‘నియమాలను ఉల్లంఘించి చేపల వేటకు దిగిన పడవల’పై తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్టు-1983లో పేర్కొన్న ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ఇదే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుదుచ్చేరి నుంచి వచ్చే పడవలు అక్రమ చేపల వేటకు పాల్పడ్డ ఘటనలపై తగిన చర్యలను చేపట్టాల్సిందిగా కూడా పుదుచ్చేరి పాలన యంత్రాంగానికి నివేదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తన ప్రాదేశిక జలాల్లో చట్టవిరుద్ధంగా, సమాచారమివ్వకుండానే, నియంత్రణకు లోబడని విధంగా (ఐయూయూ) చేపల వేటకు దిగుతున్న సమస్యని ప్రభావవంతంగా పరిష్కరించడానికి మరింత కఠిన నిబంధనలను చేర్చే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య పాలన క్రమబద్ధీకరణ చట్టం‑1994లో సవరణలు చేసేందుకూ నడుం కట్టింది.
ఈ సమాచారాన్ని లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2244551)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13