యు పి ఎస్ సి
యూపీఎస్సీ పరీక్షల్లో పారదర్శకత
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 3:15PM by PIB Hyderabad
డబ్ల్యూపీ (సీ) నెం. 118/2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయిన అనంతరం ప్రొవిజనల్ ఆన్సర్ కీను అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడానికి యూపీఎస్సీ మార్గదర్శకాలను రూపొందించింది. 2026లో నిర్వహించే సివిల్ సర్వీసు (ప్రిలిమినరీ) పరీక్షల నుంచి యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటికీ వీటిని అమలు చేస్తారు. పరీక్ష తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత మాత్రమే ప్రిలిమినరీ పరీక్షల్లో సాధించిన మార్కులను విడుదల చేస్తారు.
ఐచ్ఛిక సబ్జెక్టుల విషయంలో ఏ అభ్యర్థీ నష్టపోకుండా.. అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం లభించేలా వాటి మధ్య సమతుల్య విధానాన్ని యూపీఎస్సీ అనుసరిస్తుంది. సంప్రదాయ/వ్యాసరూప సమాధాన పత్రాల సమన్వయం/మూల్యాంకన ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది: https://upsc.gov.in/content/method-moderation-adopted-commission-cannot-be-faulted- subjective-or-un-scientific
అభ్యర్థుల కనీస ప్రమాణాల నాణ్యత, విశ్లేషణ సామర్థ్యాలను నిర్ధారించేందుకు సీశాట్ను అర్హత పరీక్షగా నిర్ణయించారు. దీనిలో అడిగే ప్రశ్నలు మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి.
తప్పులను సవాలు చేయడానికి క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ (క్యూపీఆర్ఈపీ)ను తన వెబ్సైట్ https://upsconline.nic.in లో యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రశ్నాపత్రం, ప్రొవిజనల్ ఆన్సర్కీలపై తమ అభ్యంతరాలను ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు సమర్పించవచ్చు (సివిల్ సర్వీసు (ప్రిలిమినరీ) పరీక్ష 2026 నుంచి అమల్లోకి వస్తుంది). కేంద్రీయ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజీఆర్ఏఎంఎస్), ఈ-మెయిళ్ల ద్వారా అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులను కూడా యూపీఎస్సీ పరిష్కరిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాస్త్ర సహాయ మంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా సోమవారం అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2244041)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25