రైల్వే మంత్రిత్వ శాఖ
వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధునిక భారతీయ రైల్వేలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ప్రయాణ సాధనం: పార్లమెంటులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి
అందుబాటు ధరలో ప్రయాణ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడం ద్వారా పేద ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
భారతీయ రైల్వేలు తక్కువ వృద్ధి నుంచి అత్యంత వేగవంతమైన పరివర్తన దిశగా సాగడాన్ని సరికొత్త యుగంగా అభివర్ణించిన కేంద్ర రైల్వే మంత్రి
సుమారు 1,37,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్.. 25,500 కంటే ఎక్కువ రైళ్లతో దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజా, సరుకు రవాణాలో సహాయపడుతున్న రైల్వే
ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోన్న భారతీయ రైల్వే
అధిక సంఖ్యలో నాన్-ఏసీ కోచ్లను అందుబాటులోకి తెచ్చి సామాన్య ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తున్న భారతీయ రైల్వే: శ్రీ అశ్వినీ వైష్ణవ్
భారత్లో భారీ రాయితీతో కూడిన రైలు ప్రయాణాన్ని అందిస్తోన్న ప్రభుత్వం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
ప్రతి ప్రయాణికుడి టికెట్ ధరలో 45 శాతం ఖర్చును భరిస్తోన్న ప్రభుత్వం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
దీనివల్ల పొరుగు దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ ధరకే ఆధునిక ప్రయాణ అనుభవం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
స్వల్పకాలిక ప్రయాణాలను ప్రోత్సహించడానికి 200 కొత్త ఇంటర్సిటీ రైళ్లతో పాటు ముంబయిలో ఆటోమేటిక్ డోర్-క్లోజింగ్ వ్యవస్థతో కూడిన 238 కొత్త సబర్బన్ రైళ్లు అందుబాటులోకి: శ్రీ అశ్వినీ వైష్ణవ్
గత 10 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, గత 2 ఏళ్లలో 1.43 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలే కాకుండా రైల్వే ప్రాజెక్టుల ద్వారా లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాల సృష్టి
భారత్లో ప్రయాణ అనుభవాన్ని సరికొత్తగా మార్చనున్న మెరుగుపరిచిన స్టేషన్ సదుపాయాలు, సాంకేతికతతో కూడిన నిర్వహణ పద్ధతులు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 9:49PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2026-27లో కేటాయించిన దాదాపు రూ. 2.78 లక్షల కోట్ల రికార్డు స్థాయి నిధులతో భారతీయ రైల్వేలు అపూర్వమైన విస్తరణ, ఆధునికీకరణను సాధిస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్లపై (2026-27) పార్లమెంటులో జరిగిన చర్చకు రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడాన్ని రైల్వేలో ఒక కీలకమైన నిర్మాణాత్మక సంస్కరణగా పేర్కొన్న ఆయన.. దీనివల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు కలిగాయని అన్నారు. భారతీయ రైల్వేల ప్రస్తుత పరివర్తనను తక్కువ వృద్ధి నుంచి అత్యంత వేగవంతమైన పరివర్తన దిశగా మారడంగా ఆయన అభివర్ణించారు. ఇది దేశీయ రవాణా వ్యవస్థలో ఒక కొత్త యుగానికి నాంది అని పేర్కొన్నారు.
మొదటగా ఇది బడ్జెట్ నుంచి లభించే మద్దతులో గణనీయమైన పెంపునకు వీలు కల్పించింది. గతంలో సుమారు రూ. 25,000 నుంచి రూ. 30,000 కోట్లుగా ఉన్న కేటాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 2.78 లక్షల కోట్లకు చేరాయి. రెండోది.. ఇది ఏడాది పొడవునా ప్రాజెక్టుల మంజూరు, కొత్త సర్వీసుల ప్రారంభం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాల్లో నిరంతర నిర్ణయాధికారం, ఆమోదాలకు మార్గం సుగమం చేసింది. మూడోది.. ఇది మరింత పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో కూడిన వ్యవస్థల ద్వారా ప్రాజెక్టుల సమీక్ష జరుగుతోంది.
రికార్డు స్థాయి బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక పరిస్థితి
కేంద్ర బడ్జెట్ 2026-27 భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులను కేటాయించిందని.. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
రైల్వే ప్రధాన వ్యయాలలో సిబ్బంది ఖర్చులు సుమారు రూ. 1.19 లక్షల కోట్లు, పింఛను ఖర్చులు దాదాపు రూ. 64,000 కోట్లు, ఇంధన ఖర్చులు సుమారు రూ. 32,000 కోట్లు, ఆర్థిక నిర్వహణ ఖర్చులు సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఇంత భారీ వ్యయాలు ఉన్నప్పటికీ రైల్వేలు స్వల్ప మిగులును కొనసాగిస్తున్నాయి.
విద్యుదీకరణ వల్ల సుమారు రూ. 6,000 కోట్ల ఆదా జరిగిందని… విద్యుదీకరణ పెరగడం వల్ల డీజిల్ వినియోగం క్రమంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల విస్తరణ, సామర్థ్యం పెంపు
గత దశాబ్ద కాలంలో రైల్వే మౌలిక సదుపాయాలలో జరిగిన గణనీయమైన విస్తరణను శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. సరకు రవాణా.. 2013–14లో సుమారు 1,055 మిలియన్ టన్నుల నుంచి ప్రస్తుతం దాదాపు 1,650 మిలియన్ టన్నులకు పెరిగింది. దీనితో భారతీయ రైల్వే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరకు రవాణా సంస్థగా అవతరించింది.
రైల్వే ట్రాక్ నిర్మాణం భారీ వేగం పుంజుకుంది. గతంలో సుమారు 15,000 కి.మీ.ల ట్రాక్ నిర్మించగా ఈ కాలంలో దాదాపు 35,000 కి.మీ.ల కొత్త లైన్లు వేశారు. విద్యుదీకరణ కూడా వేగవంతమైన పురోగతిని సాధించింది. ఇది సుమారు 5,200 కి.మీ.ల నుంచి దాదాపు 47,000 కి.మీ.లకు పెరిగింది. 99 శాతం కంటే ఎక్కువ నెట్వర్క్ విద్యుదీకరణ పూర్తైంది.
భద్రతా మౌలిక సదుపాయాల పరంగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జిల (ఆర్యూబీ) సంఖ్య సుమారు 4,000 నుంచి దాదాపు 14,000 కు పెరిగింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా సుమారు 1,500 కి.మీ.ల నుంచి 4,000 కి.మీ.లకు పైగా పెరిగింది.
మరింత సురక్షితమైన, ఆధునికమైన ఎల్హెచ్బీ కోచ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో సుమారు 48,000 కోచ్లు అదనంగా రైల్వేలో చేరాయని ఆయన అన్నారు. రైలు ఇంజన్ల (లోకోమోటీవ్) ఉత్పత్తి కూడా సుమారు 12,000 యూనిట్లకు పెరిగింది. కొత్తగా 2 లక్షల యూనిట్ల వ్యాగన్లు కూడా కార్యకలాపాలు ప్రారంభించాయి.
సొరంగ మార్గాలు, సరుకు రవాణా కారిడార్లు- వ్యూహాత్మక అనుసంధానం
సొరంగ మార్గాల (టన్నెల్స్) నిర్మాణంలో ఒక ప్రధాన మైలురాయిని అధిగమించినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రముఖంగా చెప్పారు. 2014 వరకు కేవలం 125 కి.మీ.ల మేర మాత్రమే సొరంగ మార్గాలు నిర్మించగా ఆ తర్వాత అదనంగా 486 కి.మీ.ల సొరంగ మార్గాలు నిర్మాణమయ్యాయి. ఇవి ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి సవాళ్లతో కూడిన భౌగోళిక ప్రాంతాలలో అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి.
ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు (డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్లు - డీఎఫ్సీ) కూడా గణనీయమైన పురోగతిని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 2,800 కి.మీ.ల మేర డీఎఫ్సీ నిర్మాణం పూర్తయిందన్న ఆయన.. ఈ కారిడార్లలో ప్రతిరోజూ సుమారు 480 సరుకు రవాణా రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.
కార్యాచరణ పనితీరు, నెట్వర్క్ వృద్ధి
హోలీ, దీపావళి, ఛత్ వంటి పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 25,571 రైళ్లను నడుపుతోందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
మొత్తం రైల్వే నెట్వర్క్ సుమారు 1,37,522 రూట్ కిలోమీటర్లకు విస్తరించింది. ఇది ఏటా నిరంతర వృద్ధిని సాధిస్తోంది. దీనికి అదనంగా రైల్వేల వద్ద ఇప్పుడు సుమారు 3.86 లక్షల వ్యాగన్లు, దాదాపు 98,000 కోచ్లు ఉన్నాయి. ఇవి రెండూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
భద్రతాపరమైన మెరుగుదలలు
రైల్వే మార్గాల నిర్వహణ, రోలింగ్ స్టాక్ నిర్వహణ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవడం, శిక్షణ పద్ధతులలో ప్రత్యేక మార్పులు చేస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి ప్రధానంగా చెప్పారు.
అసలు కారణాలను వ్యవస్థీకృతంగా విశ్లేషించటంతో పాటు తీసుకుంటున్న సరైన చర్యల వల్ల రైల్వే ప్రమాదాలు సుమారు 90 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. భద్రత విషయంలో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయని.. భద్రతకు సంబంధించిన పనుల కోసం సుమారు రూ. 1.2 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
భద్రతా సాంకేతికతపై మాట్లాడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ 'కవచ్' పురోగతిని ఆయన వివరించారు. ఇప్పటికే సుమారు 3,000 కి.మీ.ల మేర నెట్వర్క్ దీని పరిధిలోకి రాగా.. మరో 20,000 కి.మీ. మేర పనులు కొనసాగుతున్నాయి. అలాగే సుమారు 8,000 రైల్వే ఇంజిన్లలో దీనిని అమర్చాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు.
కవచ్ అనేది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లు, టెలికాం టవర్లు, డేటా సెంటర్లు, ఆన్బోర్డ్ పరికరాలతో కూడిన ఒక సమగ్ర భద్రతా వ్యవస్థ అని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఇది పూర్తి స్థాయి టెలికాం మౌలిక సదుపాయాలతో సమానమైన సంక్లిష్టతను కలిగి ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రయాణికుల సేవలు, అందుబాటు ధరలో ప్రయాణం
సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ప్రయాణాన్ని అందించడానికే రైల్వేలు నిరంతరం ప్రాధాన్యతనిస్తున్నాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెజారిటీ ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేలా సుమారు 70 శాతం కోచ్లు జనరల్, స్లీపర్ క్లాస్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అదనపు జనరల్ కోచ్లను ప్రవేశపెట్టినట్లు కూడా ఆయన తెలిపారు. 2024–25లో సుమారు 1,250 కోచ్లు, 2025–26లో దాదాపు 860 కోచ్లు కొత్తగా తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
రైల్వేలు ప్రస్తుతం ఏటా సుమారు రూ. 60,000 కోట్ల ప్రయాణికుల రాయితీని అందిస్తున్నాయి. అంటే సగటున ప్రతి ప్రయాణికుడిపై సుమారు 45 శాతం రాయితీ లభిస్తోంది. ముంబయి వంటి సబర్బన్ విభాగాలలో అదనంగా రూ. 3,000 కోట్ల రాయితీ అందుతోంది.
నూతన రైల్వే సేవల ప్రారంభం
ఆధునిక రైల్వే సేవల ప్రారంభం, విస్తరణపై కేంద్రమంత్రి మాట్లాడారు. ప్రస్తుతం 160కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. సామాన్యులకు తక్కువ వ్యయంతో సుదూర ప్రయాణాన్ని అందించే 60 అమృత్ భారత్ రైలు సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
133 అమృత్ భారత్ రైళ్ల తయారీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్లకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు.
ముంబయి నగర శివారుల్లోని రైలు వ్యవస్థకు ఆటోమేటిక్ డోర్-క్లోజింగ్ వ్యవస్థతో ఉన్న 238 కొత్త రైళ్లను, తక్కువ దూర ప్రయాణాలకు 200 కొత్త ఎంఈఎంయూ (ఇంటర్సిటీ పేరుతో) రైళ్ల తయారీని రైల్వే శాఖ చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల సౌకర్యం
ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను గణనీయంగా విస్తరించినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో ఏటా సుమారు 2,000-2,500 ప్రత్యేక రైళ్లను నడిపేవారు. ప్రజల సౌకర్యార్థం ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు.
ముఖ్యమైన పండగలైన దీపావళి, ఛత్ సందర్భాల్లో 12,383 ప్రత్యేక రైళ్లు నడిచేవి.. ఈసారి హోళీ సందర్భంగా 1,500లకు పైగా రైళ్లను నడిపినట్లు చెప్పారు.
75 ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కోసం వేచి ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యార్థం 1,200కు పైగా కొత్త ఈఎంయూ, ఎంఈఎంయూ రైలు సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఉపాధి, నియామక సంస్కరణలు
ఉపాధికి సంబంధించిన గణాంకాలను ప్రస్తావిస్తూ.. దశాబ్ద కాలంలో రైల్వేలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 1.43 లక్షల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
వార్షిక నియామకాలకు క్యాలెండర్ను ప్రవేశపెట్టటం ద్వారా పారదర్శకత, ముందస్తు అంచనా సామర్థ్యాన్ని కల్పించినట్లు స్పష్టం చేశారు. రైల్వే నియామక పరీక్షలను 15 భాషల్లో, దాదాపు 150 నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సుమారు 3.6 కోట్ల మంది అభ్యర్థులు హాజరవుతారు.
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కేంద్ర పర్యవేక్షణ వ్యవస్థ (వార్ రూమ్)ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
రైల్వేలో సాంకేతికత, ఆవిష్కరణ, మేక్ ఇన్ ఇండియా
రైల్వే కార్యకలాపాలు, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సేవలతో సహా భారత రైల్వేలోని అన్ని విభాగాల్లో సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా పాత్ర పెరుగుతుందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
జూలై 2025లో ప్రారంభించిన రైల్ వన్ యాప్ విశేష ఆదరణ పొందిందని.. ఇప్పటివరకు 2.5 కోట్లకు పైగా డౌన్లోడ్లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజుకు సుమారు 9.5 లక్షల టికెట్ లావాదేవీలు జరుగుతున్నాయి. రిజర్వుడ్, అన్రిజర్వుడు టికెటింగ్, ప్లాట్ఫారమ్ టికెట్లు, రైలు విచారణలు, పీఎన్ఆర్ స్టేటస్, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు ప్రయాణికుల సేవలను ఒకే వేదికతో అనుసంధానించినట్లు తెలిపారు.
ఎన్నో దశాబ్దాల తర్వాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) సమగ్రంగా ఆధునీకరించినట్లు మంత్రి తెలిపారు. దశలవారీగా అమలు చేస్తున్న ఈ మెరుగైన వ్యవస్థ ద్వారా టికెట్ బుకింగ్ సామర్థ్యం, పారదర్శకత గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారు. ఆటోమేటెడ్ బాట్లు, అనధికారిక సాఫ్ట్వేర్ల ద్వారా జరిగే దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తత్కాల్ బుకింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేపట్టటం ద్వారా సాధారణ ప్రయాణికులకు టికెట్లు సులభంగా లభించే అవకాశం ఉంటుంది.
వన్యప్రాణుల సంరక్షణకు కెమెరాలతో పాటు ఏఐ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే వ్యవస్థ అంతటా ముందస్తు నిర్వహణకు ఐఓటీ, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారతీయ రైల్వేలు ప్రధాన ఎగుమతిదారుగా మారాయి. రూ.24,000 కోట్లకు పైగా రైల్వే ఎగుమతులతో జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సేవలు విస్తరించాయి.
స్టేషన్ పునరాభివృద్ధి, సామర్థ్య విస్తరణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాన్ని భారత రైల్వే చేపట్టిందని.. దీనిద్వారా సుమారు 1,300 స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీటిలో ఇప్పటికే సుమారు 180 స్టేషన్ల పనులు పూర్తవగా, మరో 500 స్టేషన్ల పనులు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు.
పునర్నిర్మాణ సమయంలో స్టేషన్లను మూసివేసే అంతర్జాతీయ పద్ధతులకు భిన్నంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా భారతీయ రైల్వేలు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.
అదనంగా, భవిష్యత్తులో కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచే దిశగా.. ప్లాట్ఫామ్స్ విస్తరణ, స్టాబ్లింగ్ లైన్లు, పిట్ లైన్లు, కోచింగ్ టెర్మినల్స్ వంటి నిర్మాణాలతో సహా అధిక రద్దీ గల 48 నగరాల్లో సామర్థ్య పెంపు పనులను చేపట్టారు.
పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా రైల్వే విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికకు భౌగోళిక ప్రాంతాల డిజిటల్ మ్యాపింగ్ను ఈ ప్లాన్ ఉపయోగిస్తుందన్నారు.
పరిశ్రమలు, పట్టణ, రవాణా కేంద్రాల నుంచి ఉన్న డిమాండ్ను శాస్త్రీయంగా అంచనా వేయటం ద్వారా కొత్త రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు. 2014 నుంచి సుమారు రూ. 4.27 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 27,000 కిలోమీటర్ల మేర నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే విస్తరణ
ఈశాన్య ప్రాంతాల్లో రైలు అనుసంధానతను మెరుగుపరచటంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిజోరాంని ఇప్పటికే రైల్వే వ్యవస్థతో అనుసంధానించామని.. మణిపూర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో కనెక్టివిటీ ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
మెరుగైన రైల్వే సౌకర్యం వల్ల ఈ ప్రాంతంలో ఖర్చులు తగ్గటం పాటు రవాణా వ్యవస్థ మెరుగుపడిందని, ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరిగిందన్నారు.
రైల్వేలు, సాంస్కృతిక అనుసంధానం
దేశవ్యాప్తంగా ప్రధాన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు సదుపాయాన్ని మెరుగుపరచటానికి చేస్తున్న కృషిని మంత్రి వివరించారు.
నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, రాజమండ్రి, కుంభకోణం వంటి నగరాల్లో జరిగే కుంభమేళా కార్యక్రమాలకు సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేషన్ల ఆధునీకరణ, అదనపు వంతెనలు, అండర్పాస్లు, రైల్వే ట్రాక్ల డబ్లింగ్, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల వంటి పనులు ఈ ప్రణాళికలో భాగం.
ప్రాజెక్టు అమలు, భూ సేకరణ సవాళ్లు
రైల్వే ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల సహకారం.. ముఖ్యంగా భూసేకరణ విషయంలో చాలా అవసరమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు ఆలస్యమవటంతో ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం పడుతున్నట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థలో రైల్వే అభివృద్ధి ఉమ్మడి ప్రయత్నమని, భూసేకరణ ప్రక్రియ వేగవంతమైతేనే దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల అమలు వేగంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
హైస్పీడ్, బుల్లెట్ రైళ్ల పురోగతి
ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ప్రాజెక్టులోని కీలక అంశాలు:
-
300 కిలోమీటర్లకు పైగా వంతెన నిర్మాణం పూర్తి
-
పిల్లర్ల నిర్మాణం, ట్రాక్ నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి పనుల్లో గణనీయమైన పురోగతి
-
పలు నదులపై వంతెనల నిర్మాణం పూర్తి
-
భారతదేశపు మొదటి సముద్రగర్భ రైలు సొరంగం పనులు ప్రారంభమై కొంత పురోగతి జరిగింది.
2027 నుంచి దశలవారీగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మార్గంలో రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని, దీనివల్ల 2 గంటల్లోనే ముంబయి, అహ్మదాబాద్ మధ్య ప్రయాణించవచ్చని తెలిపారు.
మరో ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించినట్లు మంత్రి వెల్లడించారు. ఇవి భారతదేశ హై-స్పీడ్ వ్యవస్థను భవిష్యత్తులో సుమారు 4,000 కిలోమీటర్లకు విస్తరిస్తాయని తెలిపారు.
ప్రయాణికుల అనుభవం, పరిశుభ్రతలో సంస్కరణలు
ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచటానికి ముఖ్యంగా పరిశుభ్రతపై కొనసాగుతున్న సంస్కరణలను శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయోగాత్మక ప్రాతిపదికన నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దీనిద్వారా రైలు బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు జనరల్ కోచ్లతో సహా అన్ని తరగతుల బోగీలను నిరంతరం శుభ్రంగా ఉంచుతారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జోన్లలో ఎంపిక చేసిన రైళ్లలో అమలు చేస్తున్నారు. ఇది ప్రయాణీకులందరికీ మరింత సంతృప్తిని కలిగిస్తుందని భావిస్తున్నారు.
సరిహద్దులో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక అనుసంధానం
ప్రసంగం ముగింపు సందర్భంగా శ్రీ అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో, వ్యూహాత్మక ప్రాంతాల్లో రైల్వే అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానతను బలోపేతం చేయటానికి పలు ప్రాజెక్టులను చేపట్టామని.. ఇవి వ్యూహాత్మక చలనశీలతను, ప్రాంతీయ అభివృద్ధిని మెరుగుపరుస్తాయని చెప్పారు. జమ్మూకాశ్మీర్లో బారాముల్లా-ఉరీ ఎక్స్టెన్షన్ (డీపీఆర్ దశ), ఖాజిగుండ్-బుద్గాం డబ్లింగ్ పనులు, జమ్మూ-రాజౌరీ-పూంచ్ అనుసంధానతకు సర్వేలు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.
ఈశాన్య ప్రాంతంలో పలు ప్రాజెక్టులు.. లంక-సిల్చార్, దేకర్గావ్-సిల్ఘాట్, ఇతర వ్యూహాత్మక మార్గాల్లో నూతన రైల్వే లైన్ల కోసం డీపీఆర్ల తయారీ, పూర్తి చేసే పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు రైల్వే సామర్థ్యాన్ని పెంచటంలో భాగంగా న్యూ జల్పైగురి-కామాఖ్య మధ్య అదనపు లైన్లకు సర్వేలు, నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి.
భూటాన్ వంటి పొరుగు దేశాలతో అనుసంధాన ప్రక్రియ, అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా చేపట్టినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలు, రవాణాకు.. ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో అనూప్గఢ్-ఖాజువాలా, జైసల్మేర్-బార్మర్-భిల్డి, భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంట ఇతర మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో బేరి-మనాలీ-లే (డీపీఆర్ దశల) ఘనౌలీ-బద్ది లైన్ వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. పంజాబ్, ఇతర ఉత్తర రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, సామర్థ్య పెంపు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
సిలిగురి కారిడార్లోని వ్యూహాత్మక ప్రాముఖ్యత గల ప్రాజెక్టు గురించి ఆయన వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా కనెక్టివిటీ ఉండేలా అక్కడ 30 కిలోమీటర్ల పొడవుతో భూగర్భంలో రెండు లైన్ల కారిడార్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
భారత్-నేపాల్ సరిహద్దు వెంట అనుసంధానతను బలోపేతం చేయటానికి, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించటానికి రైల్వే లైన్లను రెట్టింపు చేయటం, సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో భాగంగా నర్కటియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా-ముజఫర్పూర్ వంటి రైల్వే సెక్షన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రైల్వే సిబ్బందికి గుర్తింపు, ముగింపు
పండుగలు, క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా రైల్వే కార్యకలాపాల్లో నిరంతరం పాలుపంచుకుంటున్న లోకో పైలట్లు, ట్రాక్ నిర్వహణ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందితో సహా సుమారు 12.5 లక్షల మంది రైల్వే ఉద్యోగుల సహకారాన్ని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అభినందించారు.
రైల్వే సిబ్బంది సమష్టి కృషి, నిరంతరం విధానపరమైన అంశాలపై దృష్టి సారించటం, పెట్టుబడుల ఫలితంగానే భారత రైల్వేలో ఈ మార్పులు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మంత్రిత్వ శాఖ వివరణాత్మక వ్యయ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం కోరుతూ భారత సంఘటిత నిధి నుంచి గ్రాంట్ల కోసం డిమాండ్లను సమర్పించారు. ఇందులో కీలక కార్యాచరణ బాధ్యతలను సమం చేస్తూ.. సామర్థ్య పెంపుదల, భద్రత మెరుగుదల, వ్యవస్థలో రద్దీని తగ్గించటం, ప్రయాణికుల సౌకర్యం వంటి ప్రధానాంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2242218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7