బొగ్గు మంత్రిత్వ శాఖ
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బొగ్గు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 11:00AM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, కమిటీ సభ్యులు, బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
'బొగ్గు కంపెనీల్లో సాంకేతిక అభివృద్ధి' ఎజెండాతో సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ అంశంపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. కీలక విధాన కార్యక్రమాలు, పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలను గురించి ప్రధానంగా చర్చించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ సమావేశానికి హాజరైన ప్రముఖులను, కమిటీ సభ్యులను స్వాగతించారు. ప్రస్తుతం దేశంలో బొగ్గుకు అసాధారణ డిమాండు లేదని తన ప్రసంగంలో శ్రీ దత్ పేర్కొన్నారు.
తన ప్రారంభ ప్రసంగంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ... కోల్ ఇండియా కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా, బొగ్గు గ్యాసిఫికేషన్ వంటి రంగాల్లో పరిశోధనాభివృద్ధిపై విస్తృతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అప్గ్రేడేషన్ కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, శాశ్వత లక్ష్యంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఉత్పత్తి, భద్రత, సామర్థ్యం, పర్యావరణం పట్ల బాధ్యత సహా బొగ్గు రంగంలోని అన్ని అంశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగం పూర్తిస్థాయి సాంకేతిక పరివర్తనను సాధిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. సర్వేయింగ్, 3డి లేజర్ స్కానింగ్, ఏఐ-ఎమ్ఎల్ ఆధారిత అంచనాత్మక విశ్లేషణలు మొదలైన వాటిలో డ్రోన్ టెక్నాలజీ వాడకం వంటి ఉదాహరణలను ఉటంకిస్తూ... ఈ రంగం సాంప్రదాయిక మైనింగ్ నుంచి స్మార్ట్, సురక్షిత, డిజిటల్ మైనింగ్ దిశగా పరివర్తన చెందుతున్నదని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.
కార్బన్ క్యాప్చర్ - స్టోరేజ్, బయోమాస్ కోఫైరింగ్, కోల్ గ్యాసిఫికేషన్ వంటి అధునాతన పరిష్కారాలను స్వీకరించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి కమిటీకి వివరించారు. నిరంతర ఆవిష్కరణలు, సాంకేతిక ఏకీకరణలే బొగ్గు రంగం భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు.
కోల్ ఇండియా లిమిటెడ్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్పై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఐఎల్ చైర్మన్ శ్రీ బి సాయిరాం మాట్లాడుతూ... సీఐఎల్ తన కార్యకలాపాల్లో ప్రధాన సాంకేతిక నవీకరణలను చేపడుతోందని తెలియజేశారు. అన్వేషణ కోసం 3డి సీస్మిక్ సర్వేలు, డ్రోన్ల వంటి అధునాతన సాధనాలను ఉపయోగించడం... సామర్థ్యం, భద్రతను పెంచడానికి నిరంతర మైనర్లు, హైవాల్ సిస్టమ్ల వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించడం ఇందులో భాగమేనని ఆయన తెలిపారు. బొగ్గు రవాణాను మెరుగుపరచడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ కొత్త రైల్వే కారిడార్లు, కన్వేయర్ సిస్టమ్లతో మౌలిక సదుపాయాలనూ మెరుగుపరుస్తోందన్నారు. ఎస్ఏపీ ఈఆర్పీ, 5జీ-ఎనేబుల్డ్ ఐవోటీ సిస్టమ్ల వంటి కార్యక్రమాల ద్వారా డిజిటల్ పరివర్తన ముందుకు సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అగ్రశ్రేణి భారతీయ సంస్థలతో పరిశోధన, సహకారాల ద్వారా క్లీన్ కోల్ టెక్నాలజీలు, స్థిరమైన మైనింగ్పై సీఐఎల్ దృష్టి సారించిందని తన ప్రెజెంటేషన్లో శ్రీ సాయిరాం ప్రధానంగా ప్రస్తావించారు.
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ గురించి ప్రస్తావిస్తూ... సమగ్ర డిజిటలైజేషన్ కార్యక్రమాల ద్వారా ఎన్ఎల్సీ తన కార్యకలాపాలను గణనీయంగా ముందుకు తీసుకెళ్లిందని తెలియజేశారు. అన్ని నైవేలి కాంప్లెక్స్లు, బయటి ప్రాజెక్టులలో భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడానికి డైనమిక్ డాష్బోర్డ్ను... బొగ్గు డిస్పాచ్ను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి డిజిటల్ లాజిస్టిక్ నిర్వహణ వ్యవస్థనూ అమలు చేస్తున్నారు. ఓఐటీడీఎస్, జియో-ఫెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి రియల్-టైమ్ పర్యవేక్షణ జరుగుతున్నది. సమర్థమైన గనుల సర్వే కోసం ఉపరితల 3డి లేజర్ స్కానర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. దొంగతనాలు, దుర్వినియోగాన్ని నివారించడానికి ఇంధన నిర్వహణ వ్యవస్థనూ ఎన్ఎల్సీ అమలు చేసింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సాంకేతిక అప్గ్రేడేషన్ గురించీ కమిటీ అంచనా వేసింది. కీలకమైన కార్యాచరణ మెరుగుదలలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్, 3డి లేజర్ స్కానింగ్, డీజీపీఎస్, డ్రోన్ ఆధారిత జీఐఎస్ సర్వేలు భాగంగా ఉన్నాయని తెలియజేశారు. ఇంటెలిజెంట్ కోల్ లాజిస్టిక్స్ డాష్బోర్డ్, విజువల్ మానిటరింగ్ సిస్టమ్లు, 410కి పైగా డంపర్లలో అమర్చిన భద్రతా పరికరాలతో భద్రతను, సరుకు రవాణాను మెరుగుపరుస్తున్నారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చేపట్టిన సాంకేతిక కార్యక్రమాల గురించీ కమిటీ సభ్యులకు వివరించారు.
మంత్రిత్వ శాఖ చురుకైన ప్రయత్నాలను కమిటీ సభ్యులు ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేయడం ద్వారా బొగ్గు కంపెనీల ఉత్పత్తిని మరింత మెరుగుపరచేందుకు వారు పలు సూచనలు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2239664)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5