పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా సంక్షోభం: మార్చి 12 నుంచి మరిన్ని ప్రాంతాలకు భారతీయ విమానాలు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 11:47PM by PIB Hyderabad
పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను, ఈ ప్రాంతానికి, భారత్కు మధ్య విమానయానంపై పడే ప్రభావాన్ని పౌర విమానయాన శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సత్వర, సమన్వయ చర్యలను చేపట్టేందుకు సంబంధిత వర్గాలతో నేరుగా చర్చిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, సేవలను కొనసాగించడమే ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకొని, మారుతున్న పరిస్థితులకు తగినట్టుగా అవసరమైన ఏర్పాట్లను విమానయాన సంస్థలు చేపడుతున్నాయి.
2026, మార్చి 9 నాటి సమాచారం ప్రకారం పశ్చిమాసియా నుంచి భారత్కు దేశీయ విమానయాన సంస్థలు 45 విమానాలను నడిపాయి. వీటి ద్వారా 7,407 మంది ప్రయాణించారు.
ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, తరలింపు అవసరమైన చోట మద్దతు అందించడానికి కార్యాచరణ సౌలభ్యాన్ని భారతీయ విమానయాన సంస్థలు కోరుతున్నాయి. అదనపు అరైవల్, డిపార్చర్ స్లాట్లను అందించడానికీ, దుబాయి, అబుదాబి, షార్జా, రస్-అల్-ఖైమా, అల్-అలన్, ఫుజైరా, షార్జా, జెడ్డా, మదీనాతో సహా ఇతర ప్రాంతాలకు వచ్చే లేదా అక్కడి నుంచి బయలుదేరే విమానాలకు ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా సంబంధిత అధికారవర్గాలతో డీజీసీఏ సమన్వయం చేస్తోంది.
2026 మార్చి 12 నుంచి రియాద్ నుంచి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు నడుపుతాయని ఎయిర్లైన్స్ కార్యాచరణ ప్రణాళికలు తెలియజేస్తున్నాయి. ఇండిగో సైతం అదే రోజు నుంచి ముంబయి-రియాద్-ముంబయి సేవలను ప్రారంభిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రయాణ భద్రత, సౌలభ్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ విమానాశ్రయ అనుమతులను పొందేందుకు స్పైస్జెట్కు అవకాశం లభించింది. 2026 మార్చి 12 నుంచి ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుత కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా ముంబయి-రియాద్-ముంబయి సర్వీసులను నిర్వహించాలని ఆ సంస్థకు సూచించారు.
ప్రయాణికుల రాకపోకలు క్రమబద్ధంగా సాగేలా చూసేందుకు ఎయిర్లైన్స్, సంబంధిత ఇతర సంస్థలతో మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఈ సమయంలో విమానయాన ఛార్జీలు సహేతుకంగా ఉండేలా, అసంబద్ధంగా ధరలను పెంచకుండా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఫ్లైట్ సమయాలు, ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోన్న మంత్రిత్వ శాఖ అవసరాన్ని బట్టి సమాచారాన్ని అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2238099)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5