ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 5 జిల్లాల మీదుగా సాగే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం
సుమారు 192 కిలోమీటర్ల మేర పెరగనున్న భారతీయ రైల్వే నెట్వర్క్
2030-31 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 4,474 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 4:19PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 4,474 కోట్లు.
ఈ రైలు మార్గాల ప్రాజెక్టులలో సైంథియా - పాకూర్ 4వ లైన్, సంత్రాగచ్చి - ఖరగ్పూర్ 4వ లైన్ ఉన్నాయి.
లైన్ సామర్థ్యం పెరుగుదల వల్ల రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల భారతీయ రైల్వే పనితీరు, సేవల పట్ల విశ్వసనీయత పెరుగుతుంది. ఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు రైళ్ల నిర్వహణను సులభతరం చేస్తాయి. రద్దీని తగ్గిస్తాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నవ భారత్’ దార్శనికతకు అనుగుణంగా చేపట్టే ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ సమగ్ర అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ వారిని ఆత్మనిర్భర్ గా మారుస్తాయి.
పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ-మోడల్ కనెక్టివిటీని, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడం వీటి ప్రధాన లక్ష్యం. ఇవి ప్రజల ప్రయాణాలకు, సరుకులు, సేవల రవాణాకు ఆటంకం లేని అనుసంధానాన్ని అందిస్తాయి.
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అయిదు జిల్లాల మీదుగా సాగే ఈ రెండు ప్రాజెక్టులు భారతీయ రైల్వే ప్రస్తుత రైలు మార్గాలను సుమారు 192 కిలోమీటర్ల మేర పెంచుతాయి.
ఆమోదం పొందిన ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు సుమారు 147 లక్షల జనాభా ఉన్న దాదాపు 5,652 గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రతిపాదిత సామర్థ్య పెంపు దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో బోల్పూర్-శాంతినికేతన్, నందికేశ్వరి ఆలయం (శక్తిపీఠం), తారాపీఠ్ (శక్తిపీఠం), పటచిత్ర గ్రామం, ధాడికా అడవి, భీంబంద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రామేశ్వర కుండ్ మొదలైనవి ఉన్నాయి.
ఆమోదించిన ఈ ప్రాజెక్టులు బొగ్గు, రాయి, డోలమైట్, సిమెంట్, స్లాగ్, జిప్సం, ఇనుము, ఉక్కు, ఆహార ధాన్యాలు, పిఓఎల్, కంటైనర్ వంటి వస్తువుల రవాణాకు అత్యంత కీలకమైన మార్గాలుకానున్నాయి. ఈ సామర్థ్య పెంపు పనుల వల్ల ఏటా సుమారు 31 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) అదనపు సరుకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణానికి అనుకూలమైన, ఇంధన సామర్థ్యంతో కూడిన రవాణా సాధనంగా రైల్వేలు, వాతావరణ లక్ష్యాలను సాధించడంలోనూ, దేశంలో రవాణా వ్యయాన్ని తగ్గించడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. చమురు దిగుమతులను ఆరు కోట్ల లీటర్లు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 28 కోట్ల కిలోగ్రాములు తగ్గిస్తాయి. ఇది సుమారు కోటి చెట్లను నాటినంత ప్రయోజనానికి సమానం.
***
(రిలీజ్ ఐడి: 2237696)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11