రైల్వే మంత్రిత్వ శాఖ
రూ.765 కోట్లకన్నా ఎక్కువ ఖర్చుతో కీలక కారిడార్లలో ట్రాక్షన్ ఉన్నతీకరణలు, డిజిటల్ కమ్యూనికేషన్ మరమ్మత్తులకు భారతీయ రైల్వేల ఆమోదముద్ర
దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం రవాణా కారిడార్లో ట్రాక్షన్ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.318.07 కోట్లు మంజూరు
రాయ్చూర్-గుంతకల్ సెక్షన్లో 126 కి.మీ. మేర ఆధునిక 2×25 కేవీ విద్యుత్తు ట్రాక్షన్ నవీనీకరణకు రూ.259.39 కోట్లు
పశ్చిమ రైల్వేలో వడోదరా, ముంబయి డివిజన్లలో 1,000 కి.మీ. పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కోసం రూ.187.88 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 2:22PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు కీలక సెక్షన్లలో నిర్వహణ కార్యకలాపాలను బలోపేతం చేయడానికీ, మార్గ సామర్థ్యాన్ని విస్తరించడానికీ, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఆధునికీకరించడానికీ మొత్తం రూ.765 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో అనేక మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఉన్నతీకరణ సంబంధిత పనులను మంజూరు చేసింది.
మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో రెండు అధిక రద్దీతో కూడిన సరకు రవాణా, ప్రయాణికుల కారిడార్లలో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థల ఉన్నతీకరణతో పాటు పశ్చిమ రైల్వేలోని వడోదరా, ముంబయి సెంట్రల్ డివిజన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ భారీ విస్తరణ భాగంగా ఉన్నాయి.
దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థ ఉన్నతీకరణ
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 106 కి.మీ. పొడవైన దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఉన్నతీకరించేందుకు రూ.318.07 కోట్లను భారతీయ రైల్వేలు మంజూరు చేసింది.
ఈ సెక్షనును ఇప్పుడున్న 1×25 కేవీ వ్యవస్థ నుంచి 2×25 కేవీ వ్యవస్థ స్థాయికి ఉన్నతీకరిస్తారు. ఇది అధిక రద్దీతో కూడిన కారిడార్లో సరకు తరలింపు సామర్థ్యంలో వృద్ధి, వేగంలో మెరుగుదలతో పాటు విశ్వసనీయత కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
రద్దీగా ఉండే హౌరా-చెన్నై మార్గంలో నెలకొన్న ఈ సెక్షను ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి విశాఖపట్నం ఓడరేవు వరకూ ఖనిజాలు, పారిశ్రామిక వస్తువుల రవాణాలో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఉన్నతీకరణతో విద్యుత్తు సరఫరా సామర్థ్యం బలోపేతం అవుతుంది. సరకు రాక, పోకలు సరళతరం అవుతాయి. ప్రయాణికుల రైళ్ల నిర్వహణ మరింతగా మెరుగుపడుతుంది.
ఈ ప్రాజెక్టు 2024-25 రైల్వే బడ్జెట్లో పేర్కొన్న జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఒకటి. భారతీయ రైల్వేల్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఆధునికీకరించాలనేదే దీని లక్ష్యం.
రాయ్చూర్-గుంతకల్ సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థ ఉన్నతీకరణ
దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ డివిజన్లో భాగంగా ఉంటూ కర్నాటక, ఆంధ్రప్రదేశ్లలో విస్తరించిన 126 కి.మీ. పొడవైన రాయ్చూర్-గుంతకల్ సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఉన్నతీకరించడానికి భారతీయ రైల్వేలు రూ.259.39 కోట్లు మంజూరు చేసింది.
ఈ సెక్షనును ఇప్పుడున్న 1×25 కేవీ వ్యవస్థ స్థాయి నుంచి 2×25 కేవీ వ్యవస్థగా ఉన్నతీకరిస్తారు. అధిక రద్దీ కలిగిన ఈ కారిడార్లో రైళ్లు దీంతో ఇక ఎక్కువ లోడును మోసుకుపోగలుగుతాయి. ఆ రైళ్ల వేగమూ పెరుగుతుంది. నిర్వహణలో విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది.
బిజీగా ఉండే ముంబయి-చెన్నై మార్గంలో పురోగమనంలో ఉన్న ఉన్నతీకరణ పనులు విద్యుత్తు సరఫరా సామర్థ్యాన్ని బలపరుస్తాయి. ఈ పనులు పూర్తి అయిన తరువాత సరకు తరలింపు సాఫీగా సాగుతుంది, వందే భారత్ రైళ్లు సహా మరింత వేగంగా పయనించే ప్రయాణికుల రైళ్ల సేవలు అందుబాటులోకి రాగలవు. ఈ ప్రాజెక్టు 3,000 ఎంటీ సరకు తరలింపును లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ రైల్వేలు ఆ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నెట్వర్క్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
ఈ పని 2024-25 రైల్వే బడ్జెట్లో పేర్కొన్న దేశవ్యాప్త కార్యక్రమంలో ఓ భాగం. భారతీయ రైల్వేల్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఆధునికీకరించడం దీని లక్ష్యం.
వడోదరా, ముంబయి డివిజన్లలో అందుబాటులోకి కీలక ఓఎఫ్సీ కమ్యూనికేషన్ వ్యవస్థ
పశ్చిమ రైల్వేలోని వడోదరా, ముంబయి సెంట్రల్ డివిజన్లలో కమ్యూనికేషనును పటిష్ఠపరిచే ఉద్దేశంతో రూ.187.88 కోట్లను భారతీయ రైల్వేలు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 4×48 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్సీ) వ్యవస్థను నెలకొల్పుతారు. దీంతో ఎల్టీఈ- ఆధారిత ‘కవచ్’, తదితర కీలక రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థలకు అధిక బ్యాండ్విడ్త్ సామర్థ్యం, నెట్వర్క్ రిడండెన్సీతో పాటు విశ్వసనీయ రక్షణ లభిస్తుంది. దేశంలో రైళ్లు ఒకదానితో మరొకటి డీకొనకుండా చూసే ‘కవచ్’ వ్యవస్థను పనిచేయించడానికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ ఉన్నతీకరణలో ప్రాధాన్యాన్ని ఇస్తారు.
ఈ పనిలో భాగంగా, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను 1,000 కిలోమీటర్ల మేర సమకూరుస్తారు. దీనిలో వడోదరా డివిజన్ పరిధిలో 692 కి.మీ., ముంబయి డివిజన్లో 308 కి.మీ. కలిసుంటాయి.
ఈ ప్రాజెక్టు 2024-25 రైల్వే బడ్జెట్లో పేర్కొన్న భారీ దేశవ్యాప్త కార్యక్రమంలో ఓ భాగం. ‘కవచ్’ను విస్తరించడంతో పాటు, నెట్వర్క్ అంతటా రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఆధునికీకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
రైల్వే మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యం పటిష్ఠీకరణ
మంజూరు చేసిన ఈ పనులు ట్రాక్షన్ వ్యవస్థలను మెరుగుపరిచి, కమ్యూనికేషన్లను పటిష్ఠపరచడంతో పాటు ప్రధాన రైల్వే కారిడార్లలో సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతాయి. ఫలితంగా రైల్వే కార్యకలాపాల సామర్థ్యం, విశ్వసనీయత ఇప్పటితో పోలిస్తే చెప్పుకోదగినంతగా వృద్ధి చెందుతుంది.
ఈ కార్యక్రమాలు ఆధునిక రైళ్ల నిర్వహణకు తోడ్పడడంతో పాటు, డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్కుల్ని బలపరుస్తాయి. కీలక సరకు రవాణా, ప్రయాణికుల మార్గాల్లో భారతీయ రైల్వేల పనితీరును సమగ్రంగా మెరుగుపరుస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2237577)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11