|
యు పి ఎస్ సి
సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) 2025 ఫలితాల విశేషాలు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 4:10PM by PIB Hyderabad
సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) - 2025 తుది ఫలితాలను 2026 మార్చి 6న ప్రకటించారు. ఈ ఫలితాలకు సంబంధించిన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి:
-
సివిల్ సర్వీసెస్ (ప్రాథమిక) పరీక్షను 2025 మే 25న నిర్వహించారు. దీనికోసం మొత్తం 9,37,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 5,76,793 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
-
ఆగస్టు 2025లో జరిగిన రాతపూర్వక (మెయిన్స్) పరీక్షకు మొత్తం 14,161 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
-
ఇంటర్వూ (పర్సనాలిటీ టెస్ట్): మెయిన్స్ ఫలితాల అనంతరం మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) దశకు ఎంపికయ్యారు.
-
వివిధ సర్వీసుల్లో నియామకం కోసం కమిషన్ మొత్తం 958 మంది అభ్యర్థులను (659 మంది పురుషులు, 299 మంది మహిళలు) సిఫార్సు చేసింది.
-
తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులలో మొదటి ఐదు స్థానాల్లో ఒక మహిళ, నలుగురు పురుషులు నిలిచారు.
-
సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2025లో శ్రీ అనుజ్ అగ్నిహోత్రి (రోల్ నెం. 1131589) మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన 'మెడికల్ సైన్స్'ను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు. ఆయన జోధ్పూర్లోని ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
-
చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ (బీఈ.) పూర్తి చేసిన కుమారి రాజేశ్వరి సువే ఎం (రోల్ నెం. 4000040).. సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించారు. ఆమె 'సోషియాలజీ'ని ఆప్షనల్గా తీసుకున్నారు.
-
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీకామ్) పూర్తి చేసిన శ్రీ ఆకాంశ్ ధుల్ (రోల్ నెం. 3512521) మూడో స్థానంలో నిలిచారు. ఆయన 'కామర్స్ - అకౌంటెన్సీ'ని ఆప్షనల్గా తీసుకున్నారు.
-
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచే బీ.ఏ. (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం పూర్తి చేసిన శ్రీ రాఘవ్ ఝున్ఝున్వాలా (రోల్ నెం. 0834732) నాలుగో ర్యాంకు సాధించారు. ఆయన ఆప్షనల్ 'ఆర్థిక శాస్త్రం'.
-
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఢిల్లీ) నుంచి బీఏ. ఎల్ఎల్బీ (ఆనర్స్) పూర్తి చేసిన శ్రీ ఇషాన్ భట్నాగర్ (రోల్ నెం. 0409847) ఐదో ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఆయన 'సోషియాలజీ'ని ఆప్షనల్ తీసుకున్నారు.
-
మొదటి 25 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.
-
టాప్ 25 ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, న్యాయ శాస్త్రం, మెడికల్ సైన్స్, మాస్ మీడియా వంటి వివిధ రంగాల్లో విద్యార్హతలు ఉన్నాయి. వీరంతా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీ, ఎన్ఎల్యూ, ఏయిమ్స్, డీటీయూ, అన్నా విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ముంబయి విశ్వవిద్యాలయం వంటి సంస్థల నుంచి పట్టభద్రులయ్యారు.
-
రాతపూర్వక (మెయిన్స్) పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి 25 మంది అభ్యర్థులు ఆంత్రోపాలజీ, కామర్స్ - అకౌంటెన్సీ, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, చరిత్ర, గణితం, మెడికల్ సైన్స్, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం - అంతర్జాతీయ సంబంధాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్గా తీసుకున్నారు.
-
సిఫార్సు చేసిన మొత్తం అభ్యర్థులలో 42 మంది దివ్యాంగులు ఉన్నారు. ఇందులో 10 మంది అస్థివైకల్యం ఉన్నవారు, 14 మంది దృష్టి లోపం ఉన్నవారు, 09 మంది వినికిడి లోపం ఉన్నవారు, 09 మంది బహుళ వైకల్యాలు ఉన్నవారు.
***
(రిలీజ్ ఐడి: 2236237)
|