ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎస్ఐటీఏసీ వ్యవస్థ ద్వారా ఇండియా, స్వీడన్ ఏఐ భాగస్వామ్యం మరింత బలోపేతం
స్వీడన్-ఇండియా సాంకేతికత, కృత్రిమమేధ కారిడార్ (ఎస్ఐటీఏసీ)ని ఏర్పాటు చేయనున్న ఇండియాఏఐ మిషన్, బిజినెస్ స్వీడన్
ద్వైపాక్షిక ఏఐ సహకారాన్ని బలోపేతం చేయటం, వాణిజ్య, పెట్టుబడులను ప్రోత్సహించటం, బాధ్యతాయుతమైన, విస్తరించదగిన డిజిటల్ ఆవిష్కరణల దిశగా సాగటమే ఈ భాగస్వామ్య లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 7:02PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా.. ఇండియాఏఐ మిషన్, బిజినెస్ స్వీడన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరింది. కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటం, ఇండియా-స్వీడన్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించటం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
కృత్రిమ మేధ పరిష్కారాల అభివృద్ధి, అన్వయం, వినియోగంలో పరస్పర సహకారానికి నిర్మాణాత్మక వ్యవస్థను ఈ ప్రాథమిక ప్రకటన అందిస్తుంది. పారిశ్రామిక, సామాజిక రంగాల్లో వాస్తవ ఫలితాలను సాధించటంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. భారతదేశం, స్వీడన్ మధ్య దీర్ఘకాల భాగస్వామ్య ప్రాతిపదికన ఈ సహకారం కొనసాగుతుంది. ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధికి ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలనే రెండు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలను ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి ఇండియాఏఐ మిషన్ సీఓఓ శ్రీమతి కవితా భాటియా మాట్లాడుతూ.. "కృత్రిమమేధ రంగంలో భారత్, స్వీడన్ దేశాలు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. విలువలతో కూడిన, స్థిరమైన, విశ్వసనీయమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే సహ నిర్మాతలు. మా మధ్య కుదిరిన ఈ సహకారం రెండు దేశాల పరస్పర తోడ్పాటు, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం. ఇది ప్రపంచ సాంకేతిక పరివర్తనలో తదుపరి దశను నిర్దేశించేలా రెండు దేశాలను సిద్ధం చేస్తుంది" అని అన్నారు.
"ఇండియాఏఐతో కుదుర్చుకున్న ఈ ప్రాథమిక ఒప్పందం కీలక అడుగు. ఇది ఉమ్మడి వ్యూహాత్మక దార్శనికతను ఆచరణాత్మక ఫలితాలుగా మారుస్తుంది. ఎస్ఐటీఏసీ ద్వారా రెండు దేశాల్లోని అత్యుత్తమ ఏఐ, డిజిటల్ సాంకేతిక ఆవిష్కరణలను ఏకం చేయాలని తద్వారా సరికొత్త వాణిజ్య అవకాశాలను సృష్టించాలని భావిస్తున్నాం" అని ఇండియాకు స్వీడన్ వాణిజ్య, పెట్టుబడుల కమిషనర్ శ్రీమతి సోఫియా హోగ్మాన్ తెలిపారు.
ఇరుదేశాలు కలిసి స్వీడన్-ఇండియా సాంకేతికత, కృత్రిమమేధ కారిడార్ (ఎస్ఐటీఏసీ)ని అభివృద్ధి చేయనున్నాయి. రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, అంకుర సంస్థలు, విద్యాసంస్థల మధ్య క్రమబద్ధమైన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాన వేదికగా ఎస్ఐటీఏసీ నిలుస్తుంది.
ఎస్ఐటీఏసీ ద్వారా రెండు విభాగాలు ఈ కార్యక్రమాలను చేపడతాయి:
-
సదస్సులు, సెమినార్లు, ఇత్తివృత్తంతో కూడిన కార్యశాలల నిర్వహణ
-
భారతదేశం, స్వీడన్ ఏఐ వ్యవస్థల మధ్య పరస్పర మార్పిడిని సులభతరం చేయటం
-
ఆవిష్కరణల కేంద్రాలు, అత్యున్నత ప్రమాణాల కేంద్రాల సందర్శన
-
కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విధాన రూపకర్తల మధ్య సమన్వయం
-
ఉమ్మడి ఆవిష్కరణ వేదికలు, పెట్టుబడి కారిడార్లకు అవకాశాలను గుర్తించటం
-
ప్రాధాన్యత కలిగిన రంగాల్లో ఏఐ పరిష్కారాల విస్తరణను ప్రోత్సహించటం
కంప్యూటింగ్ వనరులు, డేటా, నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత ద్వారా సమగ్రమైన జాతీయ ఏఐ వ్యవస్థను నెలకొల్పాలనే ఇండియాఏఐ మిషన్ లక్ష్యాలకు.. పారిశ్రామిక ఆవిష్కరణలు, అధునాతన పరిశోధన, అభివృద్ధి, బాధ్యతాయుతమైన ఏఐ అమలులో స్వీడన్ దేశానికున్న నైపుణ్యం తోడవుతుంది. ఇరుదేశాల్లోని వాణిజ్య కంపెనీలు, అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయటానికి.. ఉమ్మడిగా విస్తరించదగిన, సమ్మిళిత ఏఐ పరిష్కారాలను రూపొందించటానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2233288)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8