ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్లోని హెచ్సిఎల్-ఫాక్స్కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి
ఉత్తరప్రదేశ్లో హెచ్సిఎల్ -ఫాక్స్కాన్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు సాంకేతిక స్వయం-సమృద్ధి దిశగా కీలక ముందడుగు
ప్రపంచ చిప్ తయారీ వ్యవస్థలో పెరగనున్న భారత్ ఉనికి
సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో భారత్ అభివృద్ధి
దేశ సెమీకండక్టర్ వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారుతున్న ఉత్తరప్రదేశ్
హెచ్సిఎల్-ఫాక్స్కాన్ల నూతన కర్మాగారంతో సాంకేతికకు ప్రధాన కేంద్రంగా బలోపేతం కానున్న యూపీ గుర్తింపు
ఈ డెకేడ్(దశాబ్దం) భారత్ కోసం ఒక టెకేడ్
భారత్ సాధించిన నేటి సాంకేతిక పురోగతి 21వ శతాబ్దంలో మన బలానికి పునాది
చిప్ తయారీలో స్వయం-సమృద్ధి భారత్ లక్ష్యం
బలమైన దేశీయ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి
విశ్వసనీయ ప్రపంచ భాగస్వామిగా ప్రజాస్వామ్య భారత్
మన భాగస్వామ్యంతో పెరుగుతున్న అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థల సామర్థ్యం
భారత్ను భవిష్యత్తు సాంకేతికత కేంద్రంగా చూస్తున్న ప్రపంచం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 8:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని హెచ్సిఎల్-ఫాక్స్కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు తర్వాత, ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది.
సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... వికసిత్ భారత్ లక్ష్యం సాకారం దిశగా భారత్ వేగంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. "నేను ఎర్రకోట బురుజుల నుంచి చెప్పాను... భారత్ వద్ద ఆపడానికి గానీ, ఆగిపోవడానికి సమయం లేదు. 2026 ప్రారంభం నుంచి భారత్ తన వేగాన్ని మరింత పెంచింది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, దేశంలో అంకురసంస్థల విప్లవానికి ఊతమిచ్చిన జాతీయ అంకురసంస్థల దినోత్సవం, భారత్ బలం ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేసిన భారత ఇంధన సదస్సు వంటి ఇటీవలి విజయవంతమైన పలు కార్యక్రమాలను శ్రీ మోదీ ఉదహరించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ దేశ పురోగతికి కొత్త ఊపునిచ్చిందని, ఇది దేశానికి నిజంగా చరిత్రాత్మక వారంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా ప్రపంచ నాయకులు, దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు భారత ఏఐ సామర్థ్యాలను వీక్షించడానికి సమావేశమయ్యారనీ... వారంతా మన దేశ వ్యూహాత్మక దృక్పథాన్ని గుర్తించి, ప్రశంసించారనీ ఆయన స్పష్టం చేశారు. నిన్న ఏఐ శిఖరాగ్ర సదస్సు ముగిసిన వెంటనే భారత సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేసే నేటి ఈ భారీ కార్యక్రమంతో దేశం మరో ముందడుగు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. "ఆధునిక ప్రపంచాన్ని నడపడానికి అవసరమైన ప్రాసెసింగ్ శక్తిని అందించడంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంశాలపై ఏకకాలంలో విజయవంతంగా పనిచేస్తోంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ప్రస్తుత డెకేడ్ (దశాబ్దం) భారత టెకేడ్ అనే తన దార్శనికతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. హరిత ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ టెక్నాలజీ, ఏఐ వంటి రంగాల్లో పెట్టుబడులు 21వ శతాబ్దపు సామర్థ్యానికి పునాది వేస్తాయని ఆయన అన్నారు. మానవాళి భవిష్యత్తును నిర్ణయించే ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ నేడు అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, దేశంలో ఈ బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధి దీనికి ప్రధాన ఉదాహరణ అవుతుందని ఆయన తెలిపారు.
చిప్స్ వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి... 21వ శతాబ్దంలో వాటి విలువను 20వ శతాబ్దంలో చమురుకు గల విలువతో పోల్చారు. "కరోనా మహమ్మారి సమయంలో, ప్రపంచం చిప్ సరఫరా వ్యవస్థలో వైఫల్యాన్ని ప్రత్యక్షంగా చూసింది. సరఫరా ఆగిపోయిన క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆ సంక్షోభం నుంచి పాఠం నేర్చిన భారత్... దానిని అవకాశంగా మార్చుకుందన్నారు. భారత్ చిప్ తయారీలో స్వయం-సమృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నదని ఆయన తెలిపారు. "నేటి కార్యక్రమం ఈ దార్శనికతకు ప్రతిబింబం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
"మేడ్-ఇన్-ఇండియా" చిప్లను వికసిత్ భారత్ దార్శనికతకు వెన్నెముకగా అభివర్ణించిన ప్రధానమంత్రి... ఏఐ, 6జీ మొదలుకొని రక్షణ, ఈవీల వరకు అన్ని కీలక రంగాలకు ఈ చిప్లు శక్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు మద్దతుగా... సెమీకండక్టర్ మిషన్ రెండో దశను, సమగ్ర దేశీయ పరిశోధనాభివృద్ధి, తయారీ మద్దతు కోసం రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు వంటి బడ్జెట్ ఆధారిత పురోగతులతో పాటుగా 85,000 మంది నిపుణులకు శిక్షణనివ్వడానికి ఏర్పాటు చేసిన చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమాన్నీ ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా, దేశ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్ర పరివర్తన పట్ల శ్రీ మోదీ గర్వపడుతున్నట్లు తెలిపారు. “సెమీకండక్టర్ వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా యూపీ మారుతోంది. ఇది డిజైన్ హౌస్లు, పరిశోధన-అభివృద్ధి కేంద్రాలు, అంకురసంస్థల వ్యవస్థలను ఈ ప్రాంతానికి తీసుకువస్తుంది. యువతకు అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
గత 11 సంవత్సరాల్లో భారత్ తన పారిశ్రామిక రంగంలో గొప్ప మార్పును చూసిందన్న ప్రధానమంత్రి.... ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. "ఈ వృద్ధి మొబైల్ విప్లవంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దేశీయ ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. ఎగుమతులూ 100 రెట్లు పెరిగాయి" అని ఆయన తెలిపారు. దేశంలోనే ఈ రంగానికి ఉత్తరప్రదేశ్ ప్రధాన కేంద్రంగా, ఈ విజయగాథకు మూలస్తంభంగా ఆవిర్భవించిందన్నారు. ప్రస్తుతం దేశంలో తయారయ్యే మొత్తం మొబైల్ ఫోన్లలో సగానికి పైగా ఇక్కడే ఉన్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ తయారీ కేంద్రంగా మారే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో ఈ పరివర్తనను కీలక ముందడుగుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఒకప్పుడు నేరాలు, వలసలతో ముడిపడి ఉన్న ఉత్తరప్రదేశ్ గుర్తింపును... ఎక్స్ప్రెస్వేలు, రక్షణ కారిడార్లు, జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు వంటి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా మార్చిన ఘనత "డబుల్-ఇంజిన్ ప్రభుత్వానిదే" అని ప్రధానమంత్రి తెలిపారు. "ప్రపంచ పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి అద్భుతమైన రాబడికి హామీ ఉంటుందని తెలిసే యూపీ రాష్ట్రానికి వస్తున్నారు" అని ప్రధానమంత్రి అన్నారు. ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు కారిడార్ను రేపు ప్రారంభిస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. ఇది ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మరింత పెంచుతుందని తెలిపారు.
హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్, ఫాక్స్కాన్ సెమీకండక్టర్ బిజినెస్ గ్రూప్ అధ్యక్షులు బాబ్ చెన్లకు వారి భాగస్వామ్యం కోసం ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. "ప్రజాస్వామ్య భారత్ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామి. మా భాగస్వామ్యం వారి ఉత్పత్తి నెట్వర్క్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది, ఇది భారత్-ప్రపంచం కోసం పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం." అనే సందేశాన్ని ఫాక్స్కాన్ ఉనికి ప్రపంచానికి అందిస్తుందని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2231593)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam