శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రోగనిర్ధారణలో సంశయాలకు తావులేకుండా ఏఐ ఆధారిత వైద్య పరికరాలతో రోగులకు మరింత కచ్చితమైన, నిర్దిష్టమైన చికిత్స: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారత్ లో ఏఐ ఆధారిత జెనోమిక్స్, జీన్ చికిత్సా యుగం ప్రారంభం; ఇక కచ్చితమైన ఔషధంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు: డాక్టర్ జితేంద్ర సింగ్
అడ్వాన్స్డ్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ రంగాల్లో పరిశోధనల వేగవంతానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
పెరుగుతున్న సగటు ఆయుర్దాయం, చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులు అధునాతన వ్యాధి నిర్ధారణ విధానాల అవసరాన్ని సూచిస్తున్నాయి; వికసిత భారత్ సాధనకు ఆరోగ్యవంతమైన యువత అత్యవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 4:05PM by PIB Hyderabad
రోగనిర్ధారణలో సంశయాలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా ఏఐ ఆధారిత పరికరాలు పనిచేస్తాయని, ఇవి రోగులకు మరింత కచ్చితమైన, నిర్దిష్టమైన చికిత్స అందేలా చేస్తాయని శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి అంతరిక్ష విభాగాల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఉదాహరణకు, క్యాన్సర్ రోగి బయాప్సీ స్లైడ్ను పాథాలజిస్ట్ కంటితో పరీక్షించేటప్పుడు సూక్ష్మమైన కణ సమూహాలను గుర్తించడంలో పొరపాట్లు జరగవచ్చని, కానీ ఏఐ ఆధారిత వ్యవస్థ ఆ కణాలు ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని నేరుగా చూపిస్తూ, మానవ తప్పిదాలను తగ్గిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. "మెడిల్యూమినా 2026: ఇంటర్నేషనల్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ కాన్ఫరెన్స్" ప్రారంభోత్సవంలో మంత్రి ప్రసంగించారు. అదేవిధంగా, క్లినికల్ పరీక్షల సమయంలో రోగికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషించే ఏఐ పరికరాలు సాధారణంగా కంటికి కనిపించని అంశాలను కూడా గుర్తించి హెచ్చరిస్తాయి. దీనివల్ల రోగనిర్ధారణ కచ్చితత్వం పెరగడమే కాకుండా, చికిత్సలో మెరుగైన ఫలితాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
సమగ్ర వైద్య చర్చల ప్రాముఖ్యతను వివరిస్తూ, పెరుగుతున్న సూపర్-స్పెషలైజేషన్ కారణంగా వివిధ విభాగాల మధ్య పరస్పర సంప్రదింపులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రోగనిర్ధారణ సంస్థలు ఇటువంటి మల్టీ-స్పెషాలిటీ విద్యా వేదికలను ఏర్పాటు చేయడం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. వైద్య రంగం ప్రస్తుతం మెడ్టెక్, ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ డేటా సైన్సెస్ వంటి అనేక విభాగాలతో అనుసంధానమై విస్తరిస్తున్న తరుణంలో ఈ తరహా సమగ్ర దృక్పథం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా వైద్య శాస్త్రంలో వచ్చిన మార్పులను వివరిస్తూ, సాంప్రదాయ క్లినికల్ అభ్యాస దశ నుంచి ఇమేజింగ్, మాలిక్యులర్ టూల్స్, అల్ట్రాసౌండ్, సిటి స్కాన్, ఎంఆర్ఐ, ప్రస్తుతం జెనోమిక్స్ ఆధారిత యుగం వరకు సాగిన పరిణామ క్రమాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. గతంలో వైద్య నైపుణ్యం అనేది కేవలం విస్తృతమైన చదువుపైనే ఆధారపడి ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి మారిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత వ్యవస్థలు వైద్యుల క్లినికల్ నిర్ణయాలకు తోడ్పడుతూ వాటిని మరింత మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, ఆరోగ్య సేవల్లో కమ్యూనికేషన్ అడ్డంకులను ఏఐ భాషా పరికరాలు తొలగిస్తున్నాయని, దీనివల్ల మొబైల్ క్లినిక్లు, డిజిటల్ వేదికల ప్లాట్ఫారమ్ల ద్వారా వైద్య సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువవుతున్నాయని ఆయన వెల్లడించారు.
భారతదేశంలో మారుతున్న వ్యాధుల స్థితిగతుల గురించి మంత్రి వివరంగా మాట్లాడుతూ, ఒకప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు - ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో మధుమేహం (డయాబెటిస్) లేదా హిమాలయ ప్రాంతాల్లో థైరాయిడ్ రుగ్మతలు—నేడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు తగ్గిపోవడం వంటి కారణాలే దీనికి కారణమని ఆయన వివరించారు. పెరుగుతున్న సగటు ఆయుర్దాయం కారణంగా వయోసంబంధిత వ్యాధులు ముందంజలోకి వచ్చాయి, అదే సమయంలో జీవనశైలి వ్యాధులు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఒకదానితో ఒకటి కలిసిపోయే లక్షణాలున్న వ్యాధులను గుర్తించడానికి, తప్పుడు చికిత్సా పద్ధతులను నివారించడానికి ముందస్తు, కచ్చితమైన రోగనిర్ధారణ పరీక్షలు అనివార్యమయ్యాయి.
భారత్ జెనోమిక్స్, జీన్ థెరపీలో సరికొత్త యుగంలోకి అడుగుపెడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రాథమికంగా పది లక్షల మంది వ్యక్తుల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. హేమోఫీలియా వ్యాధికి సంబంధించి ప్రముఖ వైద్య సంస్థల భాగస్వామ్యంతో జరిగిన జీన్ థెరపీ క్లినికల్ పరిశోధనలు విజయవంతం కావడం ఒక గొప్ప శాస్త్రీయ విజయమని ఆయన పేర్కొన్నారు. అలాగే, భారత మొట్టమొదటి స్వదేశీ యాంటీబయోటిక్ 'నాఫిత్రోమైసిన్' తయారీ దేశంలో పెరుగుతున్న లైఫ్ సైన్సెస్ సామర్థ్యాలకు నిదర్శనమని ఆయన వెల్లడించారు.
రాబోయే దశాబ్దాల్లో జన్యుపరమైన ప్రొఫైలింగ్, పర్యావరణ అంశాలు, జీవనశైలి ఆధారంగా అందించే వ్యక్తిగతీకరించిన చికిత్సలు సర్వసాధారణం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఏఐ ఆధారిత రోగనిర్ధారణ విశ్లేషణలు, జెనోమిక్ ఆలోచనలతో కలిసి వైద్యులు అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా, ప్రతి రోగికి అవసరమైన ప్రత్యేక చికిత్సా విధానాలను రూపొందించేందుకు వీలు కల్పిస్తాయని ఆయన వివరించారు.
భారతదేశ పరిశోధనా రంగాన్ని విస్తరించడం కోసం చేపట్టిన విధానపరమైన సంస్కరణల గురించి కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. అంతరిక్షం, న్యూక్లియర్ మెడిసిన్,అత్యాధునిక ఆరోగ్య పరిశోధన వంటి రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం తలుపులు తెరిచిందని, ఇది ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరిశోధనలతో కలిసి పనిచేయాలని ప్రముఖ రోగనిర్ధారణ సంస్థలను ఆయన ఆహ్వానించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బలాన్ని ఏకం చేయడం ద్వారా న్యూక్లియర్ మెడిసిన్ థెరపీ, అడ్వాన్స్డ్ ఆంకాలజీ (క్యాన్సర్) చికిత్స వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులను వేగవంతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య రంగాన్ని విస్తృత జాతీయ దృక్పథంతో అనుసంధానిస్తూ, భారత జనాభాలో 70 శాతానికి పైగా 40 ఏళ్లలోపు వారే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం వికసిత్ భారత్ నిర్మాణంలో అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఏఐ, జెనోమిక్స్ , విశ్వసనీయమైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన బలమైన రోగనిర్ధారణ వ్యవస్థ నివారణ, కచ్చితత్వంతో కూడిన వైద్యం అందరికీ అందుబాటులోకి రావడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
మెడికల్ కాన్ఫరెన్స్ ముగింపులో - రోగనిర్ధారణా విధానాలను మెరుగుపరచడం, వివిధ వైద్య విభాగాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఏఐ ఆధారిత పరికరాలను ఉపయోగించడం ద్వారా భారత్ కోసం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రకటించారు.
***
(రిలీజ్ ఐడి: 2231334)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5