వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ నైపుణ్యాలను, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసేందుకు ఐసీఏఆర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 7:53PM by PIB Hyderabad
హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఐసీ ఏఆర్- ఎన్ఏఏఆర్ఎం) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్) ఒక చరిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. గ్రామీణ భారతదేశం అంతటా వ్యవసాయ వృత్తి విద్యా శిక్షణను మెరుగుపరచడం, రైతు విస్తరణ సేవలను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులలో సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం.
వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ సమగ్ర మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన వ్యూహాత్మక సమన్వయం, సంస్థాగత సమగ్రతను ఐసీఏఆర్ సహాయ డైరెక్టర్ జనరల్ (కో ఆర్డినేషన్) డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐకార్ - నార్మ్ కార్యాలయంలో రెండు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం అధికారికంగా ఖరారైంది. వ్యవసాయ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఐకార్ - నార్మ్ హైదరాబాద్ డైరెక్టర్, ఐకార్-అటారీ హైదరాబాద్, డైరెక్టర్, ఐకార్-అటారీ బెంగళూరు డైరెక్టర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ హైదరాబాద్కు చెందిన సీనియర్ టెక్నికల్ అసోసియేట్ల సమక్షంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డైరెక్టర్ (గ్రామీణ జీవనోపాధి) శ్రీ సుమన్ ఎస్., ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్) డాక్టర్ రాజ్బీర్ సింగ్ ఈ అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.
ఒప్పందం వ్యూహాత్మక ప్రణాళిక
ఈ అవగాహన ఒప్పందం కింద, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, అమలు ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరమైన ప్రభావాన్ని సృష్టించేందుకు ఐసీఏఆర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ పలు రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. డీఆర్ఎఫ్ లీడ్ ఫార్మర్స్ ప్లాట్ఫారం (ఎల్ఈపీ) మోడల్ ద్వారా చిన్న, సూక్ష్మ రైతుల సామర్థ్యాభివృద్ధి చేపడతారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులు (క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్), స్థిరమైన వ్యవసాయ విధానాలపై ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను, ఐసీఏఆర్ సాంకేతిక నైపుణ్యాన్ని డీఆర్ఎఫ్ సమాజాధారిత విస్తరణ నమూనాతో సమన్వయం చేస్తూ విస్తరించనున్నారు.
పరస్పర అనుభవాల శక్తి
ఐసీఏఆర్ దాదాపు 90 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధన, విస్తరణ సేవలు, విజ్ఞాన నిర్వహణ, సామర్థ్యాభివృద్ధి, విధాన పరిరక్షణ రంగాల్లో విశేష అనుభవాన్ని కలిగి ఉంది. ఈ మండలి సాంకేతిక మార్గదర్శకత్వం, పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి సహాయం, అలాగే దేశవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. యువత, దివ్యాంగులు, గ్రామీణ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 20 లక్షలకు పైగా జీవితాలను ప్రభావితం చేసింది. ఈ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక 'మిత్ర' కార్యక్రమం ద్వారా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 80,000 మందికి పైగా రైతులు మెరుగైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేయడంలో విజయం సాధించింది. ఇది వారి 'రైతు నుండి రైతుకు' విస్తరణ నమూనా ప్రభావాన్ని నిరూపిస్తోంది.
ఆశించిన ఫలితాలు
ఈ భాగస్వామ్యం ప్రధానంగా ఈ క్రింద కీలక రంగాలలో మార్పులు తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది.
*వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి: నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవీఈటీ) ద్వారా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్) ఇటీవల పొందిన 'అవార్డింగ్ బాడీ (స్టాండర్డ్)' గుర్తింపును ఆధారంగా చేసుకుని, ఈ భాగస్వామ్యం ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తారు.
*భూసారం నుంచి వన్ హెల్త్ దిశగా మార్పు: వన్ హెల్త్ కార్యాచరణలో భాగంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ భాగస్వామ్యం బయోచార్-ఆధారిత, భూ సంబంధ జీవశాస్త్రం (సాయిల్ బయోలాజిక్స్) ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ ఆహార వ్యవస్థల కోసం స్థిరమైన పంట వ్యర్థాల నిర్వహణను, కార్బన్ ప్రోత్సాహకాలను పెంపొందిస్తుంది.
*విపత్తు నష్టాల తగ్గింపు కోసం ప్రతిఘటన సామర్ధ్యం: ఈ భాగస్వామ్యం ద్వారా సాంకేతిక ఆధారిత విస్తరణ సేవలు, కార్బన్ ప్రోత్సాహకాలతో కూడిన వనరుల సమర్థ వినియోగ పద్ధతులు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వాతావరణ ప్రమాద నివారణ వ్యూహాల ద్వారా రైతులకు క్లైమేట్-స్మార్ట్, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులను అనుసరించేందుకు మార్గదర్శనం చేస్తారు.
*వ్యవసాయ విస్తరణ సేవలు, మార్కెట్ అనుసంధానం: చివరి మైలు వరకు విస్తరణ సేవల అంతరాలను పూడ్చడానికి ఈ భాగస్వామ్యం 'లీడ్ ఫార్మర్స్ ప్లాట్ఫారమ్'ను విస్తరిస్తుంది. అదే సమయంలో చిన్న, సన్నకారు రైతులకు మార్కెట్ అనుసంధానాలను, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతను పటిష్టం చేయడంతో పాటు, వారి ఉత్పత్తులకు సరైన ధర లభించేలా కృషి చేస్తుంది.
జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం
ఈ భాగస్వామ్యం భారత వ్యవసాయ రంగ కార్మికుల కోసం సమగ్రమైన, సరళమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే అభ్యాస మార్గాలను రూపొందించాలనే జాతీయ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ భాగస్వామ్యం స్కిల్ ఇండియా మిషన్ వృత్తి విద్యా ప్రోత్సాహం; గ్రామీణ యువత కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన;సామర్థ్య పెంపుదల కోసం జాతీయ వ్యవసాయ విద్యా విధానం; రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చొరవ; వాతావరణ అనుకూల వ్యవసాయం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, ప్రాధాన్యతా పథకాలతో సరిసమానంగా ఉండేలా రూపుదిద్దుకుంది. ఎన్సీవీఈటీ ద్వారా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)తో ఈ అనుసంధానం చేయడం వల్ల, అభ్యర్థులు క్రెడిట్లను పొందేందుకు, బదిలీ చేసుకునేందుకు వీలవుతుంది. ఇది వ్యవసాయ రంగంలో వారి వృత్తిపరమైన ఎదుగుదలకు, తదుపరి విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ అవగాహన ఒప్పందం కింద రూపొందించిన కార్యక్రమాలను రెండు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారిస్తారు.
నాయకత్వ స్పందన
ఈ భాగస్వామ్యంపై ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ, "వ్యవసాయ రంగంలో నాణ్యమైన నైపుణ్యాభివృద్ధిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఈ అవగాహన ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగు. ఐసీఏఆర్ పరిశోధన, సాంకేతిక సామర్థ్యాలను, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నిరూపిత సామాజిక భాగస్వామ్య నమూనాతో కలపడం ద్వారా గ్రామీణ జీవనోపాధి వ్యవసాయ స్థిరత్వంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, "80,000 మందికి పైగా రైతులతో కలిసి పనిచేసిన మా అనుభవం నాణ్యమైన విస్తరణ సేవలు, నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను మాకు తెలియచేసింది. ఐసీఏఆర్ తో కుదిరిన ఈ భాగస్వామ్యం, సాంకేతిక కచ్చితత్వాన్ని, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానాన్ని అందిస్తూనే, మా ప్రభావాన్ని మరింత విస్తృతం చేయడానికి మాకు సహాయపడుతుంది" అని చెప్పారు. ‘‘ముఖ్యంగా గ్రామీణ యువతకు, అణగారిన వర్గాలకు, దివ్యాంగులకు ఈ ఒప్పందం కల్పించబోయే అవకాశాల పట్ల మేం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం” అని వ్యాఖ్యానించారు.
అమలు వ్యవధి - పర్యవేక్షణ
ఈ అవగాహన ఒప్పందం 16 ఫిబ్రవరి 2026 నుంచి అమలులోకి వస్తుంది. ఇది ప్రాథమికంగా ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. పరస్పర అంగీకారం, పనితీరు మూల్యాంకనం ఆధారంగా దీనిని పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంది. రెండు సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ ఈ ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షిస్తుంది. నిర్ణీత లక్ష్యాల దిశగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ భాగస్వామ్యం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటుంది. ఇందులోఐసీఏఆర్ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, గ్రామీణ భారతదేశం అంతటా ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఫీల్డ్ సెంటర్ల నెట్వర్క్ అంతర్భాగంగా ఉంటాయి.
సంస్థల గురించి
ఐసీఏఆర్: భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విద్యను సమన్వయం చేయడం, మార్గనిర్దేశం చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను కలిగిఉంది. జూలై 16, 1929న ఏర్పాటయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 113 సంస్థలు, 74 విశ్వవిద్యాలయాలతో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ వ్యవసాయ వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఆహార, పోషకాహార భద్రతను కల్పించడం ఐసీఏఆర్ ప్రధాన కర్తవ్యం. దీని కోసం వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక శాస్త్రాలలో పరిశోధనలు, విద్యను ఇది పర్యవేక్షిస్తుంది. భారతదేశంలో హరిత విప్లవం, ఆ తర్వాత జరిగిన వ్యవసాయాభివృద్ధిలో ఐసీఏఆర్ కీలక పాత్ర పోషించింది. దీనివల్ల ఆహార ధాన్యాలు, పాలు, చేపల ఉత్పత్తిలో భారీ వృద్ధి సాధ్యమైంది.
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్): ఇది డాక్టర్ రెడ్డీస్ గ్రూప్ స్థాపించిన ఒక ఫ్యామిలీ ట్రస్ట్. 1996 నుంచి విద్య, జీవనోపాధి, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి రంగాలలో శాశ్వతమైన మార్పును తీసుకురావడానికి ఇది కృషి చేస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, దివ్యాంగులు, గ్రామీణ వ్యవసాయ వర్గాలపై దృష్టి సారించి, ఇప్పటివరకు 20 లక్షలమంది పైగా ప్రజల జీవితాలలో ఈ ఫౌండేషన్ సానుకూల ప్రభావాన్ని చూపింది డీఆర్ఎఫ్ ప్రధాన కార్యక్రమాలలో మిత్ర (గ్రామీణ జీవనోపాధి), సశక్త్, (బాలికల విద్య), గ్రో (వృత్తి విద్యా శిక్షణ),పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ) వంటివి ఉన్నాయి. డిసెంబర్ 2025లో, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి 'అవార్డింగ్ బాడీ' గా గుర్తింపు పొందింది. దీని ద్వారా ఆమోదించిన కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం, వారిని మదింపు చేయడం, ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారం ఫౌండేషన్కు లభించింది.
***
(రిలీజ్ ఐడి: 2230647)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9