ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్ సాంకేతికత (ఎంఈటీ)లో భారత ఏఐ ప్రాధాన్యాలను వివరించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్... పారిశ్రామిక, విద్యా సంస్థలతో వ్యూహాత్మక సమావేశం
‘ఏఐ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ టెక్నాలజీ (ఏఐ ఎంఈటీ)’పై శ్వేతపత్ర భావనను ఆవిష్కరించిన మంత్రి.. బాధ్యతాయుతమైన, విస్తరించదగిన రీతిలో ఏఐని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 4:15PM by PIB Hyderabad
పారిశ్రామిక ప్రముఖులు, అంతర్జాతీయ విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు ఓ వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మేనుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ సాంకేతికత (ఎంఈటీ) వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని పెంచడం, నైపుణ్యాభివృద్ధి, సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారిస్తూ దేశ ఏఐ ప్రాధాన్యాలను ఆయన ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో.. నాంటెక్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), ఐఐటీ- మద్రాస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి విద్యావేత్తలతోపాటు.. మైక్రోసాఫ్ట్ ఇండియా, డెల్ టెక్నాలజీస్, సిస్కో ఇండియా, హిటాచీ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, రాక్వెల్ ఆటోమేషన్, పాలో ఆల్టో నెట్వర్క్స్, పేపాల్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థల అగ్రశ్రేణి కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశ్రామిక, విద్యా రంగ ప్రముఖులు చర్చలో భాగస్వాములయ్యారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. దేశ పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకత, పోటీతత్వం, ఆవిష్కరణలను పెంపొందించడానికి ఏఐ ఒక కీలకమైన ప్రాథమిక సాధనమని వారు స్పష్టం చేశారు.
2025 మే నెలలో భారత్ మండపంలో నిర్వహించిన పరిశ్రమలు - విద్యాసంస్థల రౌండ్ టేబుల్ సమావేశం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో పారిశ్రామికంగా భారీ పరివర్తన కోసం ఉమ్మడి కార్యాచరణ ఆవశ్యకమని ఆ సమావేశం స్పష్టం చేసింది. ఫలితంగా పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాన్ని ఒకే పాలన, కార్యాచరణ విధానం కిందికి తెచ్చేలా.. నాంటెక్ ఆధ్వర్యంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (ఎంఈటీ) వేదికను రూపొందిస్తున్నారు. దేశ వేగవంతమైన వృద్ధి, కర్బనోద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడంలో తయారీ రంగాన్ని ప్రధాన కేంద్రంగా ఇది నిలుపుతుంది.
‘ఏఐ ఫర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ టెక్నాలజీ (ఏఐ ఎంఈటీ)పై శ్వేతపత్రం భావనను కూడా ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఉత్పాదకత, సుస్థిరత, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం.. తయారీ రంగం, అలాగే దానికి సంబంధించి ప్రతీ దశలోనూ కృత్రిమ మేధను ఎలా అనుసంధానించాలో ఓ వ్యూహాత్మక ప్రణాళికను ఈ శ్వేతపత్ర భావన వివరిస్తుంది. దేశ ఎంఈటీ వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడం లక్ష్యంగా.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, విధాన రూపకర్తలు కలిసి పనిచేసేందుకు సమన్వయ మార్గాలను తీర్చిదిద్దే ప్రక్రియలను ఇది వివరిస్తుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు: ‘‘వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృత్రిమ మేధ మూలాధారం. మ్యాన్సుఫాక్చరింగ్ ఇంజినీరింగ్ సాంకేతికత (ఎంఈటీ)లో కృత్రిమ మేధను అనుసంధానించడం ద్వారా.. మనం ఉత్పాదకతను పెంచుకోవచ్చు. మరింత బలంగా పోటీనివ్వవచ్చు. ఆవిష్కరణల్లో, వ్యవస్థాపకతలో సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భారీ పరిశ్రమలతోపాటు ఎంఎస్ఎంఈలను కూడా అదే స్థాయిలో బలోపేతం చేసే ఒక సమ్మిళిత కృత్రిమ మేధ వ్యవస్థను నిర్మించడంపై ప్రధానంగా దృష్టి సారించాం. అదే సమయంలో భారత శ్రామిక శక్తిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం చేయడం మా ముఖ్య లక్ష్యం. సాంకేతిక సామర్థ్యాన్ని క్షేత్రస్థాయి ఫలితాలుగా రూపుదిద్దేందుకు అవసరమైన.. సమష్టి కృషితో కూడిన, నిర్దిష్ట లక్ష్యాల ప్రాతిపదికన నడిచే విధానాన్ని ఏఐ-ఎంఈటీ శ్వేతపత్రం వంటి చర్యలు ప్రతిబింబిస్తాయి. పరిశ్రమ, విద్యాసంస్థలు, విధాన రూపకర్తలను ఈ ఉమ్మడి జాతీయ లక్ష్యం దిశగా సమన్వయం చేసేలా నాంటెక్ ముందడుగు వేయడం సంతోషదాయకం. అత్యంత కచ్చితమైన/ నిర్దిష్టమైన పనితీరు గల పరికరాల తయారీలో భారత్ ప్రపంచ స్థాయికి చేరుకోవాలి. అందుకు అవసరమైన నిపుణులను తయారు చేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాంటెక్ను కోరుతున్నాను” అని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
అమెరికా బోస్టన్లోని మసాచ్యునేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎరిక్ గ్రిమ్సన్ మాట్లాడుతూ... ‘‘సామర్థ్యాన్ని కార్యాచరణగా మలిచే అనువర్తనమే భారత ఏఐ ప్రస్థానంలో తదుపరి దశను నిర్దేశిస్తుంది. అంటే పరిశ్రమలు, పెద్ద సంస్థలు, ఎంఎస్ఎంఈలలో ఏఐని అంతర్భాగం చేయడం, నైపుణ్యాభివృద్ధిలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణల ఫలితాలు అందరికీ అందేలా చూడడం. పరిశోధనలనూ, సాంకేతికతనూ వాస్తవిక క్షేత్రస్థాయి ఫలితాలుగా మలిచే వ్యవస్థలను నిర్మించాలంటే.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య నిరంతర సహకారం అత్యావశ్యకం’’ అన్నారు.
మైక్రోసాఫ్ట్ ఇండియా తయారీ, సమ్మేళన సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ పంచాగ్నుల ప్రసంగించారు. ‘‘ఫ్యాక్టరీ లోపల, సంక్లిష్ట ఇంజినీరింగ్ వ్యవస్థల్లో ఏ మేరకు అమలవుతుందన్న దానిపై.. దేశ పారిశ్రామిక రంగాలపై కృత్రిమ మేధ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎంఎస్ఎంఈలలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం, దానితోపాటు కార్మికులకు సరైన శిక్షణను అందించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, అత్యావశ్యకం. అప్పుడు మాత్రమే ఉత్పత్తికి సంబంధించి ప్రతీ దశనూ.. పటిష్టంగా, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలవగలిగేలా రూపుదిద్దగలం’’ అని ఆయన పేర్కొన్నారు.
సిస్కో ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ డైరెక్టర్ శ్రీ వినోద్ కారుమంపోయిల్ మాట్లాడుతూ... “ఆధునిక తయారీ రంగంలో కృత్రిమ మేధ ఒక అంతర్భాగంగా మారుతున్న నేపథ్యంలో.. శ్రామిక శక్తిలో బలమైన ఆచరణీయ నైపుణ్యాలను మెరుగుపరచడం అత్యావశ్యకం. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సన్నిహిత సహకారం ఉంటేనే.. బాధ్యతాయుతమైన రీతిలో, భారీ స్థాయిలో కృత్రిమ మేధను అమలు చేయగల ప్రతిభావంతులు తయారవుతారు. తద్వారా దేశ తయారీ వ్యవస్థలో ఉత్పాదకత, పోటీతత్వం బలోపేతమవుతాయి’’ అన్నారు.
పాలో ఆల్టో నెట్వర్క్స్ ఎండీ, వైస్ ప్రెసిడెంట్ స్వప్న బాపట్ మాట్లాడుతూ... ‘‘సైబర్ భద్రత, ఐటీ రంగంలో సరిగ్గా రూపుదిద్దుకోని ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ) పెద్ద ముప్పుగా మారుతోంది. ఒక సురక్షిత, సంస్థాగత స్థాయి నెట్వర్కును నిర్మించడానికి మూడు కీలక అంశాలు ఆవశ్యకం. ఆధునిక తయారీ రంగానికి కృత్రిమ మేధ మౌలిక ప్రాతిపదికగా మారుతున్న తరుణంలో.. మన శ్రామిక శక్తిలో ఆచరణీయత ఆధారంగా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రాధాన్యమివ్వాలి. విద్యకూ, పరిశ్రమలకూ మధ్య అంతరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. విద్యార్థులు నేరుగా పనిలో చేరేలా సిద్ధం చేయడానికి.. ఆధునిక నెట్వర్క్ సెక్యూరిటీ సూత్రాలను పాఠశాల స్థాయి నుంచే పరిచయం చేయాల్సి ఉంటుంది’’ అన్నారు.
రాక్వెల్ ఆటోమేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాహ్నీ మాట్లాడుతూ... ‘‘పారిశ్రామిక ఆటోమేషన్ వ్యవస్థలతో అనుసంధానించి, ఉత్పత్తి కేంద్రాల్లో భారీ స్థాయిలో అమలు చేసినప్పుడే భారతీయ తయారీ రంగంలో ఏఐ వాస్తవిక ప్రభావం కనిపిస్తుంది. డిజిటల్ ఆవిష్కరణలకూ, క్షేత్రస్థాయి అమలుకూ నడుమ అంతరాన్ని తగ్గించాలంటే పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం అవసరం. ఇలాంటి కార్యక్రమాలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడానికి, శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, దేశ తయారీ వ్యవస్థ అన్ని దశల్లోనూ అంతర్జాతీయ పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన వ్యవస్థను సృష్టిస్తాయి’’ అని వివరించారు.
నాంటెక్ ఆపరేటింగ్ డైరెక్టర్ జనరల్, సీఈవో డాక్టర్ ఇబ్రహీం హఫీజుర్ రెహమాన్ మాట్లాడారు. “విద్యను వాస్తవ పారిశ్రామిక పరిస్థితులతో అనుసంధానించడం ద్వారా.. ‘ఆచరణీయత ప్రాతిపదికన అభ్యసనం’తో ఏ శిక్షణ అవసరం లేకుండానే మొదటి రోజు నుంచే ప్రతిభావంతులు ఉత్పత్తి రంగంలో నిమగ్నులవుతారో చాటడమే నాంటెక్ లక్ష్యం. ఎంఈటీ వేదిక, పరిశ్రమలూ విద్యాసంస్థలతో భాగస్వామ్యాల ద్వారా – దేశ తయారీ ఇంజినీరింగ్ సాంకేతికత (ఎంఈటీ) లో వస్తున్న ఈ భారీ మార్పులకు అనుగుణంగా.. మన దేశంలోని శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడానికి ఈ విధానం ఒక ఆదర్శ నమూనాగా ఉపయోగపడుతుంది” అని ఆయన తెలిపారు.
****
(రిలీజ్ ఐడి: 2230010)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9