(Release ID: 2229075) (FINAL-AVNHS)
జాతీయ మానవ హక్కుల కమిషన్
ముగిసిన ఎన్హెచ్ఆర్సీ ఫిబ్రవరి 2026 స్వల్పకాలిక ఆన్లైన్ ఇంటర్న్షిప్
1,114 దరఖాస్తుల నుంచి ఎంపికైన 71 మంది విభిన్న విద్యా నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు
కోర్సు ముగింపు సందర్భంగా సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ప్రసంగం: ఇంటర్న్షిప్ అనుభవంతో పాఠశాలల్లో మానవ హక్కులపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి
Posted On: 17 FEB 2026 1:45PM by PIB Delhi
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) 2026లో నిర్వహించిన రెండు వారాల తొలి ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ (ఓఎస్టీఐ) ముగిసింది. ఈ ఇంటర్న్షిప్ 2026, ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు చెందిన 71 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు దీనిని విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఇంటర్న్షిప్లో నేర్చుకున్న వాటితో సున్నితత్వం, స్పందించే గుణం పెంపొందించుకోవాలన్నారు. తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన ఉన్న ఆదర్శ పౌరులుగా ఎదగాలన్నారు. మార్పునకు ఉత్ప్రేరకంగా మారాలంటే ఆత్మపరిశీలన, తమ చర్యలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. మానవ హక్కులను పరిరక్షించే, ప్రచారం చేసే బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే కాకుండా ప్రజలపై కూడా ఉందని ఆయన తెలిపారు.

అందరికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందేలా చూస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే మూలాధారాలని ఆయన అన్నారు. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా దుర్బలమైన వారు తరచూ బాధితులుగా మారతారన్నారు. తరచూ యాచకులు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగుల హక్కుల ఉల్లంఘన, గౌరవానికి భంగం వాటిల్లుతుంటుందని, వారికి న్యాయంగా లభించాల్సిన ప్రయోజనాలను అందించడంలో సాయం అవసరమన్నారు. పాఠశాలలను సందర్శించి పరిశుభ్రత, పారిశుద్ధ్యం, లైంగిక వేధింపులు వంటి మానవ హక్కులను ప్రభావితం చేసే అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని ఇంటర్నులకు సూచించారు. ఇలాంటి చిన్న ప్రయత్నాలే సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తాయన్నారు.

అంతకు ముందు ఇంటర్న్షిప్ నివేదికను ఎన్హెచ్ఆర్సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైదింగ్పూయి ఛాక్ఛువాక్ సమర్పించారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్పర్సన్, సభ్యులు, సెక్రటరీ జనరల్, ఉన్నతాధికారులు, పౌర ప్రతినిధులతో పాటు ప్రముఖ వక్తలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ కార్యక్రమాల్లో మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఆమె చెప్పారు. అలాగే ఇంటర్న్షిప్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని ప్రకటించారు. పుస్తక సమీక్ష, బృంద పరిశోధనా ప్రాజెక్టు సమర్పణ, వక్తృత్వం తదితర పోటీలను నిర్వహించారు.

ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వీరేందర్ సింగ్ వందన సమర్పణ చేశారు.