మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యాంజలి కార్యక్రమంలో చేరిన 8.5 లక్షల పాఠశాలలు, 5 లక్షల మంది వాలంటీర్లు: రాజ్యసభలో శ్రీ జయంత్ చౌధరి
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 8:13PM by PIB Hyderabad
విద్యాంజలి కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి రాజ్యసభలో ఈరోజు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఆయన సభకు తెలియజేశారు. సామాజిక, ప్రైవేటు రంగ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం, అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా సెప్టెంబర్ 2021లో విద్యాంజలి కార్యక్రమం ప్రారంభమైంది. నిర్మాణాత్మకమైన సామాజిక భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది. ఈ వేదిక వాలంటీర్లు, పూర్వ విద్యార్థులు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్ఆర్ భాగస్వాములను నేరుగా బడులతో అనుసంధానిస్తుంది. పాఠశాలల్లో గుర్తించిన అవసరాల ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది.
2021 సెప్టెంబర్లో ప్రారంభమైన నాటి నుంచి విద్యాంజలి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారుగా 8.5 లక్షల పాఠశాలలు, దాదాపు 5 లక్షల మంది వాలంటీర్లు చేరారని మంత్రి సభకు తెలియజేశారు. ఈ వేదిక సేవలు, కార్యకలాపాలు, విరాళాల రూపంలో సహకారాన్ని అందిస్తుంది. వాటిలో పాఠ్యాంశాల బోధన, కెరీర్ కౌన్సెలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ లాంటి నూతన రంగాలపై వర్కుషాపులు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు తోడ్పాటు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా అలాగే బోధనా సామగ్రి, ఐసిటి సౌకర్యాలు, ప్రయోగశాలలు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించడం కూడా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం అందిస్తూ ఇప్పటి వరకు 56,734కు పైగా సేవా కార్యకలాపాలు, 35,695 వస్తు విరాళాలు అందాయి. సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరచడానికి, బడుల్లో వనరులను బలోపేతం చేయడానికి విద్యాంజలి కార్యక్రమం సహకరించిందని మంత్రి చెప్పారు.
అనుమతులు, పర్యవేక్షణ, ఫీడ్బ్యాక్ వ్యవస్థను పర్యవేక్షించే నిర్మాణాత్మక డిజిటల్ విధానం ద్వారా ఈ కార్యక్రమం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. డాష్బోర్డ్ల ద్వారా రాష్ట్రాలు పురోగతిని సమీక్షిస్తాయి. పాఠశాలలు స్వచ్ఛంద సేవల వివరాలను ధ్రువీకరిస్తాయి. ఇది పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది.
పాఠశాల విద్యలో ప్రజల భాగస్వామ్య స్ఫూర్తిని విద్యాంజలి ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు తోడ్పాటు అందించేలా భాగస్యాములను ప్రోత్సహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2227465)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2