ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో క్షయవ్యాధికి తక్కువ కాలం వాడే మాత్రలతో మెరుగైన ఫలితాలు: ఐసీఎంఆర్ అధ్యయనం
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 10:36AM by PIB Hyderabad
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమైన ఆర్థిక మూల్యాంకనం ప్రకారం... మల్టీడ్రగ్-రెసిస్టెంట్, రిఫాంపిసిన్-రెసిస్టెంట్ క్షయవ్యాధి (ఎండీఆర్/ఆర్ఆర్-టీబీ) కోసం ఆరు నెలల స్వల్పకాలిక నోటి ద్వారా తీసుకునే చికిత్సా విధానాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ప్రస్తుతం దేశంలో వాడుతున్న సుదీర్ఘ చికిత్స పద్ధతులతో పోలిస్తే మెరుగైన ఆరోగ్య ఫలితాలను ఇస్తాయని నిరూపితమైంది.
ఈ అధ్యయనాన్ని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ (ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ టీ) నిర్వహించింది. ఇది బెడాక్విలిన్ ఆధారిత చికిత్స పద్ధతులైన బీపీఏఎల్ (బెడాక్విలిన్, ప్రెటోమానిడ్, లైనెజోలిడ్), బీపీఏఎల్ఎం (మోక్సిఫ్లోక్సాసిన్)లను.. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ప్రస్తుతం అమలులో ఉన్న బెడాక్విలిన్ కలిగిన 9–11 నెలల స్వల్పకాలిక, 18–20 నెలల దీర్ఘకాలిక చికిత్స పద్ధతులతో పోల్చి వాటి ఖర్చు ప్రభావాన్ని అంచనా వేసింది.
ఈ విశ్లేషణ ప్రకారం బీపీఏఎల్ చికిత్స పద్ధతి అత్యంత ప్రభావవంతమైనదే మాత్రమే కాకుండా ఖర్చును కూడా ఆదా చేస్తుందని తేలింది. సాధారణ చికిత్సతో పోలిస్తే బీపీఏఎల్ ద్వారా పొందే ప్రతి క్వాలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్ (ఆరోగ్యవంతమైన జీవిత కాలం-క్యూఏఎల్ వై) పొందడానికి ఆరోగ్య వ్యవస్థ ఒక్కో రోగిపై అదనంగా రూ.379 తక్కువ ఖర్చు చేస్తుంది. అంటే తక్కువ ఖర్చుతోనే మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభస్తున్నాయని దీని అర్థం. బీపీఏఎల్ఎం చికిత్సా విధానం కూడా చాలా పొదుపైనదిగా గుర్తించారు. సాధారణ పద్ధతితో పోలిస్తే దీని ద్వారా పొందే ప్రతి క్వాలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్ కోసం ఒక్కో రోగిపై కేవలం రూ. 37 మాత్రమే అదనపు ఖర్చు అవుతుంది. మొత్తంగా చూస్తే ఈ రెండు రకాల చికిత్సల్లోనూ మందులు, ఆసుపత్రి సందర్శనలు, తదుపరి పర్యవేక్షణ వంటి అన్ని ఖర్చులు కలిపినా... అవి ప్రస్తుతమున్న పద్ధతుల కంటే తక్కువగా లేదా సమానంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపిది.
దీర్ఘకాలిక చికిత్స, దుష్ప్రభావాలు, అధిక ఖర్చుల కారణంగా ఎండీఆర్/ఆర్ఆర్-టీబీ చికిత్స ప్రస్తుతం సవాలుగా మారింది. అయితే ఆరు నెలల స్వల్పకాలిక నోటి మాత్రల చికిత్స ద్వారా రోగులు క్రమం తప్పకుండా మందులు వాడే అవకాశం పెరుగుతుంది. అనారోగ్య బాధలు తగ్గడమే కాకుండా వారు త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఇది ఆరోగ్య వ్యవస్థపై ఉన్న భారాన్ని కూడా తగ్గిస్తుంది. దేశంలో ఎండీఆర్/ఆర్ఆర్-టీబీ నివారణకు ఈ స్వల్పకాలిక చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ అధ్యయనం ఆర్థికపరమైన ఆధారాలను అందించింది. చికిత్స కాలాన్ని 9–18 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించడం ద్వారా వనరులను సమర్థవంతంగా వాడుకోవాలనే జాతీయ లక్ష్యాలకు ఇది ఊతాన్నిస్తుంది.
టీబీకి వ్యతిరేకంగా దేశ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు, బీపీఏఎల్ ఆధారిత చికిత్సలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అత్యంత ప్రభావవంతమైనవిగా ఈ అధ్యయనం తేల్చింది. వీటిని జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద అధికారికంగా అమలులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పూర్తి అధ్యయన వివరాలను ఈ లింక్ ద్వారా చూడవచ్చు: https://ijmr.org.in/cost-effectiveness.pdf
***
(రిలీజ్ ఐడి: 2227044)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9