రక్షణ మంత్రిత్వ శాఖ
సౌదీ అరేబియాలోని రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో-2026.. దేశీయ రక్షణ పాటవాన్ని చాటిన భారత్
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 2:41PM by PIB Hyderabad
సౌదీ అరేబియాలోని రియాద్లో 2026 ఫిబ్రవరి 8వ, 9వ తేదీల్లో వరల్డ్ డిఫెన్స్ షో (డబ్ల్యూడీఎస్)-2026ను నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్ నాయకత్వంలో భారత్కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంది. డబ్ల్యూడీఎస్ ప్రారంభోత్సవంలో అంతర్జాతీయ ప్రముఖులతో పాటు శ్రీ సంజయ్ సేఠ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలిసారి ఏర్పాటు చేసిన భారత్ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ మండపంలో డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ (డీపీఎస్యూల)తో పాటు భారత ప్రయివేటు కంపెనీల తయారీ సత్తాను చాటారు. సౌదీ అరేబియా దేశీయ సాంకేతిక పురోగతి విజయాలను సమీక్షించే ఉద్దేశంతో, సౌదీ అరేబియా మిలటరీ ఇండస్ట్రీస్ (ఎస్ఏఎమ్ఐ), సౌదీ అరేబియా రక్షణ శాఖలు కొలువుదీర్చిన ప్రదర్శనలను రక్షణ శాఖ సహాయ మంత్రి సందర్శించారు.
ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్నీ, సమన్వయాన్నీ పెంపొందింప చేసుకోవడానికి సంబంధించి సౌదీ అరేబియా డిఫెన్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ అఫైర్స్ అసిస్టెంట్ మినిస్టర్ డాక్టర్ ఖాలిద్ బిన్ హుసేన్ అల్-బియానీతో శ్రీ సంజయ్ సేఠ్ చర్చించారు. సౌదీ అరేబియా డిఫెన్స్ డెవలప్మెంట్ జనరల్ అథారిటీ (జీఏడీడీ) గవర్నరు డాక్టర్ ఫలేహ్ బిన్ అబ్దుల్లా అల్-సులేమాన్తో కూడా శ్రీ సేఠ్ సమావేశమయ్యారు. భారత్ ప్రపంచ ఎగుమతుల కూడలిగా ఎదుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. రక్షణ సాంకేతికతలను అభివృద్ధిపరిచేందుకు గల అవకాశాలను కలిసికట్టుగా పరిశీలించడానికి భారత పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాలను సందర్శించడానికి జీఏడీడీ అధికారులు రావాల్సిందిగా రక్షణ శాఖ సహాయ మంత్రి ఆహ్వానించారు.
సౌదీ అరేబియా మిలటరీ ఇండస్ట్రీస్ జనరల్ అథారిటీ (జీఏఎమ్ఐ) గవర్నరు శ్రీ అహ్మద్ బిన్ అబ్దులజీజ్ అల్-ఒహాలీతోనూ శ్రీ సంజయ్ సేఠ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వ్యూహాత్మక సహకారానికి తగిన ఉమ్మడి రంగాల గురించీ, ఉభయ దేశాల సరఫరా వ్యవస్థ తాలూకు అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడాన్ని గురించీ చర్చించారు. భారత రక్షణ రంగ సామర్థ్యాలపై స్వయంగా అవగాహన ఏర్పరుచుకోవడానికి జీఏఎమ్ఐ నాయకత్వంలో ఓ సంయుక్త ప్రతినిధి వర్గం ఇండియాను సందర్శించాలని రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రతిపాదించారు.
భారతీయ, సౌదీ రక్షణ రంగ కంపెనీల ప్రధాన అధికారులతో భారతీయ దౌత్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రసంగించారు. రక్షణ రంగంలో స్వావలంబనను సాధించడానికి భారత్, సౌదీ అరేబియాల మధ్య సంయుక్త సహకారానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్ లో తయారీ, ప్రపంచం కోసం తయారీ’’ (‘‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’) దృష్టికోణంలో భాగంగా ప్రపంచానికి సహాయపడడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
సౌదీ పురుటిగడ్డ ‘దిరియాహ్’ను కూడా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సందర్శించారు. ఈ ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు లభించింది. భారత రాయబారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మంత్రి సౌదీలో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు సాధికారత కల్పన, ఆరోగ్యం, డిజిటల్ సాధనాల వినియోగం సహా వివిధ రంగాలలో భారత్ సాధించిన అభివృద్ధిని మంత్రి వివరించారు. ‘దేశానికే ప్రాధాన్యం’ దార్శనికతను రక్షణ శాఖ సహాయ మంత్రి సమర్ధించారు. సౌదీ అరేబియాలో ఉంటున్న భారతీయులకు అందిస్తున్న సహాయ సహకారాలకు గాను దౌత్య కార్యాలయ అధికారులను మంత్రి ప్రశంసించారు.
***
(రిలీజ్ ఐడి: 2225863)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11