హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్గఢ్లో ఇవాళ జరిగిన బస్తర్ పాండమ్-2026 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
బస్తర్ అంటే బారుద్ కాదు.. సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వం
వంటకాలు, నృత్యాలు సహా బస్తర్ సంస్కృతిలోని 12 విభాగాలు అంతర్భాగంగా స్థానిక సంస్కృతికి పునరుజ్జీవం పోసిన బస్తర్ పాండమ్
బస్తర్ పాండమ్లో పాల్గొన్న 55,000 మంది గిరిజనులు.. నక్సలిజం నుంచి బస్తర్ విముక్తికి నిదర్శనం
గిరిజన వర్గాల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ, బస్తర్ ప్రాంత నృత్యాలు, కళలు, గిరిజన సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపునిస్తున్న మోదీ ప్రభుత్వం
లొంగిపోయే నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తున్న ప్రభుత్వం.. ఆయుధాలు పడితే ధీటైన ప్రతిస్పందన
రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాల్లో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా బస్తర్.. కొత్త పర్యాటక కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగుపడనున్న బస్తర్
భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా, ఆయన 150వ జయంతి వేడుకలను జనజాతీయ గౌరవ సంవత్సరంగా ప్రకటన.. గిరిజన తెగలకు ప్రధానమంత్రి మోదీ ఇస్తున్న గౌరవం, వారసత్వ ప్రాధాన్యతకు నిదర్శనం
గిరిజన రైతులు, అమాయక పిల్లలు, మహిళల సంరక్షణే నక్సల్ వ్యతిరేక పోరాట లక్ష్యం
118 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న నూతన పారిశ్రామిక ప్రాంతం, బస్తర్ ప్రజల ఉపాధికి బలమైన ఆధారం
బస్తర్ సంస్కృతిని దేశ విదేశాలకు పరిచయం చేయాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 6:53PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్లో ఇవాళ జరిగిన బస్తర్ పాండమ్-2026 ముగింపు వేడుకలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్సాయ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కొన్నేళ్ల కిందటి వరకు నక్సలైట్ల నీడలో ఉన్న బస్తర్ ప్రాంతంలో మోర్టార్ షెల్స్, తుపాకీ మోతలు, ఐఈడీ పేలుళ్లు గిరిజన సోదరీసోదరులను వణికించేవని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. కానీ నేడు అదే బస్తర్లో సుమారు 55 వేల మంది ప్రజలు కలిసి వంటకాలు, పాటలు, నృత్యం, నాటకం, వేషధారణ, సంప్రదాయాలు, అటవీ ఆధారిత వైద్యం వంటి 12 విభాగాలు అంతర్భాగంగా స్థానిక సంస్కృతికి పునరుజ్జీవం పోశారు. ఇది నిజంగా ఒక గొప్ప విజయం.
బస్తర్ సంస్కృతికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పునరుజ్జీవం పోసిందని శ్రీ అమిత్ షా కొనియాడారు. గత బస్తర్ పాండమ్ సందర్భంగా కేవలం 7 విభాగాల్లో పోటీలు నిర్వహించగా, ఈసారి మరో 5 కొత్త విభాగాలను జోడించి గిరిజన, బస్తర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్సాయ్ కృషి చేశారన్నారు. మొత్తం 12 విభాగాల్లో 7 జిల్లాల నుంచి సుమారు 55,000 మంది క్రీడాకారులు, కళాకారులు.. 1,885 గ్రామ పంచాయతీలు, 32 బ్లాక్ ప్రధాన కార్యాలయాల నుంచి పెద్దఎత్తున ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
బస్తర్ ప్రాంత కళలు, సంస్కృతి ప్రపంచంలోని మరే ఇతర గిరిజన ప్రాంతంలోనూ లేవని, వందల ఏళ్ల వరకు మనం వాటిని భద్రపరుచుకోవాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. బస్తర్ కళలు, సంస్కృతి, పాటలు, నృత్యాలు కేవలం బస్తర్కు మాత్రమే గర్వకారణం కాదని, అవి భారతీయ సంస్కృతి కిరీటంలోని మణిహారాల వంటివని.. బస్తర్ పాండమ్ ఈ గొప్ప వారసత్వాన్ని మరింతగా చాటిచెప్పిందని కొనియాడారు. బస్తర్ తెగలకు తమదైన ప్రత్యేక సంస్కృతి ఉందన్నారు. శ్రీరాముడి కాలం నుంచి తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రధాన నృత్యాలు జాతీయ స్థాయి గుర్తింపును పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బస్తర్ సంస్కృతిని జాతీయ స్థాయిలోనే కాక, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లటమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. బస్తర్ అంటే బారుద్ కాదని, సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వమని అన్నారు. గిరిజన వర్గాల రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని, బస్తర్ నృత్యాలు, కళలు, గిరిజన సంస్కృతికి మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపును కల్పిస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో రాసింది మాత్రమే కాదని, ప్రజల జ్ఞాపకాల్లో సజీవంగా ఉండేదే నిజమైన చరిత్రని ప్రధానమంత్రి మోదీ బలంగా విశ్వసిస్తారని పేర్కొన్నారు.
భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా, ఆయన 150వ జయంతి వేడుకలను జనజాతీయ గౌరవ సంవత్సరంగా ప్రకటించటం.. గిరిజన సమాజం పట్ల ప్రధానమంత్రి మోదీకున్న గౌరవానికి నిదర్శనమని శ్రీ అమిత్ షా తెలిపారు. గిరిజన హస్తకళలు, సంస్కృతి, వంటకాలు, అటవీ ఉత్పత్తుల వాణిజ్య వినియోగాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రోత్సహించారని, సుమారు ఐదు లక్షల అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ హస్తకళల బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు.
నారాయణపూర్కు చెందిన పండిట్ రామ్ మాండవి, హేమ్చంద్ మాంఝీ, కాంకేర్కు చెందిన అజయ్ కుమార్ మాండవి, దంతెవాడకు చెందిన భూధారి దాతీ.. కళ, ఆరోగ్యం, విద్యారంగాల్లో చేసిన విశేష కృషికిగానూ పద్మ అవార్డులతో సత్కరించటం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. 700లకు పైగా గిరిజన తెగలను గౌరవించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గిరిజన నాయకులందరి స్మృతులను చిరస్థాయిగా నిలిచేలా చేసేందుకు రూ.200 కోట్ల వ్యయంతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటునకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు.
బస్తర్ పాండమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారత రాష్ట్రపతికి కేంద్ర హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అమిత్ షా.. మొత్తం 12 విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలను రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానించాల్సిందిగా కోరగా, రాష్ట్రపతి అంగీకరించినట్లు తెలిపారు. ఈ విజేతలు రాష్ట్రపతి భవన్లో తమ కళలను, సంస్కృతిని ప్రదర్శిస్తారని, ఇది వారికి దక్కే గొప్ప గౌరవమని అన్నారు
గిరిజన రైతులు, అమాయక పిల్లలు, మహిళల సంరక్షణే నక్సల్ వ్యతిరేక పోరాట లక్ష్యమని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. నక్సలైట్లు ఐఈడీలను అమర్చేటప్పుడు, వాటిపై గిరిజన రైతులు పొరపాటున కాలు వేస్తే వారు శాశ్వతంగా వికలాంగులయ్యే ప్రమాదం ఉందన్న స్పృహ వారికి లేదా? ఈ చర్యల వల్ల ఒక అమాయకపు బిడ్డ జీవితం చిన్నాభిన్నం అవుతుందని వారు గ్రహించలేరా? నక్సలైట్లు ఇంత క్రూరంగా ఎలా ఉంటారు? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలను వీడాలని మిగిలిన నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తూ, లొంగిపోయే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారికి గౌరవప్రదంగా పునరావాసం కల్పిస్తుందని కేంద్ర హోంమంత్రి భరోసా ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ఎంతో ఆకర్షణీయంగా ఉందని శ్రీ అమిత్ షా అన్నారు.
నక్సలైట్లందరూ, తమ కుమార్తెలను పునరావాసం కోసం పంపాలని శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఆ అమ్మాయిలకు ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. భారీ సంఖ్యలో లొంగిపోయిన నక్సలైట్లకు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చారు. గ్రామాల్లో తూటాలు పేలుస్తూ, పొలాల్లో, రోడ్లపై ఐఈడీ బాంబులు అమర్చుతూ, పాఠశాలలు, ఆస్పత్రులను తగలబెడుతూ, మొబైల్ టవర్లను ధ్వంసం చేసే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయుధాలకు ఆయుధాలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.
దేశం ముందు నేడు బస్తర్ ఒక అద్భుతమైన బ్రాండ్గా మారిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. 40 ఏళ్లుగా మూతపడిన ఎన్నో పాఠశాలలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. పాఠశాలలను మూసివేయటం ద్వారా నక్సలైట్లు ఎవరికి ప్రయోజనం చేకూర్చారు? అని అక్కడి గిరిజన సోదరీసోదరులను ఆయన ప్రశ్నించారు. దీనివల్ల మన నవతరం ప్రాథమిక విద్యకు దూరమైందన్నారు. వచ్చే ఐదేళ్లలో, అన్ని గిరిజన ప్రాంతాల కంటే బస్తర్ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందని, కొత్త పర్యాటక కార్యక్రమాల ద్వారా బస్తర్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శ్రీ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మూసివేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలలన్నింటినీ తిరిగి ప్రారంభిస్తామని, అలాగే ఉన్నత పాఠశాలలు, కళాశాలలను కూడా నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పోస్టాఫీసులు తెరుచుకుంటున్నాయని, మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామాలను అనుసంధానించే రహదారులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. చాలా గ్రామాల్లో నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ జెండా, మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.
ప్రతి గ్రామానికి అనుసంధానత కల్పిస్తామని, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖను ఏర్పాటు చేస్తామని శ్రీ అమిత్ షా తెలిపారు. గిరిజన రైతుల నుంచి ప్రతి క్వింటాలు వరిని రూ.3,100 చొప్పున సేకరిస్తామని, ప్రతి గిరిజన వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు, కుళాయి కనెక్షన్ల ద్వారా మంచినీటిని అందిస్తామని తెలిపారు. పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీల్లో ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారు. నక్సలిజం అంతమైన తర్వాత బస్తర్ ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజం, హోమ్స్టేలు, కానోపీ వాక్, గ్లాస్ బ్రిడ్జి వంటి సరికొత్త పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా బస్తర్ను అగ్రపథంలో నిలుపుతామని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బస్తర్లో 118 ఎకరాల్లో కొత్త పారిశ్రామిక ప్రాంతాన్ని, ఆటో గిగ్ హబ్ను అభివృద్ధి చేస్తున్నట్లు శ్రీ అమిత్ షా వెల్లడించారు.
రావ్ఘాట్–జగదల్పూర్ రైల్వే ప్రాజెక్టు పనులను రూ.3,500 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. దీనితో పాటు నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని, దాదాపు 90,000 మంది యువతకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇంద్రావతి నదిపై రూ. 36 కోట్ల అంచనా వ్యయంతో కొత్త నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంబిస్తామని, దీనిద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.
బస్తర్లో ఎక్కడా కర్ఫ్యూ వాతావరణం లేదని, రాత్రివేళల్లో గ్రామాల్లో గిరిజన సాంస్కృతిక నృత్యాల సందడి కనిపిస్తోందని.. ఇది బస్తర్లో అతిపెద్ద మార్పు అని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. బస్తర్ ఒలింపిక్స్ విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు బస్తర్ పాండమ్ను విస్తృతం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. నక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాల్గొంటున్న భద్రతా దళాలకు బస్తర్ గిరిజన ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. నిర్ణీత గడువులోగా బస్తర్ను పూర్తిగా నక్సల్ రహిత ప్రాంతంగా మారుస్తామని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2225828)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6