కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5జీ వ్యవస్థ ద్వారా అందించదగ్గ నూతన సేవల్ని ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం
వివిధ రంగాల్లో 5జీ అప్లికేషన్ల రూపకల్పనను ప్రోత్సహించడానికి
విద్యాసంస్థల్లో వంద 5జీ యూజ్ కేస్ ప్రయోగశాలల ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 3:44PM by PIB Hyderabad
5జీ వ్యవస్థలో ఉపయోగించడానికి అనువైన అప్లికేషన్ల రూపకల్పనను ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 5జీ సాంకేతికత.. హై-స్పీడ్ సంధానాన్నీ, సమాచారాన్ని ఇవ్వడంలో ఆలస్యం లేకుండా పెద్ద సంఖ్యలో సంధానించిన ఉపకరణాలకు అండగా ఉంటుంది. డిజిటల్ సేవల్లో, ఆటొమేషన్లో కృత్రిమ మేధ (ఏఐ)నీ, బ్లాక్చైన్ సాంకేతికతనీ ఉపయోగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. వివిధ రంగాల్లో 5జీ సేవల అభివృద్ధి ప్రక్రియను ప్రోత్సహించడానికి విద్యాసంస్థల్లో వంద 5జీ యూజ్ కేస్ ప్రయోగశాలల్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్చైన్ తదితర సరికొత్త సాంకేతికతలను కూడా సంధానించారు. యూజ్ కేస్ ప్రయోగశాలల కార్యక్రమంలో భాగంగా 5జీని ఉపయోగిస్తూ ‘5జీ ఇన్నొవేషన్ హ్యాకథాన్-2025’ను ప్రారంభించారు. 5జీనీ, ఏఐనీ, ఆధునిక సాంకేతికతలనీ ఉపయోగించుకుంటూ సేవలను అభివృద్ధిపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం. సామాజికంగా, ఆర్థిక కార్యకలాపాల పరంగా ఉపయోగించదగ్గ సేవలను అభివృద్ధిపరచడానికి ఈ కార్యక్రమాలు తోడ్పడతాయి. నవకల్పననీ, విద్య- పరిశ్రమ రంగాల మధ్య సహకారాన్నీ పెంచడంతో పాటు, ఆర్థికాభివృద్ధి సాధనకు విద్యారంగానికీ, అంకుర సంస్థల రంగానికీ చెందిన అనుబంధ విస్తారిత వ్యవస్థల్ని కూడా బలపరచాలన్న ధ్యేయాన్ని ఈ కార్యక్రమాలకు నిర్దేశించారు.
అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన 5జీ వ్యవస్థ 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులో ఉండడంతో పాటు, 85 శాతం జనాభాకు సేవలను అందిస్తున్నాయి. 2025 డిసెంబరు నాటికి 5 లక్షల ఎనిమిది వేల 5జీ బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను ఏర్పాటు చేశారు. మీడియన్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ కూడా చెప్పుకోదగినంతగా విస్తరించి, 2025 అక్టోబరుకు 131.47 ఎంబీపీఎస్కు చేరుకొంది.
( ఇంటర్నెట్లో ఈ పేజీని కూడా సందర్శించగలరు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206477®=3&lang=1)
దీనికి అదనంగా, ప్రమాణీకరణ, డిజిటల్ డేటాను సురక్షితంగా ఉంచుతూ చదవడానికి వీలుపడని కోడ్ లోకి మార్చడం (ఎన్క్రిప్షన్)తో పాటు నెట్వర్క్ ఐసొలేషన్ వంటి ఉన్నత భద్రతా ఫీచర్లు 5జీలో ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్ఎస్సీఎస్) ఆదేశాలకు అనుగుణంగా సైబర్ భద్రత నియమాలను పాటించడంతో పాటు, విశ్వసనీయ టెలికం ప్రణాళిక.. నమ్మదగ్గ మూలాల నుంచే సేకరణ జరిగేటట్లుగా చూస్తుంది. కమ్యూనికేషన్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ (కామ్సెక్) పథకంలో భాగంగా, 5జీ నెట్వర్క్ విధులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ టెలికం సెక్యూరిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ (ఐటీఎస్ఏఆర్స్)ను సిద్ధం చేశారు. ఈ ప్రమాణాల్ని పరిశ్రమ పాటించడం వల్ల ఇటు భద్రతనీ, అటు నవకల్పననీ సమతౌల్యం చేసుకోవడం సాధ్యపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2224126)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9