రక్షణ మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2026-27లో రక్షణ మంత్రిత్వ శాఖకు మునుపు ఎన్నడూ లేనంతగా… రూ. 7.85 లక్షల కోట్ల కేటాయింపులు ఆర్థిక సంవత్సరం 2025-26తో పోలిస్తే 15 శాతం పెరిగిన బడ్జెట్ అంచనా
మూలధన పద్దు కింద రూ.2.19 లక్షల కోట్ల కేటాయింపులు:
మూలధన సేకరణ బడ్జెట్లో 24 శాతం భారీ పెరుగుదల
ప్రైవేటు సంస్థలతో సహా దేశీయ పరిశ్రమలకు 1.39 లక్షల కోట్ల కేటాయింపులు
కార్యాచరణ సన్నద్ధతకు అధిక కేటాయింపులు
మాజీ సైనికులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించిన ప్రభుత్వం: ఈసీహెచ్ఎస్ రూ.12,100 కోట్ల కేటాయింపులు, ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్ అంచనాతో పోలిస్తే 45.49 శాతం అధికం
ఆత్మనిర్భర, వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి మోదీ దార్శనికతను
కేంద్ర బడ్జెట్ 2026-27 మరింత బలోపేతం చేస్తోంది…
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 3:42PM by PIB Hyderabad
ఆపరేషన్ సిందూర్ తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో మునుపెన్నడూ లేని రీతిలో రక్షణ సేవలకు రూ.7.85 లక్షల కోట్ల కేటాయింపులు దక్కాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేస్తున్న జీడీపీలో ఇది 2 శాతం. గత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్ అంచనాలు (బీఈ)తో పోలిస్తే 15.19 శాతం మేర గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యయంలో అన్ని మంత్రిత్వ శాఖలతో పోలిస్తే అత్యధికంగా రక్షణ బడ్జెట్ వాటా 14.67 శాతంగా ఉంది.
సాయుధ బలగాల ఆధునికీకరణకు అదనంగా, వాటి సాధారణ అవసరాలకు అవసరమైన నిధులను... గణనీయంగా పెంచిన ఈ కేటాయింపులు సమకూర్చుతాయి. అలాగే ఆపరేషన్ సిందూర్ అనంతరం పెట్టుబడి, ఆదాయం విభాగాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తక్షణ కొనుగోళ్ల కారణంగా పెరిగిన ఆర్థిక అవసరాలను కూడా ఇవి తీరుస్తాయి. మూలధన వ్యయం కోసం రక్షణ బడ్జెట్లో రూ. 2.19 లక్షల కోట్లను కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆత్మనిర్భర భారత్ లక్ష్యం సాధన దిశగా సాయుధ బలగాలను, వాటి సామర్థ్యాలను అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలతో విస్తరింప చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని పెరిగిన ఈ కేటాయింపులు సూచిస్తున్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంవోడీ)కు కేటాయించిన మొత్తంలో మూలధన వ్యయానికి 27.95 శాతం, కార్యాచరణ సన్నద్ధత, నిర్వహణ వ్యయానికి 20.17 శాతం, జీతభత్యాల ఖర్చులకు 26.40 శాతం, రక్షణ ఫించన్లకు 21.84 శాతం, పౌర సంస్థలకు 3.64 శాతం వాటా ఉంది.
సాయుధ బలగాల ఆధునికీకరణ – వ్యూహాత్మక లక్ష్యం
2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బలగాలకు మూలధన పద్దు కింద రూ. 2,19,306.47 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాతో పోలిస్తే 21.84 శాతం కంటే ఎక్కువ. ఈ మొత్తంలో రూ. 1.85 లక్షల కోట్లను మూలధన సముపార్జనకు కేటాయించారు. ఇది ఆర్థిక సంవత్సరం 2025-26తో పోలిస్తే.. సుమారు 24 శాతం అధికంగా ఉంది. ప్రస్తుతమున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆధునికీకరించిన బడ్జెట్లో భారీ పెరుగుదల వ్యూహాత్మక అవసరం. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంటే.. 2025 డిసెంబర్ వరకు రూ. 2.10 లక్షల కోట్ల కాంట్రాక్టులను రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది. ఇప్పటి వరకు రూ.3.50 లక్షల కోట్లకు పైగా అవసరాలకు ఆమోదం లభించింది. అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టు, స్మార్ట్, మారణాయుధాలు, నౌకలు/జలాంతర్గాములు, మానవ రహిత వైమానిక వాహనాలు, ప్రత్యేక వాహనాలను తదితరమైన వాటిని మూలధన సేకరణ కింద భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు సాయుధ దళాలకు అందిస్తాయి.
ఆత్మనిర్భర భారత్కు ప్రాధాన్యం
దిగుమతి ప్రత్యామ్నాయానికి, స్వదేశీకరణకు ఉన్న అవసరాన్ని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం, విదేశీ విక్రేతల కంటే దేశీయ అవసరాలకు ఇస్తున్న ప్రాధ్యాన్యం తెలియజేస్తున్నాయి. ఇది మనుగడ కోసం మాత్రమే కాకుండా.. భవిష్యత్తు ఆధునికీకరణకు కూడా అవసరమే. దీనికి అనుగుణంగా.. బడ్జెట్ విధానాల ద్వారా స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ విధానం మరింత బలోపేతమైంది. దీనిలో భాగంగా ఆర్థిక సంవత్సరం 2026-27లో దేశీయ సంస్థల నుంచి కొనుగోళ్లకు మూలధన సేకరణ బడ్జెట్లో 75 శాతం అంటే రూ.1.39 లక్షల కోట్లను కేటాయించారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా, దేశీయ తయారీదారులకు వారి పెట్టుబడులకు, సాయుధ దళాల సామర్థ్య నిర్మాణంలో పెరుగుతున్న వారి పాత్రకు హామీ లభించింది. ముఖ్యంగా దేశీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లకు కేటాయించిన మూలధన సేకరణ నిధులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే దేశంలో అనేక అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసి అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
నిర్వహణ ఖర్చులకు రూ. 3,65,478.98 కోట్లను రక్షణ బడ్జెట్ కేటాయించింది. ఇది గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 17.24 శాతం ఎక్కువ. ఈ మొత్తంలో రూ. 1,58,296.98 కోట్లను కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని జీతభత్యాలకు కేటాయించారు. రాబోయే ఆర్థిక సంవత్సరం కోసం చేసిన ఈ బడ్జెట్ కేటాయింపులు.. కార్యకలాపాల పరంగా ముఖ్యమైన స్టోర్లు, విడి భాగాల సేకరణను సులభతరం చేస్తాయి. అలాగే వారి దైనందిన అవసరాలతో పాటుగా ముఖ్యమైన వేదికల నిర్వహణకు భరోసా ఇస్తాయి.
సరిహద్దు ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం
సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో)కు కేటాయింపుల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులను అందించాలనే తన చిత్తశుద్ధిని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. దీనికి అనుగుణంగా.. 2026-27 బడ్జెట్ అంచనాలో మూలధనం కింద రూ.7,394 కోట్లను కేటాయించారు. ఇది ఆర్థిక సంవత్సరం 2025-26 లో రూ. 7,146.50 కోట్లుగా ఉంది. సొరంగాలు, వంతెనలు, ఎయిర్ఫీల్డులు తదితర వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులకు విస్తరించాయి. ఇది ప్రాంతీయ అభివృద్ధిని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
మాజీ సైనికులకు ఆరోగ్య సేవలు
మాజీ సైనికులకు, వారిపై ఆధారపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం ఎక్స్-సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్)కు కేటాయింపులను పెంచింది. ఆర్థిక సంవత్సరం 2026-27 వార్షిక బడ్జెట్లో ఈసీహెచ్ఎస్ కోసం రూ.12,100 కోట్లను కేటాయించారు. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ అంచనా దశ కేటాయింపులతో పోలిస్తే.. ఇది 45.49 శాతం అధికంగా ఉంది. మాజీ సైనికుల కోసం మెడికల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ (ఎంటీఆర్ఈ)కు నిధులను ఈ కేటాయింపులు సమకూరుస్తాయి. 2021-22 నుంచి గడచిన అయిదేళ్లతో పోలిస్తే.. బీఈ దశలో 300 శాతం మేర కేటాయింపులు పెరిగాయి.
రక్షణలో పరిశోధనాభివృద్ధికి ప్రోత్సాహం
రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు బడ్జెట్ కేటాయింపులు ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ. 29,100.25 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇది రూ. 26,816.82 కోట్లుగా ఉంది. ఈ కేటాయింపుల్లో మూలధన వ్యయం కోసం రూ. 17,250.25 కోట్ల ప్రధాన వాటాను కేటాయించారు.
రక్షణ రంగ ఫించను బడ్జెట్లో పెరుగుదల
రక్షణరంగంలో ఫించన్ల కోసం రూ. 1,71,338.22 కోట్లను కేటాయించారు. ఇది 2025-26లో బీఈ దశతో పోలిస్తే 6.56 శాతం అధికం. స్పర్శ్, ఇతర పంపిణీ సంస్థల ద్వారా 34 లక్షల మందికి పైగా ఉన్న పెన్షన్దారులకు అందించే నెలవారీ ఫించను చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా సాగిస్తున్న ప్రయాణంలో దేశం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘ఆకాంక్షలను విజయాలు’’గా, ‘సామర్థ్యాన్ని కార్యాచరణ’గా మార్చే పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ను అభినందించారు. ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి మోదీ దార్శనికతను ఈ ‘‘యువశక్తి ఆధారిత బడ్జెట్’’ మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, కొనసాగించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరికీ అర్థవంతమైన భాగస్వామ్యం అందించడమే లక్ష్యంగా మూడు కర్తవ్యాల స్ఫూర్తితో తయారుచేసిన ఈ బడ్జెట్ లక్ష్యమని రక్షణమంత్రి అన్నారు. ‘‘ఈ మూడు ప్రాధాన్యాలను సమగ్రాభివృద్ధిని నడిపిస్తాయి. సుస్థిరమైన మౌలిక వసతులను రూపొందిస్తాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తాయి. సుస్థిరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాయి. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ఈ బడ్జెట్ రూపొందింది’’ అని అన్నారు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి మోదీకి శ్రీ రాజనాథ్ సింగ్ ధన్యవాదాలు తెలియజేశారు. భద్రత, అభివృద్ధి, స్వావలంబన సమతౌల్యాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని, జాతీయ ఆసక్తులకు అనుగుణంగా ఉందన్నారు. చరిత్రాత్మక ఆపరేషన్ సిందూర్ విజయం అనంతరం తీసుకొచ్చిన ఈ బడ్జెట్.. దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలనే, సైనిక సామర్థ్యాలను విస్తరించాలనే ప్రభుత్వం సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.
మాజీ సైనికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈసీహెచ్ఎస్ కేటాయింపులను ప్రభుత్వ సంకల్పానికి చిహ్నంగా రక్షణ మంత్రి వర్ణించారు.
***
(రిలీజ్ ఐడి: 2222110)
సందర్శకుల సూచీ సంఖ్య : : 96