ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
28 JAN 2026 7:18PM by PIB Hyderabad
కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చిన గౌరవ మంత్రులకు, అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ దిగ్గజాలకు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!
నమస్కారం!
పారిశ్రామిక నాయకులు, నిపుణులు, పెట్టుబడిదారులు అందరినీ వింగ్స్ ఇండియాకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వైమానిక రంగ భవిష్యత్తు అనేక ఆకాంక్షలతో నిండి ఉందని మీ అందరికీ తెలుసు. దీనిలో భారత్ కీలకంగా మారనుంది. విమానాల తయారీ, పైలట్ శిక్షణ, అధునాతన విమాన ప్రయాణం, ఎయిర్క్రాఫ్టుల లీజు - ఈ రంగాల్లో అనేక అవకాశాలు భారత్లో ఉన్నాయి. అందుకే వింగ్స్ ఇండియా సదస్సు మనందరికీ ముఖ్యమైనదిగా మారింది.
స్నేహితులారా
మొత్తం భారతీయ విమానయాన రంగంలో గత దశాబ్దంలో చరిత్రాత్మక పరివర్తన చోటు చేసుకుంది. విమాన ప్రయాణం కొందరికి మాత్రమే పరిమితమైన దేశాల్లో ఒకప్పుడు భారత్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజు, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్గా భారత్ ఎదిగింది. మా ప్రయాణికుల రద్దీ వేగంగా పెరిగింది. భారతీయ వైమానిక సంస్థల విమానాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో.. 1500కు పైగా విమానాలకు భారతీయ విమానయాన సంస్థలు ఆర్డర్లు ఇచ్చాయి.
స్నేహితులారా,
దీర్ఘకాలిక లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తున్నందువల్లే భారత విమానయాన రంగంలో ఈ మార్పు వచ్చింది. ఇప్పుడు భారత్లో విమాన ప్రయాణం, కొందరికే పరిమితం కాకుండా.. సమ్మిళిత్వంతో నిండి ఉంది. భారతీయ పౌరునికి విమాన ప్రయాణ సౌలభ్యం అందించడమే మా లక్ష్యం. అందుకే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను విమానశ్రయాలతో అనుసంధానించాం. 2014లో భారత్లో 70 ఎయిర్పోర్టులు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్య 160కి పెరిగింది. ఒక దశాబ్ద కాల వ్యవధిలోనే భారత్లో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగింది. దేశంలో వంద కంటే ఎక్కువ ఎయిర్ డోమ్లను ప్రారంభించాం. వీటితో పాటుగా మా ప్రజల కోసం సరసమైన ధరలతో ఉడాన్ పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా కోటిన్నర మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో ప్రయాణించారు. ఈ మార్గాల్లో చాలా వరకు గతంలో ఉనికిలో లేవు.
స్నేహితులారా,
ఈ రోజు, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో మన విమానయాన కార్యకలాపాలు అనేక రెట్లు పెరగడం ఖాయం. భారత్లో వైమానిక వ్యవస్థ విస్తరించేలా 2047 నాటికి మరో నాలుగు వందల విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా.. ఉడాన్ పథకం తదుపరి దశపై కూడా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ విధానంతో ప్రాంతీయంగా, చౌక ధరలకే లభించే విమానయానం మరింత బలపేతమవుతుంది. వీటితో పాటుగా.. సీప్లేన్ కార్యకలాపాలు సైతం మరింత విస్తరిస్తాయి. భారత్లోని ప్రతి మూలకు వైమానిక ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలన్నదే మా ప్రయత్నం.
స్నేహితులారా,
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి అవుతున్నాయి. ఈ ప్రాంతాలకు చేరుకొనేందుకు ఎక్కువ మంది ప్రజలకు విమాన ప్రయాణమే మొదటి ఎంపికగా ఉంటోంది. భవిష్యత్తులో మునుపెన్నడూ లేని విధంగా విమాన ప్రయాణానికి గిరాకీ విస్తరించనుంది. అంటే మీ అందరికీ మరిన్ని పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి.
స్నేహితులారా,
ప్రస్తుతం ప్రధాన అంతర్జాతీయ వైమానిక కేంద్రంగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో.. మన విమానయాన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం అవసరం. అందుకే మనం స్వావలంబన మార్గాన్ని బలోపేతం చేసుకోవాలి. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు ఇది సహాయపడుతుంది. ఈ ఆలోచనతోనే, ఎయిర్క్రాఫ్టు నమూనా, ఎయిర్క్రాఫ్టు తయారీ, ఎయిర్క్రాఫ్టు ఎంఆర్వో వ్యవస్థపై భారత్ ప్రధాన దృష్టిని సారిస్తోంది. ఎయిర్క్రాఫ్టు విడి భాగాల ప్రధాన తయారీదారుగా, సరఫరాదారుగా భారతదేశం నేటికీ కొనసాగుతోంది. దేశంలో సైనిక, రవాణా విమానాల తయారీని మేం ప్రారంభించాం. పౌర విమానాల తయారీ దిశగా సైతం భారత్ ముందుకెళుతోంది. భారత్లో అనేక ప్రయోజనాలున్నాయని పెట్టుబడిదారులైన మీ అందరికీ తెలుసు. ప్రపంచ ఎయిర్ కారిడార్లలో భౌగోళిక స్థానం, అసమానమైన దేశీయ ఫీడర్ నెట్వర్క్, భవిష్యత్తులో దూర ప్రాంతాలకు ప్రయాణించే విమానాల సంఖ్య పెంపు.. ఇవన్నీ భారతదేశానికున్న ప్రధాన బలాలు.
స్నేహితులారా,
భారత్లో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, లాండింగ్ ఎయిర్ క్రాఫ్టును రూపొందించి, తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది మొత్తం విమానయాన రంగానికి కొత్త దిశను అందిస్తుంది. ఈ సాంకేతికత ప్రయాణ సమయాన్ని చాలా తగ్గిస్తుంది. దీనితో పాటుగా, పర్యావరణహిత విమాన ఇంధనంపై కూడా మేం పని చేస్తున్నాం. వచ్చే కొన్నేళ్లలో హరిత వైమానిక ఇంధన ప్రధాన ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా మారే దిశలో భారత్ ముందుకెళుతోంది.
స్నేహితులారా,
దేశీయ విమానయాన రంగంలో అనేక సంస్కరణలను సైతం మేం చేపడుతున్నాం. ఈ ప్రయత్నాల వల్ల, గ్లోబల్ సౌత్కు, ప్రపంచానికి మధ్య ప్రధాన విమానయాన ద్వారంగా భారత్ మారనుంది. ఇది విమానయాన రంగంతో అనుసంధానమై ఉన్న పెట్టుబడిదారులకు, తయారీదారులకు మంచి అవకాశం.
స్నేహితులారా,
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను, మార్కెట్లను ఒకదానితో ఒకటి భారత్ ప్రస్తుతం అనుసంధానిస్తోంది. మన నగరాలను వివిధ రకాల రవాణా మార్గాల ద్వారా పోర్టులకు అనుసంధానించాం. ఎయిర్ కార్గోకు సైతం భారత విమానయాన రంగం సమ ప్రాధాన్యమిస్తోంది. కార్గో రవాణాను మరింత వేగవంతంగా, సమర్థంగా మార్చేందుకు అవసరమైన అన్ని నియంత్రణ సంస్కరణలపై ప్రభుత్వం పనిచేస్తోంది. వీటితో పాటుగా.. మన డిజిటిల్ కార్గో వేదికలు సైతం ఈ మొత్తం ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా మారుస్తున్నాయి. ఆఫ్-ఎయిర్పోర్టు ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్పోర్టులపై భారం కూడా తగ్గుతోంది. కార్గో నిర్వహణను మరింత వేగంగా, మెరుగ్గా చేపట్టేందుకు ఆధునిక గిడ్డంగులను సైతం మేం నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో కార్గో డెలివరీ సమయం, రవాణా ఖర్చులను ఇది తగ్గిస్తుంది. అలాగే భవిష్యత్తులో అతి పెద్ద, పోటీనిచ్చే సరకు రవాణా హబ్గా భారత్ ఆవిర్భవిస్తుంది.
స్నేహితులారా,
గిడ్డంగులు, సరకు రవాణా, ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో భారత్లో ఉన్న అవకాశాలను అన్వేషించాల్సిందిగా పెట్టుబడిదారులను కోరుతున్నాను.
స్నేహితులారా,
విమానయాన పరిశ్రమకు సంబంధించి ఇంత పెద్ద స్థాయిని, స్థిరమైన విధానాలను, సాంకేతిక లక్ష్యాలను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి దేశానికి, ప్రతి పారిశ్రామికవేత్తకు, ప్రతి ఆవిష్కర్తకు చెబుతున్నాను. ఈ అభివృద్ధి ప్రయాణంలో మా దీర్ఘకాలిక భాగస్వామిగా మారండి, ప్రపంచ విమానయాన రంగ వృద్ధికి కృషి చేయండి. భారతీయ విమానయానంలో సహ పైలట్లుగా మాతో కలసి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాను. మరోసారి.. వింగ్స్ ఇండియాను విజయవంతంగా నిర్వహిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు!
****
(రిలీజ్ ఐడి: 2220044)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam