యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సంయుక్తంగా నిర్వహించిన
స్పోర్ట్స్ గవర్నెన్స్ కాంక్లేవ్లో ప్రసంగించిన కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
అహ్మదాబాద్లో జరిగిన స్పోర్ట్స్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో "ఒలింపిక్స్లో టాప్ 10 స్థానాల్లో నిలవాలన్న భారత్ లక్ష్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి
భారతీయ క్రీడా రంగంలో ఇది స్వర్ణయుగం.. ఈ కృషిని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: డాక్టర్ మాండవీయ
సమాఖ్యలోని దీర్ఘకాలిక సమస్యలకు ఇక స్వస్తి: డాక్టర్ మాండవీయ
प्रविष्टि तिथि:
09 JAN 2026 4:55PM by PIB Hyderabad
అహ్మదాబాద్, గుజరాత్: అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సంయుక్తంగా నిర్వహించిన స్పోర్ట్స్ గవర్నెన్స్ కాంక్లేవ్లో కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు.
జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు, ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్రమంత్రి.. భారత క్రీడా రంగానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న స్పష్టమైన, రాజీలేని లక్ష్యాల్లో ముఖ్యంగా పాలనా సంస్కరణలు, అంతర్జాతీయ స్థాయి పోటీల అనుభవం, అట్టడుగు స్థాయి నుంచి మేటి స్థాయి వరకు ప్రతిభను గుర్తించటం, శిక్షణ, కోచింగ్ వ్యవస్థను బలపరచటం, క్రీడా మౌలిక సదుపాయాలు, అకాడమీలు, లీగ్స్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరించటం వంటి అంశాలను వివరించారు.
భారత క్రీడా రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించేలా ఏడాదిన్నర కాలంగా సంస్థాగత చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. "ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని అమలుకు రాజకీయ చిత్తశుద్ధిని, స్పష్టమైన లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రదర్శించింది" అని అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ (ఎన్ఎస్జీఏ), ఖేలో భారత్ నీతి, ఏఎన్ఎస్ఎఫ్ నిబంధనల్లో మార్పులు, కోచ్ల నియామక వ్యవస్థలో మెరుగుదల వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
క్రీడా సమాఖ్యల్లోని అంతర్గత వివాదాలు, అవినీతి, అవకతవకలతో కూడిన ఎంపిక ప్రక్రియలు, అథ్లెట్లకు జరుగుతున్న అన్యాయం, పాలనాపరమైన వివాదాలు, ఆర్థిక అవకతవకలకు ముగింపు పలకాలన్న ప్రభుత్వ వైఖరిని మంత్రి స్పష్టంగా చెప్పారు.
"మాకు అథ్లెట్లు, దేశ ప్రతిష్ఠనే అత్యంత ముఖ్యం" అని ఆయన తెలిపారు. క్రీడా సమాఖ్యల స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం గౌరవిస్తుందని.. సమగ్రత, పారదర్శకత, అథ్లెట్ల సంక్షేమ పాలనకు క్రీడా సంస్థలు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు.
ఎన్ఎస్జీఏ అమలు బాధ్యత క్రీడా సమాఖ్యలదేనని, సమాఖ్యలు నిష్పక్షపాతంగా, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఆర్థిక పారదర్శకతను పాటించాలని, క్రియాశీలక అథ్లెట్ కమిషన్లు, నైతిక విలువలతో కూడిన కమిషన్లను ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన పాలనా నిబంధనలను పాటించాలని ఆయన తెలిపారు.
వృత్తిపరమైన, భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విధానాన్ని అవలంబించాలని, ప్రతి సమాఖ్య రానున్న 1, 3, 5, 10 ఏళ్ల కోసం స్పష్టమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేయాలని మంత్రి కోరారు. వృత్తిపరంగా క్రీడా సంస్థల్ని నడపాలని, వాటిల్లో అర్హత కలిగిన సీఈఓలు, ఆర్థిక నిపుణులు, మార్కెటింగ్ నిపుణులు, అంతర్జాతీయ కోచ్లు, ప్రత్యేక కార్యకలాపాల బృందాలు ఉండాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ప్రామాణిక ఎంపిక ప్రక్రియలు, "వన్ కార్పొరేట్, వన్ స్పోర్ట్" నమూనా, అథ్లెట్ల సంక్షేమానికి మెరుగైన ప్యాకేజీ వంటి కీలక విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు డాక్టర్ మాండవీయ తెలిపారు.
స్పోర్ట్స్ సైన్స్, పౌష్టికాహారం, క్రీడాకారులు గాయపడినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, అత్యుత్తమ ప్రదర్శనకు అవసరమైన మద్దతుకు ప్రభుత్వం ఇప్పటికే భారీగా పెట్టుబడి పెడుతుందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసక్తి, ఆశయాలకు అనుగుణంగా క్రీడా సమాఖ్యలు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారత దీర్ఘకాలిక క్రీడా దృక్పథాన్ని ప్రసావిస్తూ, ఒలింపిక్ పతకాల జాబితాలో టాప్-10లో నిలవటమే దేశ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆశయాన్ని సాకారం చేయటంలో జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాల పాత్ర కీలకమన్నారు.
"ఆసియా క్రీడలు-2026 నుంచి ప్రతి ప్రధాన అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రదర్శన మెరుగుపడాలి. ఆతిథ్య దేశంగానూ, క్రీడా రంగంలో శక్తిమంతమైన దేశంగానూ కామన్వెల్త్ గేమ్స్-2030 భారత్కు చిరస్మణీయ విజయంగా నిలవాలి" అని తెలిపారు.
ప్రస్తుత కాలం భారతీయ క్రీడారంగానికి స్వర్ణయుగం వంటిదని అభివర్ణిస్తూ, జవాబుదారీతనంపై కీలక సందేశంతో డాక్టర్ మాండవీయ ప్రసంగాన్ని ముగించారు. "మనం ఇప్పుడు సాధించిన విజయాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది. కానీ మనం బాధ్యతలను నెరవేర్చటంలో విఫలమైతే క్షమించదు"
***
(रिलीज़ आईडी: 2213676)
आगंतुक पटल : 5