గనుల మంత్రిత్వ శాఖ
ముగిసిన రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిరం: జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం, సుస్థిర గనుల తవ్వకంపై సారించిన దృష్టి
प्रविष्टि तिथि:
10 JAN 2026 4:42PM by PIB Hyderabad
గాంధీనగర్, గుజరాత్: ‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిరం-2026’ ముగిసింది. ఈ కార్యక్రమంలో సుస్థిర మైనింగ్ను కొనసాగించడానికి, దేశంలో కీలకమైన ఖనిజాల అవసరాలను తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబద్ధతను తెలియజేశాయి. భారతీయ మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసే కీలకాంశాలపై చింతనా శిబిరం రెండో రోజు దృష్టి సారించింది. అలాగే జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం, సుస్థిర మైనింగ్ పద్ధతులు, దీర్ఘకాల ఖనిజ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా చర్చించారు. సమన్వయంతో కూడిన, భవిష్యత్తుకు తగిన విధానాల ద్వారా మైనింగ్ విలువ ఆధారిత వ్యవస్థలో దేశీయ సామర్థ్యాలను విస్తరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమంలో జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమ విధానాల గురించి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వివేక్ కుమార్ బాజ్పాయ్ వివరించారు. పరిశ్రమలు, పరిశోధనా సంస్థల సహకారంతో కీలక ఖనిజాలను గుర్తించడం, వాటిని అన్వేషించడం, వేలానికి సంబంధించిన వ్యూహాలు, దేశీయ మైనింగ్ రంగాన్ని, శుద్ధి సామర్థ్యాలను బలోపేతం చేయడం, విలువ జోడింపును ప్రోత్సహించడం, స్థిరమైన సరఫరా వ్యవస్థలను నిర్మించే చర్యలకు సంబంధించిన కార్యక్రమాల గురించి తెలియజెప్పారు.
వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను సేకరించడం గురించి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోల్ జనరల్ శ్రీ పంకజ్ కులశ్రేష్ట వివరించారు. ఖనిజాల లభ్యతను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతలను, ద్వితీయ వనరులను ఉపయోగించుకొనే అవకాశాల గురించి తెలియజేశారు. అదే సమయంలో పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పునర్వినియోగ మైనింగ్ పద్ధతులను అవలంబించడంపై చర్చించారు.
గనుల శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. జాతీయ వృద్ధిలో మైనింగ్ రంగం అందిస్తున్న సహకారాన్ని పెంపొందించేందుకు సకాలంలో గనుల నిర్వహణ చేపట్టాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేశారు. వేగవంతమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రక్రియల అవసరం గురించి, దేశాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా.. గనుల కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు గనుల మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
పంజాబ్ గనుల రంగంలో సాధిస్తున్న పురోగతిని, సామర్థ్యాన్ని ఆ రాష్ట్ర గనుల మంత్రి శ్రీ బరీందర్ కుమార్ గోయల్ వెల్లడించారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతలు, సుస్థిర విధానాలు, సమర్థమైన విధాన చర్యలను స్వీకరించాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు.
సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధికి అవసరమైన పునాదిగా మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి తెలియజేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విస్తృత గనుల మూసివేత ప్రణాళిక అవసరాన్ని, ఖనిజాల బ్లాకులను సకాలంలో వేలం వేయాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్రాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. 2047 నాటికి ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా బాధ్యతాయుతమైన మైనింగ్ను ప్రోత్సహించడంలో, దేశీయంగా మైనింగ్ భద్రతను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
రెండు రోజుల ఈ సదస్సుకు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహరాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా, రాష్ట్రాల మంత్రులు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎనిమిదికి పైగా రాష్ట్రాలకు చెందిన గనుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇది మైనింగ్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2213647)
आगंतुक पटल : 11