రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవ వేడుకలు 2026.. విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు
प्रविष्टि तिथि:
05 JAN 2026 12:49PM by PIB Hyderabad
పాఠశాల, దేశం పట్ల పిల్లల్లో ఐక్యత, మమకారం, గర్వాన్ని పెంపొందించేందుకు గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఆర్డీసీ) 2026లో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు 2025-26 విజయవంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీలు నాలుగు విభాగాల్లో (అబ్బాయిల బ్రాస్ బాండ్, అమ్మాయిల బ్రాస్ బాండ్, అబ్బాయిల పైప్ బ్యాండ్, అమ్మాయిల పైప్ బ్యాండ్) మూడు స్థాయిల్లో (రాష్ట్ర, జోనల్, జాతీయ(ఫైనల్) స్థాయిలో) జరుగుతాయి.
రాష్ట్ర స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, యూటీల నుంచి 824 పాఠశాల బ్యాండ్ బృందాలు నమోదు చేసుకోగా, 18,013 మంది పిల్లలతో కూడిన 763 బృందాలు పాల్గొన్నాయి. జోనల్ స్థాయి పోటీలకు 94 బృందాలు ఎంపికయ్యాయి. ఒక్కో జోన్ నుంచి తుది పోటీలకు అర్హత సాధించిన నాలుగు బృందాలు అంటే.. నాలుగు జోన్ల (తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం) నుంచి మొత్తం 16 బృందాలు జనవరి 24, 2026న న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన ప్రత్యేక జ్యూరీ సభ్యులు ఈ బృందాల ప్రదర్శనలకు నిర్ణేతరులుగా వ్యవహరిస్తారు. ఇందులో భారత రక్షణ రంగంలోని సైన్యం, నావికాదళం, వాయుసేన విభాగ ప్రతినిధులు సభ్యులుగా ఉండి, విజేతలను నిర్ణయిస్తారు.
జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలను ఆర్డీసీ-2023 నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బ్యాండ్ నుంచి వచ్చే లయబద్ధమైన సంగీతం.. పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, కార్యశీలతను ప్రోత్సహిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తుంది. గతేడాది ఆర్డీసీ-2025 సందర్భంగా, రాష్ట్రస్థాయిలో మొత్తం 709 పాఠశాల బ్యాండ్ బృందాలు నమోదు చేసుకోగా.. 13,999 మంది పిల్లలతో 568 బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి.
(रिलीज़ आईडी: 2211547)
आगंतुक पटल : 14