ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతీయ ఔషధ సంహిత 10వ సంచికను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా
భారత ఔషధ సంహితకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆమోదం, 19 గ్లోబల్ సౌత్ దేశాల్లో గుర్తింపు: కేంద్ర ఆరోగ్య మంత్రి
డబ్ల్యూహెచ్వో ఫార్మకోవిజిలెన్స్లో 123 నుంచి 8వ స్థానానికి చేరుకున్న భారత్: శ్రీ నడ్డా
121 కొత్త మోనోగ్రాఫులతో యాంటీ-టీబీ, యాంటీ-డయాబెటిక్, యాంటీ-క్యాన్సర్ ఔషధాల విస్తృతిని పెంపొందించిన భారతీయ ఔషధ సంహిత-2026
ఐపీ 2026లో ట్రాన్స్ప్యూజన్ ఔషధాల కోసం బ్లడ్ కాంపోనెంట్ మోనాగ్రాఫులను మొదటిసారి ప్రవేశపెట్టారు
प्रविष्टि तिथि:
02 JAN 2026 1:46PM by PIB Hyderabad
భారత్లో అధికారిక ఔషధ ప్రామాణిక గ్రంథమైన ఇండియన్ ఫార్మకోపియా-2026 (ఐపీ 2026)ను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఆవిష్కరించారు. ఇది ఔషధాల నాణ్యతను, భద్రతను, సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో ముఖ్య ప్రస్థానం.

కొత్త సంచిక ఆవిష్కరణ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ నడ్డా ప్రసంగించారు. దేశంలోని ఔషధ ప్రమాణాలకు అధికారిక గ్రంథంగా భారతీయ ఔషధ సంహిత పనిచేస్తుందని, ఔషధాలకు సంబంధించి భారత్ అనుసరిస్తున్న నియంత్రణా విధానాల్లో కీలకంగా ఉంటుందని తెలిపారు. శాస్త్రీయ పురోగతులు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఔషధాల తయారీ, నియంత్రణలో పెరుగుతున్న భారత ప్రాధాన్యాన్ని ఈ పదో సంచిక తెలియజేస్తుందన్నారు.

భారతీయ ఔషధ సంహిత – 2026లో కొత్తగా 121 మోనోగ్రాఫులను చేర్చారని ఆయన చెప్పారు. దీంతో మొత్తం మోనోగ్రాఫుల సంఖ్య 3,340కి చేరుకుంది. క్షయ, మధుమేహం, క్యాన్సర్ నిరోధక ఔషధాలు, ఐరన్ సప్లిమెంట్లతో సహా కీలకమైన చికిత్సా విభాగాల్లో కవరేజీ బలోపేతమైందని ఆయన చెప్పారు. తద్వారా వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పరిధిలోఉపయోగించే ఔషధాల సమ్రగ ప్రామాణికతకు మరింత హామీ లభిస్తుందన్నారు.
ఫార్మకోవిజిలెన్స్ గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఆరోగ్య దౌత్యంలో ప్రధాన అజెండాగా మారిన భారతీయ ఔషధ సంహిత ప్రమాణాలకు ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ఆమోదం లభిస్తోందన్నారు. అలాగే గ్లోబల్ సౌత్లోని 19 దేశాల్లో భారత ఔషధ సంహితకు ఇప్పుడు గుర్తింపు లభించిందని తెలియజేశారు.

భారత ఫార్మకోపియా కమిషన్ (ఐపీసీ) పరిధిలో నిర్వహిస్తున్న ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ) సాధించిన పురోగతి గురించి శ్రీ నడ్డా వివరించారు. 2009-2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్మకోవిజిలెన్స్ డేటాబేస్కు అందించిన సహకారం ఆధారంగా.. అంతర్జాతీయంగా భారత్ ర్యాంకు 123గా ఉండేది. 2025 నాటికి అది 8వ స్థానానికి పెరిగింది. ఈ ఘనతను సాధించిన ఐపీసీ, పీవీపీఐ బృందాన్ని శ్రీ నడ్డా అభినందించారు. రోగుల భద్రత, నాణ్యతా హామీ, విస్తృతమైన నిఘా నియంత్రణల పట్ల భారత దేశ అంకితభావాన్ని ఫార్మకోవిజిలెన్స్ వ్యవస్థ బలోపేతం చేస్తుందని తెలిపారు.
భారతీయ ఔషధ సంహిత 2026లో ట్రాన్స్ప్యూజన్ ఔషధాలకు సంబంధించి 20 బ్లడ్ కాంపోనెంట్ల మోనోగ్రాఫులను మొదటిసారి చేర్చినట్లు మంత్రి తెలియజేశారు. ఔషధాలు, సౌందర్య సాధనాల (రెండో సవరణ) నియమాలు-2020కు అనుగుణంగా వీటిని చేర్చారు. ఇది నియంత్రణా పురోగతులను తెలియజేస్తుంది.
ఆరోగ్య సేవల వ్యవస్థలను, నియంత్రణా వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని శ్రీ నడ్డా తెలిపారు. ఈ నిరంతర కృషి, నాణ్యత, పారదర్శకత, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని భారతీయ ఔషధ సంహిత – 2026 ప్రతిబింబిస్తుందని తెలియజేశారు.
పదో సంచికను రూపొందించిన భారత ఫార్మకోపియా కమిషన్, ఇతర భాగస్వాములందరికీ కేంద్ర మంత్రి మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ఫార్మకోపియా - 2026 ఔషధాల నాణ్యతా ప్రమాణాలను, భారతీయ నియంత్రణా విధానాలను బలోపేతం చేస్తుందని, అంతర్జాతీయ ఔషధ రంగంలో దేశ ప్రభావాన్ని విస్తరిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వేసిన ముందడుగును భారతీయ ఔషధ సంహిత ఆవిష్కరణ తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్నారు. దేశ వ్యాప్తంగా సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యతా హామీ ఉన్న ఔషధాలను అందించడానికి విస్తృతమైన, శాస్త్రీయ ఆధారమైన ఫార్మకోపియా అవసరమని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అవలంబించడం, రోగుల భద్రత, నియంత్రణా నైపుణ్యాల్లో భారత చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా ఫార్మకోపియా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచాలని, సమన్వయపరచాలని ఆరోగ్యకార్యదర్శి తెలిపారు. అదే సమయంలో ఔషధ సరఫరా వ్యవస్థలో దేశ స్థాయి పెరిగేలా తోడ్పాటు అందించాలన్నారు.
భారతీయ ఔషధ సంహిత గురించి
ఔషధాలు, సౌందర్య సాధనాలు చట్టం 1940లోని నిబంధనల ప్రకారం కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరఫున భారతీయ వైద్య సంహిత (ఐపీ)ను భారతీయ ఫార్మకోపియా కమిషన్ (ఐపీసీ) ప్రచురిస్తుంది. భారత్లో తయారయ్యే లేదా అమ్మకాలు సాగించే ఔషధాలకు సంబంధించి అధికారిక ప్రమాణాలను ఐపీ అందిస్తుంది. తద్వారా ఔషధాల నాణ్యత నియంత్రణకు, హామీకి తోడ్పడుతుంది. ఐపీ ప్రమాణాలు అధికారికమైనవి, చట్టపరమైనవి. మనదేశంలో ఔషధాల తయారీకి, పరీక్షించడానికి, పంపిణీకి అవసరమైన లైసెన్సులను అందించడంలో తోడ్పడుతుంది.

ఫార్మకోపియల్ డిస్కసన్ గ్రూప్ (పీడీజీ)లో సభ్యురాలిగా మోనోగ్రాఫులు, సాధారణ అధ్యాయాల సమన్వయానికి యూరోపియన్, జపనీస్, అమెరికా ఫార్మకోపియాలతో కలసి ఇండియన్ ఫార్మకోపియా చురుగ్గా పనిచేస్తోంది. అంతర్జాతీయ సమన్వయ మండలి (ఐసీహెచ్) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారతీయ ఔషధ సంహిత అవసరాలు.. అంతర్జాతీయ ఔషధ ప్రమాణాల పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (ఇండియా) డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ హర్ష్ మంగ్లా, భారతీయ ఫార్మకోపియా కమిషన్ సెక్రటరీ -కమ్- సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ వీ కలైసెల్వన్, ఇతర పారిశ్రామిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2210813)
आगंतुक पटल : 23