బొగ్గు మంత్రిత్వ శాఖ
సవరించిన ఝారియా మాస్టర్ ప్లాన్ ద్వారా చేపట్టిన పునరావాస పనులను సమీక్షించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
24 DEC 2025 5:53PM by PIB Hyderabad
ధన్బాద్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఝారియా బొగ్గు గనుల ప్రాంతంలో కొనసాగుతున్న పునరావాస పనుల పురోగతిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి సమీక్షించారు. సవరించిన ఝారియా మాస్టర్ ప్లాన్ (ఆర్జేఎంపీ) ద్వారా బెల్గారియా, కర్మాటాండ్ పునరావాస ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ అతిథి గృహంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కేంద్రమంత్రికి గౌరవ వందనం సమర్పించారు.
2025 జూన్ 25న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదించిన సవరించిన ఝారియా మాస్టర్ ప్లాన్ (ఆర్జేఎంపీ) ప్రకారం... ఝారియా బొగ్గు గనుల్లో దీర్ఘకాలంగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, భూమి కుంగిపోవడం, పునరావాసం వంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న బీసీసీఎల్కు చెందని కుటుంబాల పునరావాస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఝారియా పునరావాస, అభివృద్ధి సంస్థ (జేఆర్డీఏ) చేపడుతుండగా.. ‘భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్’ (బీసీసీఎల్) తన నిర్వహణ ప్రాంతాల్లోని కుటుంబాల పునరావాసానికి బాధ్యత వహిస్తోంది.

బెల్గారియా పునరావాస టౌన్షిప్
బెల్గేరియా పునరావాస టౌన్షిప్లో జేఆర్డీఏ పరిపాలనా భవనం, ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాన్ని కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. నివాసితులకు నిరంతరం పాలన, సమర్థవంతమైన కాలనీ నిర్వహణ, సమయానుకూలంగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు.
పలు కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు (దశలు II, III), భద్రతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ హిత మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు 500 ఎల్ఈడీ సౌర వీధి దీపాల ఏర్పాటు, IV, VI, VII, VIII దశలకు సంబంధించిన మిగిలిన అభివృద్ధి పనులు, ఆధునిక తరగతి గదులు, డిజిటల్ అభ్యాస సౌకర్యాలు, పారిశుధ్య మౌలిక సదుపాయాలు, విద్యుత్ బ్యాకప్, మెరుగైన విద్యా సౌకర్యాలతో కూడిన మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేయడం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

జేఆర్డీఏ అభివృద్ధి చేసిన బెల్గారియాను ఒక సమగ్ర పునరావాస కేంద్రంగా రూపొందించారు. ఎనిమిది దశల్లో అభివృద్ధి చేసిన ఈ టౌన్షిప్లో 1,191 బ్లాకులు, మొత్తం 18,272 ఇళ్లు ఉన్నాయి. పటిష్టమైన పౌర, సామాజిక, కమ్యూనిటీ మౌలిక సదుపాయాలను కల్పించారు. సుమారు రూ.1.23 కోట్ల వ్యయంతో నిర్మించిన జేఆర్డీఏ పరిపాలనా భవనం, రేషన్ షాపు పనులు పూర్తయ్యాయి.
పునరావాసితుల జీవనోపాధికి మద్దతుగా బీసీసీఎల్ సీఎస్ఆర్ కార్యక్రమం కింద 11 ఈ-రిక్షాలు పునరావాస కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇది వారికి స్థిరమైన ఆదాయం, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది.
బెల్గేరియాలో సాధించిన పురోగతిని మంత్రి ప్రశంసించారు. బాధిత కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన, స్థిరమైన జీవితాన్ని అందించేందుకు సకాలంలో పనుల పూర్తి, నాణ్యమైన నిర్మాణం, జీవనోపాధి ఆధారిత పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కర్మాటాండ్ పునరావాస ప్రాంతం
ప్రమాదకర ప్రాంతాల నుంచి తరలించిన కుటుంబాల కోసం బీసీసీఎల్ అభివృద్ధి చేసిన కర్మాటాండ్ పునరావాస ప్రాంతంలో 4,008 ఇళ్ళను నిర్మించినట్లు కేంద్రమంత్రిని పేర్కొన్నారు. వీటికి తాగు నీరు, విద్యుత్ సరఫరా, విశాలమైన అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
కర్మాటాండ్లో జరిగిన సభలో మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. సవరించిన ఝారియా మాస్టర్ ప్లాన్ ప్రకారం సురక్షితం కాని నివాసాలు, గనుల ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు, భూమి కుంగిపోవడం వంటి సమస్యలను సమగ్ర, ప్రజలకేంద్రిత పునరావాస విధానం ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్జేఎంపీ కింద బీసీసీఎల్ అనేక పునరావాస ప్రాంతాలను అభివృద్ధి చేసినందున, కర్మాటాండ్ కీలకమైన పునరావాస కేంద్రంగా ఆవిర్భవిస్తోందని ఆయన పేర్కొన్నారు.
లోడ్నా ప్రాంతం నుంచి కొత్తగా పునరుద్దరించిన భవనంలోనికి తరలించిన కర్మాటాండ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాల 1 నవంబర్ 2025 నుంచి పనిచేస్తుంది. పునరావాసిత కుటుంబాల పిల్లలకు ఆధునిక ఫర్నిచర్, సదుపాయాలతో సమగ్రంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తోంది.
బహుళ నైపుణ్య అభివృద్ధి సంస్థను కేంద్రమంత్రి ప్రారంభించారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి మండలి సహకారంతో 27 నవంబర్ 2025 నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ.. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఫిట్టర్ వంటి వృత్తులలో నైపుణ్య శిక్షణను అందిస్తుంది. భవిష్యత్తులో మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఈ శిక్షణలను విస్తరించే అవకాశం ఉంది.
కర్మాటాండ్లో ఉచిత ఈ-బస్ రవాణా సేవలు, మార్కెట్ కాంప్లెక్స్, ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యసేవలు, పీడీఎస్ సదుపాయాలు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు, ఆంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
తన పర్యటనలో భాగంగా భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) సమగ్ర కమాండ్, కంట్రోల్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇందులో సీసీటీవీ నిఘా, ఆర్ఎఫ్ఐడీ ఆధారిత ప్రవేశ నియంత్రణ, వాహన ట్రాకింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ బరువు సౌకర్యాలు వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలను అనుసంధానిస్తుంది. దీని ద్వారా బీసీసీఎల్ కార్యకలాపాల్లో భద్రత, పారదర్శకత, కార్యచరణ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
బీసీసీఎల్ చెందిన దుగ్ధ సోలార్ పవర్ ప్లాంట్ను కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇది స్వచ్ఛమైన ఇంధనాన్ని స్వీకరించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ బాధ్యతాయుతమైన కార్యకలాపాలకు బీసీసీఎల్ నిబద్ధతను చాటిచెప్పే ఒక కీలకమైన చర్యగా పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం, జేఆర్డీఏ, బీసీసీఎల్ చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ ఝారియా బొగ్గు ప్రాంతంలో గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సురక్షితమైన పునరావాసం, మెరుగైన జీవన ప్రమాణాలు, జీవనోపాధి అవకాశాలు, స్థిరమైన అభివృద్ధిని అందించడంలో తమ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గృహనిర్మాణం, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధనం, మౌలిక సదుపాయాలతో కూడిన ఈ సమగ్ర విధానం.. సవరించిన ఝరియా మాస్టర్ ప్లాన్ ద్వారా పునరావాస ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ బాధితుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
****
(రిలీజ్ ఐడి: 2208445)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35