పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైన పెసా మహోత్సవం

ఉత్సాహభరితంగా పెసా రన్, రోజంతా గిరిజన క్రీడలు, సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి కార్యక్రమాలు

గిరిజన హక్కులు, గ్రామ సభల బలోపేతమే లక్ష్యంగా రెండ్రోజుల వేడుకలు – పెసా రన్‌ను ప్రారంభించిన అర్జున అవార్డు గ్రహీత జ్యోతి

నాడు పోస్టు చేయడమైనది: 23 DEC 2025 4:47PM by PIB Hyderabad

విశాఖపట్నం

23 డిసెంబర్ 2025

 

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు (23–24 డిసెంబర్ 2025) నిర్వహిస్తున్న పెసా మహోత్సవం ఈ రోజు (మంగళవారం) ఘనంగా ప్రారంభమైంది. పంచాయతీలు (షెడ్యూల్డ్ ఏరియాల విస్తరణ) చట్టం, 1996 (PESA) ప్రాముఖ్యతను చాటిచెప్పేలా నిర్వహిస్తున్న ఈ మహోత్సవం ప్రతిష్టాత్మక ఆర్.కే. బీచ్‌ వేదికగా నిర్వహించిన 'పెసా రన్‌'తో ఉత్సాహంగా మొదలైంది.

పెసా రన్ ను అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ భారతీయ ఆర్చర్ శ్రీమతి జ్యోతి సురేఖ వెన్నం ప్రారంభించగా.. ఇందులో అన్ని వయస్సుల వారు, ముఖ్యంగా గిరిజన యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ముక్తా శేఖర్, ఏపీఎస్‌ఐఆర్‌డీ & పీఆర్ కమిషనర్ శ్రీ ముత్యాలరాజు రేవు, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ మరియు డైరెక్టర్ శ్రీ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు, అదనపు కమిషనర్ (పీఆర్) డా. ఎం. సుధాకర్ రావు, తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వీరంతా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామ సభలను శక్తివంతం చేయడంలో, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన సమాజాల హక్కులు, సముదాయ వనరులు, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడంలో పెసా చట్టం పాత్రను వివరించారు.

పెసా రన్ అనంతరం, పెసా మహోత్సవాన్ని అధికారికంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ముక్తా శేఖర్, ఆర్థిక సలహాదారు (MoPR) డా. బిజయ్ కుమార్ బెహేరా, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ మరియు డైరెక్టర్ శ్రీ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు ప్రారంభించారు. అనంతరం రోజంతా పలు కార్యక్రమాలు నిర్వహించారు. క్రాఫ్ట్ బజార్, ఫుడ్ ఫెస్టివల్‌తో కూడిన ప్రదర్శన స్టాళ్లు గిరిజన హస్తకళలు, స్థానిక వంటకాలను ప్రదర్శించాయి. కబడ్డీ, విలువిద్య పోటీలు నిర్వహించగా, కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి.

మధ్యాహ్నం నుంచి వివిధ పెసా రాష్ట్రాల బృందాలతో నిర్వహించిన గిరిజన డెమో క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చోలో, యేడు పెంకులాట, గేడి దౌడ్, రస కాశి, ఉప్పన్న బరెలు, పిథూల్, సికోర్, మల్లఖాంబ, చక్కీ ఖేల్ వంటి సంప్రదాయ ఆటలు ప్రదర్శిస్తూ, గిరిజనుల క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించాయి.

అదే సమయంలో, అల్లూరి సీతారామ రాజు జిల్లా పరిధిలోని 10 పెసా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల బలోపేతం, భూముల అక్రమ ఆక్రమణనల నివారణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, స్వల్ప స్థాయి ఖనిజాలపై నియంత్రణ, సముదాయ వనరులు, చిన్న నీటి వనరుల నిర్వహణ, మత్తు పదార్థాలు, మనీ లెండింగ్‌పై నియంత్రణ వంటి అంశాలతో పాటుగా ప్రాచీన గిరిజన ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరిపారు.

ఈ ఉత్సవాలు బుధవారం (డిసెంబర్ 24) ‘పెసా డే’ ముగింపు వేడుకలతో ముగియనున్నాయి. రెండో రోజున సాంకేతిక సదస్సులు, గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భాగస్వామ్య పాలనను, గ్రామస్థాయి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే సందేశాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి.

 

YouTube: https://www.youtube.com/live/X6EGU9lBmmg?si=UZYMQZaYaXU114nt

Facebook:  https://fb.watch/E9QNp8k3Pm/

Twitter: https://x.com/mopr_goi/status/2003320353259733118?s=20

 

****

GSK/YUP


(రిలీజ్ ఐడి: 2207772) సందర్శకుల సూచీ సంఖ్య : : 81
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Kannada