అణుశక్తి విభాగం
లోక్సభ ఆమోదం తెలిపిన శాంతి బిల్లు-2025కు రాజ్యసభ ఆమోదం
శాంతి బిల్లు ప్రకారం కీలక పదార్ధాలు, వినియోగించిన ఇంధనంపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ..
అణు భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు: డాక్టర్ జితేంద్ర సింగ్
ఆస్పత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాలు, క్యాన్సర్ చికిత్స వరకు దేశ సామాన్యుడి జీవితంలో
అణు శాస్త్రం కీలకమన్న డాక్టర్ జితేందర్ సింగ్
ప్రజా ప్రయోజనాలు, సార్వభౌమాధికారం, భద్రతకు భరోసానిస్తూ
పీఎం మోదీ దార్శనికతతో అణుశక్తి సంస్కరణలకు మార్గం సుగమం
భారతీయ అణు విద్యుత్ కేంద్రాల వద్ద అంతర్జాతీయ పరిమితుల కంటే తక్కువ స్థాయిలోనే రేడియేషన్
క్యాన్సర్ ముప్పు లేదని రాజ్యసభలో వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
18 DEC 2025 7:45PM by PIB Hyderabad
లోక్సభలో ఆమోదం పొందిన సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లు-2025పై కేంద్ర సైన్స్, టెక్నాలజీ, భూ శాస్త్రాల శాఖ, పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని, బిల్లులోని కీలక నిబంధనలను స్పష్టం చేస్తూ, సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అణు భద్రత, దేశ సార్వభౌమాధికారం, ప్రజా జవాబుదారీతనం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ బిల్లు, అణు ఇంధన చట్టం-1962, అణు నష్టానికి పౌర బాధ్యత (సీఎల్ఎన్డీ) చట్టంలోని నిబంధనలను క్రమబద్ధీకరించి, ఏకీకృతం చేస్తుందని, అణుశక్తి నియంత్రణ బోర్డుకు చట్టబద్ధత కల్పిస్తూ, దాన్ని ప్రధాన చట్టంలో భాగంగా చేర్చినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది నియంత్రణ పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తుందని, అణు నిర్వహణలో అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాల పట్ల భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు.
మారుతున్న ప్రపంచ, సాంకేతిక పరిస్థితులపై మాట్లాడుతూ, 2010లో అణు ఇంధన సంస్కరణలపై లేవనెత్తిన అభ్యంతరాలను వాస్తవ పరిస్థితుల దృష్ట్యా పునః సమీక్షించాలని డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. నేడు సాంకేతికత, భద్రతా వ్యవస్థలు, ప్రపంచ ఇంధన అవసరాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, భారత స్మాల్ రియాక్టర్లు పదిహేనేళ్ల కిందట ఊహకందని అంశాలనీ, ఇప్పుడవి 24 గంటల పాటు సురక్షితంగా, సమర్ధవంతంగా విద్యుత్ను అందించే పరిష్కారాలుగా మారుతున్నాయని చెప్పారు.
భద్రతాపరమైన ఆందోళనలను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ, అణు భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదని, వాటి విషయంలో రాజీ పడబోమని, అణుశక్తి చట్టం-1962లో పొందుపరిచిన "ముందుగా భద్రత, తర్వాతే ఉత్పత్తి" వంటి కఠిన సూత్రాల ఆధారంగానే ఉంటాయని వెల్లడించారు. కఠినమైన తనిఖీ విధానాలను వివరిస్తూ, నిర్మాణదశలో త్రైమాసిక తనిఖీలు, నిర్వహణ దశలో ద్వైవార్షిక తనిఖీలు, లైసెన్స్ పునరుద్ధరణకు ఐదేళ్లకొకసారి తనిఖీలు, చట్టబద్ధత పొందిన అణుశక్తి నియంత్రణ మండలికి అదనపు అధికారాలు కల్పించటం, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు దూరంగా భారత్లో అణు విద్యుత్ కేంద్రాలున్నాయని, భారత రియాక్టర్ల రేడియేషన్ స్థాయిలు అంతర్జాతీయ భద్రతా పరిమితులకన్నా చాలా తక్కువగా ఉన్నట్లు సభకు తెలియజేశారు.
భారత అణు రియాక్టర్ల వల్ల క్యాన్సర్ కారక ప్రభావాలుంటాయనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. కూడంకుళం, కల్పక్కం, రావత్ బటా, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాల వద్ద రేడియేషన్ ఉద్గారాల గణాంకాలను మైక్రో సీవర్ట్స్లో చెబుతూ.. అనుమతించిన పరిమితుల కంటే తక్కువగానే రేడియేషన్ స్థాయిలున్నట్లు వెల్లడించారు. అణురంగంలో సైబర్ భద్రతా ప్రమాణాలను భారత్ గణనీయంగా మెరుగుపరిచిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ దాడులను ఎదుర్కోవటానికి ఎన్క్రిప్షన్, సురక్షిత కోడింగ్, రెగ్యులర్ ఆడిట్స్, మాల్వేర్ ఫిల్టరింగ్, వివిధ స్థాయిల్లో డిజిటల్ రక్షణ వంటి అత్యాధునిక సాంకేతికతలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటీకరణపై అపోహలను తొలగిస్తూ, అన్వేషణ కార్యకలాపాల్లో నిర్ణీత నిబంధనల మేరకు ప్రైవేట్ భాగస్వాములను అనుమతించినప్పటికీ, నిర్దేశించిన పరిమితులకు మించి జరిగే యురేనియం మైనింగ్ మాత్రం ప్రభుత్వాధీనంలోనే ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. వినియోగించే ఇంధన నిర్వహణ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పారు. ఇందుకోసం స్పష్టమైన, దీర్ఘకాలిక నిల్వ, నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం అనుసరిస్తుందని వెల్లడించారు. కీలకమైన ముడి సామాగ్రి, విచ్ఛిన్నమయ్యే పదార్థాలు, భారజలం వంటివి కచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని చెప్పారు.
జవాబుదారీతనం, పరిహారం గురించి వివరిస్తూ, చిన్న తరహా పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా ఈ బిల్లులో అంచెలవారీగా బాధ్యతా పరిమితులను ప్రవేశపెట్టినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. బాధితులకు అందే పరిహారంలో ఇది ఎలాంటి కోతలు విధించదని స్పష్టం చేశారు. ఆపరేటర్ బాధ్యతా పరిమితిని దాటి నష్టం జరిగితే, ప్రభుత్వ నిధులు, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా పూర్తి పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని, తద్వారా బాధితులకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. అణు నష్టం నిర్వచనాన్ని పర్యావరణ నష్టానికి విస్తరిస్తూ ఈ బిల్లులో చేర్చినట్లు చెప్పారు.
పౌరుల వివాదాలను వేగంగా పరిష్కరించటానికి అటామిక్ ఎనర్జీ రిడ్రెస్సల్ కమిషన్ ను ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. సివిల్ కోర్టులకు, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లే హక్కును ఇది ఏ మాత్రం ప్రభావితం చేయదని చెప్పారు. అణు వ్యవహారాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి ఈ బిల్లు తప్పిస్తుందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.
సార్వభౌమాధికారం, విదేశీ ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు సమాధానమిస్తూ, భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, సంప్రదాయ బలాలను పణంగా పెట్టకుండా, కేవలం దేశ పరిస్థితులకు సరిపోయే అంతర్జాతీయ అత్యుత్తమ పద్ధతులను మాత్రమే అవలంబిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. శాంతి బిల్లు పౌర అణుశక్తికి మాత్రమే సంబంధించినదని, యురేనియం స్థాయులను కేవలం రియాక్టర్ అవసరాలకు మాత్రమే పరిమితం చేశామని, అణ్వాయుధ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆహార భద్రత, క్యాన్సర్ చికిత్స వంటి రంగాల్లో అణుశాస్త్రం విస్తరిస్తున్న తీరుని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టాటా మెమోరియల్ సెంటర్ వంటి సంస్థల ద్వారా చిన్నారుల్లో ల్యూకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో అణు వైద్యం సాధించిన పురోగతి గురించి చెప్పారు. పరిశోధనల్లో భాగస్వామ్యాన్ని సులభతరం చేయటం ద్వారా ఆవిష్కరణల వేగం పెరుగుతుందన్నారు.
దీర్ఘకాలిక భారత అణు శక్తి రోడ్ మ్యాప్ గురించి వివరిస్తూ, దేశం ఇప్పటికే 9 జీడబ్ల్యూ అణు సామర్థ్యాన్ని సాధించిందని, 2032 నాటికి 22 జీడబ్ల్యూ, 2037 నాటికి 47 జీడబ్ల్యూ, 2042 నాటికి 67 జీడబ్ల్యూ, 2047 నాటికి 100 జీడబ్ల్యూ చేరటమే భారత్ లక్ష్యమని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశ మొత్తం ఇంధన అవసరాల్లో ఇది దాదాపు 10% తీరుస్తుందని ఆయన చెప్పారు. కృత్రిమ మేథ, డిజిటల్ మౌలిక సదుపాయాల పెరుగుదలతో భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు అణుశక్తి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఇతర పునరుత్పాదక ఇంధన వనరులతో పోల్చితే.. విశ్వసనీయమైన, స్వచ్ఛమైన విద్యుత్ను నిరంతరం అణు శక్తి అందిస్తుందని వివరించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగాన్ని ముగిస్తూ.. భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని, శాస్త్రీయ పరిణతిని, ప్రపంచస్థాయిలో పర్యావరణహిత ఇంధన పరివర్తనకు బాధ్యతాయుతమైన నాయకత్వానికి సంసిద్ధతను శాంతి బిల్లు ప్రతిబింబిస్తుందని అన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిబంధనల రూపకల్పనకు భాగస్వాములను సంప్రదిస్తుందని, దేశ అణు శక్తి ప్రయాణం నిరంతరం భద్రత, పారదర్శకత, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతుందని సభ్యులందరికీ హామీ ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2206499)
आगंतुक पटल : 6