ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 17 DEC 2025 1:37PM by PIB Hyderabad

ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ రోజు భారత ప్రధానమంత్రి ప్రసంగించారు. ఇథియోపియాలో తొలి ద్వైపాక్షిక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రికి దక్కిన విశేష గౌరవమిది.

భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారుఅత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

భారత్, ఇథియోపియా మధ్య నాగరికతా సంబంధాలను గుర్తుచేస్తూ.. ఇరు దేశాలు ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక ఆశయాలతో మేళవించాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే, భారత జాతీయ గేయం ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గీతం రెండూ తమ దేశాన్ని తల్లిగా వర్ణిస్తాయని ఆయన చెప్పారు. రెండు దేశాల ఉమ్మడి పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. 1941లో తమ విముక్తి కోసం ఇథియోపియన్లతో కలిసి పోరాడిన భారత సైనికుల సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇథియోపియా ప్రజల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన అడ్వా విజయ స్మారకం వద్ద నివాళి అర్పించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

భారత్ - ఇథియోపియా భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ విషయంలో ఇథియోపియా వికాసం, శ్రేయస్సు కోసం భారతీయ ఉపాధ్యాయులు, వ్యాపార సంస్థల సహకారాన్ని ఆయన గుర్తు చేశారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, సృజనాత్మక రంగాలు సహా భారత అభివృద్ధి అనుభవాలను ఆయన వివరించారు. ఇథియోపియా ప్రాధమ్యాలకు అనుగుణంగా ఆ దేశానికి అభివృద్ధిపరంగా చేయూతను కొనసాగించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ‘వసుధైవ కుటుంబకం’ అనే సూత్రంలో వివరించినట్టుగా.. సర్వ మానవాళి సేవకూ భారత్ కట్టుబడి ఉందని చెబుతూ.. కోవిడ్ విపత్తు సమయంలో ఇథియోపియాకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం భారత్‌కు దక్కిన గౌరవమన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఇథియోపియా.. కలిసి నిలబడి ఆ దేశాల గళాన్ని మరింత బలంగా వినిపించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటాన్ని బలోపేతం చేయడంలో సంఘీభావం తెలిపిన ఇథియోపియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆఫ్రికా ఐక్యతా స్వప్నాన్ని సాకారం చేయడంలో ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయమైన అడిస్ అబాబా కీలక పాత్రను వివరిస్తూ... భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పదకొండేళ్ల తన ప్రభుత్వ హయాంలో భారత్ – ఆఫ్రికా సంబంధాలు అనేక రెట్లు పెరిగాయని, అలాగే దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల స్థాయిలో రెండు దేశాల మధ్య వందకు పైగా పర్యటనలు జరిగాయని ఆయన తెలిపారు. ఆఫ్రికా అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆఫ్రికాలోని పది లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం కోసం ‘ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్’ను ప్రారంభించడంపై జోహన్నెస్‌బర్గ్ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తాను చేసిన ప్రతిపాదనను భారత ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

భారత ప్రస్థానాన్ని తోటి ప్రజాస్వామ్య దేశంతో పంచుకునే అవకాశాన్నిచ్చిన గౌరవ స్పీకర్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ భవితను తామే లిఖించుకుంటున్నాయన్నారు.


(రిలీజ్ ఐడి: 2205627) సందర్శకుల సూచీ సంఖ్య : : 43