కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కర్నాటక లోని అథానీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
బెళగావి గడ్డ మీద మారుమోగిన పరాక్రమం, ఆత్మగౌరవం, అజేయ సాహసాల అమర గాథ : శ్రీ సింధియా
प्रविष्टि तिथि:
14 DEC 2025 6:16PM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ 25 అడుగుల భారీ విగ్రహాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా కర్నాటక లో బెళగావి జిల్లా అథానీలో ఆదివారం ఆవిష్కరించారు.
ఇది చరిత్రాత్మక సందర్భమని మంత్రి చెబుతూ, ఇది ఒక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రమే కాదనీ, ఇది భారత ఆత్మగౌరవం, ధైర్య సాహసాలు, హైందవీ స్వరాజ్ చేతనత్వాన్ని భావి తరాల వారి చెంతకు చేర్చాలన్న పవిత్ర సంకల్పం కూడా అనీ స్పష్టం చేశారు.
‘‘జై భవానీ, జై శివాజీ’’ ఉద్ఘోషలు ఈనాటికీ మన దేశంలో ప్రతి ఒక్కరిలో నిర్భయత్వాన్నీ, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన భావననీ, ఆత్మగౌరవ శక్తినీ నింపుతున్నాయని శ్రీ సింధియా అన్నారు.
ఈ కార్యక్రమంలో మంజునాథ్ భారతీ స్వామీజీ, సంభాజీ భిడే గురూ జీ, కర్నాటక ప్రభుత్వ మంత్రులు శ్రీ సంతోష్ లాడ్, శ్రీ సతీశ్ జార్కిహోలీ, కర్నాటక మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ లక్ష్మణ్ సవాదీ, కొల్హాపూర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీమంత్ శాహూ ఛత్రపతి మహారాజ్, కర్నాటక ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీమంత్ బి. పాటిల్తో పాటు పీజేఆర్ సింధే సహా ఇతర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్: హైందవీ స్వరాజ్ మార్గదర్శి, జాతీయ కర్తవ్య ప్రతీక
పదిహేనేళ్ల చిన్న వయసులోనే హైందవీ స్వరాజ్ను స్థాపించడానికి ప్రతిజ్ఞ స్వీకరించిన శివాజీ మహారాజ్ జీవనాన్నీ, సంఘర్షణల్నీ కేంద్ర మంత్రి తన ప్రసంగంలో స్మరించుకున్నారు. శివాజీ మహారాజ్ సాటి లేని ధైర్య, సాహసాలతో, వ్యూహాత్మక కౌశలంతో, దూరదృష్టి కలిగిన నాయకత్వంతో ఆక్రమణదారుల్ని ఓడించి, భారత ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు.
శివాజీ మహారాజ్ పరాక్రమమానికి బెళగావి, అథానీ ప్రాంతాలు సాక్షులుగా ఉన్నాయని కేంద్ర మంత్రి శ్రీ సింధియా అన్నారు. ఆయన దక్షిణ భారతదేశంలో ఉద్యమాల్ని నడిపిన కాలంలో, ఈ గడ్డకు ఎనలేని వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందనీ, ఇక్కడి నుంచే దక్కన్, కొంకణ్లతో పాటు గోవా మార్గాల భద్రతకు మార్గం సుగమం అయిందన్నారు. ఈ రోజు ఈ గడ్డ మీద శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చరిత్ర, సంప్రదాయం, వర్తమానాలు కలబోసుకున్న సంతోషదాయక సన్నివేశమని ఆయన అన్నారు.
‘‘ఈ రోజు, బెళగావి గడ్డ మీద, పరాక్రమం, ఆత్మగౌరవం, ఎనలేని ధైర్య సాహసాల అమర గాథ ప్రాణం పోసుకుంది’’ అని ఆయన వర్ణించారు.
శివాజీ మహారాజ్ నుంచి స్ఫూర్తిని అందుకొని ముందడుగు వేస్తున్న ఆధునిక భారత్: శ్రీ సింధియా
ఆత్మాభిమానం, సాంస్కృతిక పునరుజ్జీవనాల మార్గంలో భారత్ ముందుకు సాగిపోతున్న వేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ నడవడికకూ, ఆయన ఆదర్శాలకూ సందర్భశుద్ధి మరింత పెరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, వికసిత్ భారత్ దార్శనికత, స్వావలంబన, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్న చేతన దేశం నలుమూలలకూ విస్తరిస్తున్నాయనీ, దీనికి మూలాలు శివాజీ మహారాజ్ ఆలోచనాస్రవంతిలో ఉన్నాయనీ కేంద్ర మంత్రి అన్నారు.
దేశ హితమే అన్నింటి కన్నా మిన్న, సాహసం ఎన్నటికీ అంతరించిపోదనీ, స్వరాజ్ స్ఫూర్తి ఎప్పటికీ పాతబడిపోదనే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తూ, భావి తరాల్లో స్ఫూర్తిని నింపుతుందని కూడా శ్రీ సింధియా అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ సింధియా మహారాష్ట్ర, కర్నాటకలలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. కొల్హాపూర్లోని బాంబే జింఖానా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక తపాలా బిళ్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఆ తరువాత, గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో గ్రామీణ డాక్ సేవకులతో ఆయన మాట్లాడారు. ఆదివారం, ఆయన బెళగావిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2204201)
आगंतुक पटल : 14