హోం మంత్రిత్వ శాఖ
గుజరాత్లోని అహ్మదాబాద్లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ నిర్వహించిన ‘ప్రముఖ్ వర్ణి అమృత మహోత్సవ్’లో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సబర్మతీ తీరాన ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితాన్ని ప్రదర్శించి నిజాయతీగా జీవించాలనే స్ఫూర్తిని ప్రజల్లో నింపిన బీఏపీఎస్
ఆధ్యాత్మికతను, వైష్ణవ తత్వాన్ని బోధించిన ప్రముఖ్ స్వామి మహారాజ్
ప్రతి జీవి పట్ల కరుణతో ఉండాలనే వేల ఏళ్ల సంప్రదాయాన్ని పునురుద్దరించిన ప్రముఖ్ స్వామి మహరాజ్
సాధు జీవితానికి ఆదర్శవంతమైన నమూనాను అందించిన ప్రముఖ్ స్వామి మహారాజ్
వెన్నెముకను దానం చేసిన రుషి దధీచి నుంచి సమాజ సంక్షేమ కార్యక్రమాల వరకు.. సబర్మతీ తీరం సాధువుల అంకితభావానికి కేంద్రంగా ఉంది
సమాజంలో విద్యను ప్రోత్సహించడానికి, సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వామి నారాయణ్ సంస్థ
प्रविष्टि तिथि:
07 DEC 2025 9:39PM by PIB Hyderabad
గుజరాత్లోని అహ్మదాబాద్లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ నిర్వహించిన ‘ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘ్వి పాల్గొన్నారు.
ప్రముఖ్ స్వామి మహరాజ్ చేసిన కార్యాలను, ఆధ్యాత్మిక జ్ఞాపకాలను, అనంతమైన సద్గుణాలను మాటల్లో వర్ణించలేమని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తూ.. సబర్మతీ నదీ తీరాన ‘ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్’ను బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ ఈ రోజు నిర్వహిస్తోందని చెప్పారు. సబర్మతీ తీరాన ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితాన్ని తెలియజేస్తూ.. నిజాయతీగా జీవించాలని ప్రజలకు బీఏపీఎస్ సంస్థ స్ఫూర్తినిస్తోందని తెలియజేశారు. ఆయన అనుసరించిన ఆధ్యాత్మికతను, వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా.. దానిని ఆచరించే అపూర్వమైన పనిని సైతం పూర్తి చేశారన్న విషయం తెలుసుకోవడం ద్వారానే అయినప్పటికీ ప్రముఖ్ స్వామి మహారాజ్ మొత్తం జీవితాన్ని, సేవలను అర్థం చేసుకోగలమని వివరించారు. ఒక్క అక్షరాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేకుండా.. ఆచరణతోనే ఆధ్యాత్మికతను సేవతో ముడిపెట్టి ‘నరుడే నారాయణుడు’ అనే వేద సూత్రానికి ఉదాహరణగా నిలిచారన్నారు.
ప్రతి జీవి పట్ల కరుణ ప్రదర్శించాలనే వేల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ప్రముఖ్ స్వామి మహారాజ్ పునరుద్ధరించారని శ్రీ అమిత్ షా అన్నారు. ఆయన వైష్ణవ వర్గానికి మాత్రమే తన సేవలను పరిమితం చేయలేదని, ఎలాంటి లోపాలు లేని తన ప్రవర్తనతో వివిధ వర్గాలకు చెందిన సాధువుల, మహంతుల మధ్య సామరస్యాన్ని, సమన్వయాన్ని ప్రోత్సహించారన్నారు. తద్వారా మొత్తం సనాతన ధర్మానికి గణనీయమైన సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం సాధు సమాజం, సన్యాసుల ఆచారాల పట్ల గౌరవ భావం క్రమంగా క్షీణించిందని తెలిపారు. దానిని స్వచ్ఛత, ప్రవర్తనతో ప్రముఖ్ స్వామి మహారాజ్, ఆయన సారథ్యంలో వేలాది మంది సాధువులు దానిని పునరుద్ధరించారని తెలిపారు.
సనాతన ధర్మం సాగించిన వేల ఏళ్ల ప్రయాణంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. అయితే స్వాతంత్ర్యానంతరం సాధువులు, సన్యాసులకు ఇచ్చే గౌరవం తగ్గుతుండటం అతి పెద్ద సంక్షోభమని చెప్పారు. దీనిని పునరుద్ధరించిన ఘనత ప్రముఖ్ స్వామి మహారాజ్కు, బీఏపీఎస్ సంస్థకు దక్కుతుందని తెలిపారు. ఏ వర్గంతోనూ వివాదం లేకుండా, సన్యాసిగా, సాధువుగా లేదా సాధు జీవితం ఎంత స్వచ్ఛంగా, పవిత్రంగా, గొప్పగా ఉండాలో తన ప్రవర్తన ద్వారా ప్రముఖ్ స్వామి మహారాజ్ ఉదాహరణగా నిలిచారని శ్రీ షా అన్నారు. సనాతన ధర్మం నిత్యం అందించే జ్ఞానం జీవితానికి ఎలా ఆధారంగా నిలుస్తుందో ఆయన నిరూపించారు. దాని నుంచి స్వీకరించిన జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఆడంబరం లేకుండా పంచిపెట్టారు. దీనిని జీవితాంతం ఆయన సాధన చేశారు.
సామాజిక జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులకు, సనాతన ధర్మానికి ఆయన జీవితాంతం విద్యార్థిగానే ఉన్నారని శ్రీ అమిత్ షా తెలిపారు. స్వాతంత్ర్యానంతరం ప్రజల హృదయాల్లో విశ్వాసం క్షీణించడమనే పెద్ద సమస్య సనాతన ధర్మానికి, సాధువులు, సన్యాసుల సంప్రదాయానికి ఎదురైందని ఆయన అన్నారు. దీనిని ప్రముఖ్ స్వామి మహారాజ్ పరిష్కరించారని తెలిపారు. ఈ విషయంలో ఆయన ఒక్క మాట కూడా బోధించకుండా.. తన ప్రవర్తన, వేలాది మంది సాధువుల సాయంతో సాధించారన్నారు. సనాతన ధర్మంలోని సన్యాసులకు సార్వత్రికంగా ఆమోదం పొందిన మార్గాన్ని వేసి.. వారికి మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడారు.
సాధువులు నడయాడిన చరిత్ర పవిత్ర సబర్మతీ నదీ తీరానికి ఉందని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. తన వెన్నెముకను దానం చేసిన రుషి దధీచి నుంచి.. సామాజిక సంక్షేమ కార్యక్రమాల వరకు సాధువుల నిబద్దతకు సాక్ష్యంగా సబర్మతీ తీరం నిలించిందని వివరించారు. ఈ సబర్మతీ తీరం నుంచే అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలను ఉపయోగించి ప్రపంచంలోనే తిరుగులేని రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని చెప్పారు. అహ్మదాబాద్లోని అంబ్లీవాలి పోల్ గుడిలో 1950లో బీఏపీఎస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు ప్రముఖ్ స్వామి మహారాజ్ అంగీకరించారని తెలియజేశారు. 1950 నుంచి 2016 వరకు ఆయన చేసిన కృషి స్వామి నారాయణ్ సంస్థకు మాత్రమే కాకుండా.. దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంబ్లీవాలీ పోల్, షాపూర్ ప్రాంతాల గురించి సాధువులు తమ ప్రసంగాల్లో ఎక్కువ ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం అంబ్లీవాలీ పోల్ ఖ్యాతి గుజరాత్కు మాత్రమే పరిమితం కాకుండా.. దేశమంతా వ్యాపిస్తుందని, ప్రపంచానికి మరచిపోలేని పుణ్యక్షేత్రంగా మారుతుదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సన్యాస జీవితాన్ని స్వీకరించిన యువ సాధువు యోగీజీ మహారాజ్ను తన వారసుడిగా శాస్త్రీజీ మహారాజ్ ఎంపిక చేసిన ప్రదేశం. గురువు తన శిష్యుడిని పరీక్షించిన, శిష్యుడు తన సర్వస్వాన్ని గురువు పాదాల ముందు ఉంచిన ప్రదేశం. అహంకారం, సామాజిక బేధం లేకుండా ధర్మానికి, ప్రపంచ సంక్షేమానికి అంకితమయ్యే ప్రధాన బాధ్యతను ప్రముఖ్ స్వామి మహారాజ్కు అప్పగించిన ప్రదేశం. ఇది సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి పవిత్ర పుణ్యతీర్థంగా మారుతుందనే విశ్వాసాన్ని శ్రీ అమిత్ షా వ్యక్తం చేశారు.
విద్యను ప్రోత్సహించడానికి, సామాజిక రుగ్మతలను తొలగించడానికి స్వామి నారాయణ్ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అదే స్ఫూర్తితో రూపొందించారు. ఇది సాధువుల జీవితం ఎలా ఉండాలో, వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనకు బోధిస్తుంది.
(रिलीज़ आईडी: 2200670)
आगंतुक पटल : 3