ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· మన స్వాతంత్ర్యోద్యమాన్ని ఉత్తేజితం చేసిన వందేమాతరం
· వందేమాతరం 150 ఏళ్ల వేడుకలో పాల్గొనడం మనందరికీ గర్వకారణం
· మన స్వాతంత్ర్య సమరయోధుల స్వప్నాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి మందేమాతరం
· వేల ఏళ్లుగా దేశంలో బలంగా వేళ్లూనుకుని ఉన్న భావనను పునరుత్తేజపరిచిన వందేమాతరం
· వేల ఏళ్ల సాంస్కృతిక శక్తి, స్వతంత్రతా సంకల్పం, స్వతంత్ర భారత లక్ష్యాన్ని ప్రతిధ్వనించిన వందేమాతరం
· మన స్వతంత్రోద్యమ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా.. ప్రజల్లో విశేష ఆదరణ పొందిన వందేమాతరం
· స్వాతంత్ర్యోద్యమంలో జవసత్వాలను నింపి, దిశానిర్దేశం చేసిన వందేమాతరం
· స్వేచ్ఛ, త్యాగం, స్వచ్ఛత, అంకితభావం, ఉత్తేజం... అన్నింటికీ ప్రేరణగా నిలిచిన సర్వవ్యాప్త మంత్రం వందేమాతరం: ప్రధాని
प्रविष्टि तिथि:
08 DEC 2025 3:44PM by PIB Hyderabad
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘‘చరిత్రలోని అనేక స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు మరోసారి మన ఎదుట ఆవిష్కృతమవుతున్న సమయమిది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవలే భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని సగర్వంగా నిర్వహించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దేశం వారిని స్మరించుకుంటోందన్నారు. ఇటీవలే 350వ బలిదాన దినం రోజున గురు తేగ్ బహదూర్ను కూడా మనం స్మరించుకున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ గేయం ఐక్యతా శక్తిని సభ అనుభూతి చెందుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం అనేక మైలురాళ్లను దాటిందన్నారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తిచేసుకునే నాటికి దేశం ఇంకా వలస పాలనలోనే ఉండిపోయిందన్న శ్రీ మోదీ.. ఆ గేయానికి వందేళ్లు పూర్తయ్యే నాటికి ఎమర్జెన్సీ సంకెళ్లతో దేశంలో నిర్బంధం నెలకొన్నదని గుర్తుచేశారు. వందేమాతర శతాబ్ది ఉత్సవాల వేళ నాటి పాలకులు భారత రాజ్యాంగం గొంతు నొక్కారన్నారు. వందేమాతరానికి వందేళ్లు పూర్తయిన వేళ.. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేసిన వారిని నాటి పాలకులు జైల్లో పెట్టారన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన ఆ గేయానికి వందేళ్లు పూర్తయిన సమయంలోనే.. దురదృష్టవశాత్తు దేశంలో ఓ చీకటి అధ్యాయం మొదలైందని, ప్రజాస్వామ్యం ఒడుదుడుకులకు లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆ గొప్ప అధ్యాయాన్ని పునర్లిఖించేందుకు, ఆ ఘనకీర్తిని పునరుద్ధరించేందుకు.. వందేమాతర 150 ఏళ్ల వేడుక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. సభ గానీ, దేశం గానీ ఈ సందర్భాన్ని వదులుకోకూడదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ‘వందేమాతరం’ వల్లే 1947లో దేశం స్వాతంత్ర్యం సాధించిందని, ఉద్యమానికి చోదకంగా నిలిచిన భావోద్వేగాలు ఆ నినాదంలో ప్రతిధ్వనించాయని ఆయన వివరించారు.
150 ఏళ్ల వందేమాతరంపై తాను చర్చను ప్రారంభిస్తున్న వేళ.. అధికార, ప్రతిపక్షాలన్న తేడా ఉండబోదని ప్రధానమంత్రి చెప్పారు. స్వాతంత్ర్యోద్యమ నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించి ముందుకు నడిపిన ‘వందేమాతరం’ రుణాన్ని తీర్చుకునేందుకు ఈ చర్చలో పాల్గొనేవారందరికీ ఇది సరైన సమయమని వ్యాఖ్యానించారు. దాని ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించి, అందరికీ ఇప్పుడు సభలో భాగస్వాములయ్యే అవకాశం లభించిందన్నారు. ఇది పార్లమెంటు సభ్యులు, ప్రతినిధులందరూ వందేమాతరానికి రుణపడి ఉన్నామని అంగీకరించాల్సిన పవిత్ర సందర్భమన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాలను ఏకం చేసి దేశం మొత్తం ఒకే గొంతుకగా స్వతంత్రం కోసం పోరాడే స్ఫూర్తిని వందేమాతరం ఇచ్చిందని, మరోసారి ఆ స్ఫూర్తి మనకు మార్గనిర్దేశం చేయాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తితో ఉత్తేజాన్ని పొంది, స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసుకునేలా అందరూ సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. స్వావలంబనతో కూడిన దేశ నిర్మాణంతోపాటు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేందుకు ఇది మంచి అవకాశమని ఆయన స్పష్టం చేశారు.
1875లో బంకించంద్ర చటర్జీ వందేమాతర ప్రస్థానాన్ని ప్రారంభించారని శ్రీ మోదీ అన్నారు. 1857 స్వాతంత్ర్య పోరాటానంతరం.. బ్రిటిష్ సామ్రాజ్యం అస్థిరంగా ఉండి, తీవ్ర ఒత్తిళ్లతో భారత్ను వంచనకు గురిచేస్తూ భారతీయులను బలవంతంగా లొంగదీసుకోవాలని చూస్తున్న సమయంలో ఈ గేయాన్ని రచించారని ఆయన వివరించారు. ఆ సమయంలో బ్రిటిష్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను దేశంలోని ప్రతి ఇంటికీ వ్యాప్తి చేసేలా కుట్ర పన్నారని ప్రధానమంత్రి చెప్పారు. అప్పుడే బంకిం దా ఒక సవాలు విసిరారని, ధీటుగా ప్రతిస్పందించారని శ్రీ మోదీ అన్నారు. ఆ ధిక్కరణ నుంచే ‘వందేమాతరం’ పుట్టిందని తెలిపారు. కొన్నేళ్ల తర్వాత 1882లో బంకించంద్ర ‘ఆనంద మఠ్’ గ్రంథాన్ని రాసే సమయంలో ఈ గేయాన్ని అందులో చేర్చారని తెలిపారు.
వేల ఏళ్లుగా భారతదేశ నరనరాల్లో వేళ్లూనుకున్న భావాలను వందేమాతరుం పునరుజ్జీవింపజేసిందన్న ప్రధానమంత్రి.. అదే భావోద్వేగం, అవే విలువలు, అదే సంస్కృతి, అదే సంప్రదాయాన్ని అద్భుతమైన పదాలతో, ఉన్నతమైన స్ఫూర్తితో వందేమాతరం ద్వారా దేశానికి రచయిత బహూకరించారని కొనియాడారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛనో, లేదా బ్రిటిష్ వారిని తరిమేసి సొంత బాట వేసుకునే మంత్రమో మాత్రమే కాదని, వాటికి అతీతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం మాతృభూమి స్వేచ్ఛ కోసం, భరతమాత బంధ విముక్తి జరిగిన పవిత్ర పోరాటం కూడా అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వందేమాతర నేపథ్యాన్ని, దాని విలువల స్రవంతిని మనం పరిశీలిస్తే.. వేదకాలం నుంచి పరంపరగా వస్తున్న సత్యం మనకు సాక్షాత్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరం అని మనం నినదించిన వేళ.. ‘ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడిని’ అన్న వేద ప్రకటన మనకు స్ఫురిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
లంకా వైభవాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ, ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని పలికిన శ్రీరామచంద్రుడి మాటల్లోనూ ఇదే భావన ప్రతిధ్వనించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ గొప్ప సంస్కృతీ సంప్రదాయానికి ‘వందేమాతరం’ ఆధునిక ప్రతిరూపమని వివరించారు.
బంకిం దా వందేమాతరాన్ని రచించిన సమయంలో అది సహజంగానే స్వాతంత్ర్యోద్యమ స్వరంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. వందేమాతరం ప్రతీ భారతీయుడి హృదయస్పందనగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని వందేమాతరం ప్రతిధ్వనిస్తుందని, స్వాతంత్ర్య స్ఫూర్తి ఆ గేయంలో ఉందని, స్వతంత్ర భారత లక్ష్యాన్ని కూడా అది నిర్దేశించిందని... కొన్ని రోజుల కిందట ‘150 ఏళ్ల వందేమాతరం’ సందర్భంగా తాను చెప్పిన మాటలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ కాలంలో భారతదేశాన్ని బలహీనమైనదిగా, అసమర్థమైనదిగా, భారతీయులను బద్ధకస్తులుగా, నిష్క్రియాపరులుగా చిత్రీకరించే ధోరణి పుట్టుకొచ్చిందనీ.. కొందరు విద్యావంతులు కూడా వలస పాలన ప్రభావం కారణంగా అదే రకమైన భాషను వినియోగించారని ఆయన అన్నారు. బంకిం దా ఈ న్యూనతా భావాన్ని తొలగించి, వందేమాతరం ద్వారా భారత శక్తి స్వరూపాన్ని ఆవిష్కరించారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భరతమాతను విజ్ఞానానికి, సంపదలకు అధిదేవతగానూ, శత్రువులపై ఆయుధాలు ఝళిపించే ఉగ్ర చండికగానూ బంకిం దా తన గేయంలో అభివర్ణించారని శ్రీ మోదీ అన్నారు.
బానిసత్వపు నైరాశ్యంలో ఉన్న భారతీయులకు ఈ మాటలు, భావాలు, ఈ స్ఫూర్తి ధైర్యాన్నిచ్చాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యోద్యమం ఓ భూభాగం కోసమో, కేవలం అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం కోసమో కాదనీ.. వలసవాద సంకెళ్లను తెంచుకుని గొప్ప సంప్రదాయాలు, వైభవోపేతమైన సంస్కృతిని, గర్వకారణమైన వేల ఏళ్ల చరిత్రను పునరుజ్జీవింపజేసుకోవడం కోసమనీ లక్షలాది భారతీయులు వందేమాతర గేయం ద్వారా గ్రహించారని ప్రధానమంత్రి వివరించారు.
జనసామాన్యంలో వందేమాతరానికి ఉన్న విశేష ఆదరణ సుదీర్ఘ స్వాతంత్ర్యోద్యమ గాథగా వెల్లడైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సింధు, సరస్వతి, కావేరి, గోదావరి, గంగ, యమునా.. ఏ నదిని తీసుకున్నా సాంస్కృతిక వాహిని అందులో భాగంగా ఉంటుందని, అభివృద్ధి విశేషాలూ, మానవ జీవనంపై ప్రభావమూ అందులో ఉంటాయని వ్యాఖ్యానించారు. అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రతి దశా వందేమాతరం స్ఫూర్తితో ముందుకు సాగిందని, దాని లక్ష్యాలు ఆ భావనను పెంపొందించాయని శ్రీ మోదీ చెప్పారు. మొత్తం స్వతంత్ర ప్రస్థానమూ వందేమాతర ఉద్వేగాలతో ముడిపడి ఉన్న ఇలాంటి కవితాత్మక వ్యక్తీకరణ.. బహుశా ప్రపంచంలో మరెక్కడా కనిపించకపోవచ్చని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో ఎక్కువ కాలం ఉండడం, తమ కలలు నెరవేర్చుకోవడం కష్టమని 1857 తర్వాత బ్రిటిష్ వారికి తెలిసొచ్చిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని విభజించకపోతే, ప్రజలు తమలో తాము కలహించుకునేలా చేయకపోతే, ఇక్కడ పాలించడం అసాధ్యమని వారు భావించారన్నారు. బ్రిటిష్ వారు బెంగాలును ప్రయోగశాలగా మార్చి, విభజించి పాలించే మార్గాన్ని ఎంచుకున్నారున్నారు. ఆ సమయంలో బెంగాల్ మేధో శక్తి దేశానికి దిశానిర్దేశం చేస్తూ బలాన్నీ, స్ఫూర్తినీ ఇచ్చిందని, దేశ సమష్టి శక్తికి కేంద్ర బిందువుగా నిలిచిందని వారికి తెలుసు కాబట్టే అక్కడి నుంచి ఈ ప్రయోగాలను మొదలుపెట్టారన్నారు. బెంగాల్ విభజన జరిగితే దేశం కూడా విచ్ఛిన్నమవుతుందని, తమ పాలనను కొనసాగించుకోవచ్చని బ్రిటిష్ వారు విశ్వసించారనీ.. అందుకే వారు మొదట బెంగాల్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ప్రధానమంత్రి చెప్పారు. 1905లో బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించే దుస్సాహసానికి పాల్పడిన వేళ.. వందేమాతరమే అడ్డుగోడలా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. బెంగాల్ ఐక్యత కోసం వందేమాతరం ప్రతి వీధిలో ప్రతిధ్వనించిందని, ప్రజలను ఉత్తేజపరిచే నినాదంగా మారిందని అన్నారు. బెంగాల్ విభజనతో బ్రిటిష్ వారు భారత్ను బలహీనపరిచేందుకు విబజన బీజాలను నాటేందుకు ప్రయత్నించారని ప్రధానమంత్రి చెప్పారు. కానీ, వందేమాతర నినాదం ఒకే గొంతుకగా, ఐక్యతా సూత్రంగా మారి.. బ్రిటిష్ వారిని సవాలు చేసిందనీ, దేశ శక్తికి పునాదిగా నిలిచిందని వివరించారు.
బెంగాల్ విభజన జరిగినప్పటికీ.. అదొక భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసిందని, ఆ సమయంలో వందేమాతరం ప్రతిచోటా ప్రతిధ్వనించిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ సృష్టించిన ఆ భావోద్వేగాల శక్తిని బ్రిటీష్ వారు గ్రహించారని చెప్పారు. ఆయన పాట బ్రిటిష్ వారి పునాదులను కదిలించడంతో వందేమాతరంపై చట్టపరమైన నిషేధాలు విధించేలా చేసిందని అన్నారు. వందేమాతరం ఆలపిస్తే శిక్ష, ముద్రించినా శిక్ష, ఆ మాట పలికినా కూడా కఠిన చట్టాల ప్రకారం శిక్ష విధించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటానికి వందలాది మంది మహిళలు నాయకత్వం వహించి సహకరించారని ఆయన పేర్కొన్నారు. వందేమాతరం పాడినందుకు అత్యంత దారుణాలు జరిగిన బారిసాల్ ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. వందేమాతరం గౌరవాన్ని కాపాడటానికి బారిసాల్లో తల్లులు, సోదరీలు, పిల్లలు ముందుకు వచ్చారని చెప్పారు. ధైర్యవంతురాలైన సరోజిని ఘోష్ గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. వందేమాతరంపై నిషేధం ఎత్తివేసే వరకు ఆమె తన గాజులు తీసివేసి, మళ్లీ ధరించనని ప్రకటించారని, ఆ కాలంలో ఆ ప్రతిజ్ఞకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు కూడా వెనుకబడలేదని, చిన్న వయస్సులోనే కొరడా దెబ్బలు తిని, జైలు పాలైనప్పటికీ, బ్రిటీష్ వారిని ధిక్కరించి ఉదయం ఊరేగింపుల్లో వందేమాతరం జపిస్తూ కవాతు కొనసాగించారని తెలిపారు. బెంగాల్ వీధుల్లో ‘‘ప్రియమైన తల్లీ, నీకు సేవ చేస్తూ వందేమాతరం జపిస్తూ, ప్రాణం పోయినా, ఆ జీవితం ధన్యమైంది’’ అనే అర్థం వచ్చే ఒక బెంగాలీ పాట ప్రతిధ్వనించిందని, అది పిల్లల గొంతుగా మారి దేశానికి ధైర్యాన్ని ఇచ్చిందని ప్రధాని చెప్పారు.
1905లో హరిత్పూర్ గ్రామంలో వందేమాతరం పాడుతున్న చిన్న పిల్లలను దారుణంగా కొరడాలతో చావబాదిన సంఘటనను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. 1906లో నాగ్పూర్లోని నీల్ సిటీ హైస్కూల్ పిల్లలు వందేమాతరాన్ని ఏకధాటిగా జపించి ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారి బలం ద్వారా ఆ మంత్రం శక్తిని నిరూపించారని చెప్పారు. ధైర్యవంతులైన దేశమాత ముద్దు బిడ్డలు తమ చివరి శ్వాసలోనూ వందేమాతరం ఆలపిస్తూ నిర్భయంగా ఉరికొయ్య ఎక్కారని ప్రాధానమంత్రి ప్రస్తావించారు. వారిలో ఖుదీరామ్ బోస్, మదన్లాల్ ధింగ్రా, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, రామకృష్ణ బిశ్వాస్ వంటి లెక్కలేనంత మంది ఉన్నారని అన్నారు. ఈ త్యాగాలు వేర్వేరు జైళ్లలో, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు ముఖాలు, భాషలతో జరిగినప్పటికీ, మంత్రం మాత్రం ఒకటేనని, అదే వందేమాతరరమని, ఇది ఒక గొప్ప భారతదేశానికి ప్రతీక అనీ ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ వారిని సవాలు చేసిన యువ విప్లవకారుల చిట్టగాంగ్ తిరుగుబాటును ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. హరగోపాల్ బాల్, పులిన్ బికాష్ ఘోష్, త్రిపుర్ సేన్ వంటి పేర్లు చరిత్రలో వెలుగొందాయన్నారు. 1934లో మాస్టర్ సూర్య సేన్ను ఉరితీసినప్పుడు ఆయన తన సహచరులకు ఒక లేఖ రాశారని, అందులో వందేమాతరం అనే ఒక్క మాట మాత్రమే ప్రతిధ్వనించిందని ఆయన పేర్కొన్నారు.
శతాబ్దాలుగా లక్షలాది మందిని ఒకే లక్ష్యం వైపు కదిలించిన కవిత లేదా పాట ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదని ప్రధానమంత్రి అన్నారు. దీనిని దేశ ప్రజలు గర్వించాలని చెప్పారు. వలసవాద కాలంలో కూడా భారత్ ఇంత లోతైన భావోద్వేగ గీతాన్ని సృష్టించగల వ్యక్తులను తయారు చేసిందని, ఇది మానవాళికి ఒక అద్భుతమని ప్రపంచం తెలుసుకోవాలని అన్నారు. మనం ఈ విషయాన్ని సగర్వంగా చాటి చెప్పాలని, అప్పుడే ప్రపంచం కూడా దీనిని ఆదరించడం ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. వందే మాతరం స్వేచ్ఛా మంత్రం, త్యాగం మంత్రం, శక్తి మంత్రం, స్వచ్ఛత మంత్రం, అంకితభావం మంత్రం, త్యాగం, తపస్సు మంత్రం, కష్టాలను తట్టుకునే శక్తిని ఇచ్చే మంత్రమని స్పష్టం చేశారు. ఈ మంత్రమే వందేమాతరమని చెప్పారు. ‘‘వేలాది మనసులు ఒకే దరికి చేరుకున్నాయి. వేల మంది జీవితాలు ఒకే విధికి అంకితం అయ్యాయి.. దాని పేరే వందేమాతరం’’ అంటూ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆ కాలంలో వందేమాతరం రికార్డింగులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయని, విప్లవకారులకు ఒక రకంగా పుణ్యక్షేత్రంగా మారిన లండన్లో కూడా అది మార్మోగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. లండన్లోని ఇండియా హౌస్లో వీర్ సావర్కర్ వందేమాతరం పాడుతుండగా ప్రజలు చూశారని, అక్కడ ఈ పాట పదేపదే ప్రతిధ్వనించిందని అన్నారు. దేశం కోసం జీవించడానికి, మరణించడానికి సిద్ధంగా ఉన్న వారికి ఇది గొప్ప స్పూర్తిని రగిలించిందని చెప్పారు. అదే సమయంలో బిపిన్ చంద్ర పాల్, మహర్షి అరబిందో ఘోష్ ఒక వార్తాపత్రికను ప్రారంభించి దానికి 'వందేమాతరం' అని పేరు పెట్టారని, ఎందుకంటే ఆ పాట ఒక్కటే బ్రిటీష్ వారికి నిద్ర పట్టకుండా చేయడానికి సరిపోతుందని తెలిపారు. వార్తాపత్రికలపై బ్రిటీష్ వారు ఆంక్షలు విధించినప్పుడు మేడమ్ భికాజీ కామా పారిస్లో ఒక పత్రాన్ని ప్రచురించి దానికి కూడా ‘‘వందేమాతరం’’ అని పేరు పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘‘వందేమాతరం దేశానికి స్వావలంబన మార్గాన్ని కూడా చూపించింది’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తెలిపారు. ఆ కాలంలో అగ్గిపెట్టెల నుంచి పెద్ద ఓడల వరకు వందేమాతరమనే నినాదాన్ని ముద్రించే సంప్రదాయం విదేశీ కంపెనీలను సవాలు చేయడానికి ఒక మాధ్యమంగా మారిందని, స్వదేశీ మంత్రంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛా మంత్రం స్వదేశీ మంత్రంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.
1907లో వి.ఓ. చిదంబరం పిళ్లై స్వదేశీ కంపెనీ కోసం ఒక ఓడను నిర్మించి దానిపై వందేమాతరం లిఖించిన మరో సంఘటనను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. జాతీయ కవి సుబ్రమణ్య భారతి వందేమాతరాన్ని తమిళంలోకి అనువదించారని, శ్లోకాలను స్వరపరిచారని, వందేమాతరం పట్ల భక్తి తన అనేక దేశభక్తి గీతాలలో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత జెండా పాటను కూడా భారతి రాశారని, అది వందేమాతరంతో లిఖించిన జెండాను వివరిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఓ దేశభక్తులారా.. చూడండి, గౌరవంగా వందనం చేయండి, నా తల్లి దివ్య జెండాకు నమస్కరించండి’’ అంటూ తమిళ పద్యంలోని ఓ భాగాన్ని ఆయన చదివి వినిపించారు.
వందేమాతరంపై మహాత్మా గాంధీ భావాలను సభ మీద తెలియజేయాలనుకుంటున్నట్లు ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రచురించే 'ఇండియన్ ఒపీనియన్' అనే వారపత్రికలో మహాత్మా గాంధీ 1905 డిసెంబర్ 2న రాసిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బంకిమ్ చంద్ర రచించిన వందేమాతరం బెంగాల్ అంతటా బాగా ప్రాచుర్యం పొందిందని, స్వదేశీ ఉద్యమ సమయంలో లక్షలాది మంది ప్రజలు ఆయన పాటను పాడే భారీ సమావేశాలు నిర్వహించినట్లు గాంధీజీ అందులో పేర్కొన్నట్లు ప్రధాని తెలిపారు.ఈ పాట ఎంతగానో ప్రజాదరణ పొందిందని, అది దాదాపు జాతీయ గీతంలా మారిందని గాంధీజీ చెప్పిన మాటలను ప్రస్తావించారు. దాని భావోద్వేగాలు గొప్పవని, ఇతర దేశాల పాటల కంటే మధురమైనవని, మనలో దేశభక్తిని మేల్కొల్పడమే దాని ఏకైక ఉద్దేశ్యమని గాంధీజీ రాశారన్నారు. దేశాన్ని తల్లిగా భావిస్తూ, ఆమెను పూజించడాన్ని ఈ పాట వర్ణిస్తుందని మహాత్మాగాంధీ వివరించారని ప్రధానమంత్రి తెలిపారు.
1905లో మహాత్మాగాంధీ జాతీయ గీతంగా భావించిన వందేమాతరం.. దేశంలోనూ, విదేశాలలోనూ ప్రతి భారతీయుడికి అపారమైన బలాన్నిచ్చిన వందేమాతరం.. గత శతాబ్దంలో తీవ్ర అన్యాయానికి గురైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వందేమాతరానికి ఎందుకు ఇంత ద్రోహం జరిగిందో, ఎందుకు ఇంత అన్యాయం జరిగిందో, పూజ్య బాపు మనోభావాలను కూడా కప్పిపుచ్చి, పవిత్రమైన ఈ గేయాన్ని వివాదంలోకి లాగిన శక్తులు ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్న ఈ సందర్భంగా.. ఈ ద్రోహానికి దారితీసిన పరిస్థితుల గురించి రాబోయే తరాలకు తెలియజేయడం మన కర్తవ్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. వందేమాతరంపై ముస్లిం లీగ్ వ్యతిరేక రాజకీయాలు తీవ్రమవుతున్నాయని, 1937 అక్టోబర్ 15న లక్నో నుంచి మహమ్మద్ అలీ జిన్నా వందేమాతరానికి వ్యతిరేకంగా నినాదం ఇచ్చారని గుర్తు చేశారు. ముస్లిం లీగ్ నిరాధార ప్రకటనలను గట్టిగా వ్యతిరేకించి, వాటిని ఖండించడానికి బదులుగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ, ఆయన పార్టీ వందేమాతరాన్ని ప్రశ్నించడం ప్రారంభించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జిన్నా వ్యతిరేకించిన కేవలం అయిదు రోజుల తర్వాత 1937 అక్టోబర్ 20న నేతాజీ సుభాష్ చంద్రబోస్కు జవహర్ లాల్ నెహ్రూ ఒక లేఖ రాశారని.. జిన్నా భావాలతో ఏకీభవిస్తూ, వందేమాతరంలోని ‘‘ఆనంద్ మఠం’’ నేపథ్యం ముస్లింలను అసహనానికి గురిచేయవచ్చని పేర్కొన్నారని పేర్కొన్నారు. ‘‘నేను వందేమాతరం పాట నేపథ్యాన్ని చదివాను. ఈ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను’’ అంటూ నెహ్రూ అన్న మాటలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
దీని తరువాత 1937 అక్టోబర్ 26 నుంచి వందేమాతరం వినియోగాన్ని సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోల్కతాలో సమావేశమవుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువడిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమీక్ష కోసం బంకిమ్ బాబుకి చెందిన బెంగాల్నీ, బంకిమ్ బాబుకు చెందిన కోల్కతానీ ఎంపిక చేశారని తెలిపారు. దీంతో దేశమంతా ఆశ్చర్యపోయి, దిగ్భ్రాంతికి గురైందని, దేశభక్తులు ఉదయం ఊరేగింపులు నిర్వహించి, వందేమాతరం ఆలపించడం ద్వారా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు 1937 అక్టోబర్ 26న కాంగ్రెస్ వందేమాతరం విషయంలో రాజీపడి వారి నిర్ణయంలో దానిని విభజించిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం సామాజిక సామరస్యం ముసుగులో జరిగిందని, కానీ చరిత్ర సాక్ష్యంగా ఉందన్నారు. ముస్లిం లీగ్ ముందు తలవంచి, దాని ఒత్తిడికి లోంగిన కాంగ్రెస్ రాజీ రాజకీయాలను అవలంబించిందని పేర్కొన్నారు.
సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడిలో వందేమాతర విభజనకు కాంగ్రెస్ మొగ్గు చూపిందని, అందుకే ఎదో ఒక రోజు దేశ విభజన కోసం కూడా లొంగక తప్పలేదని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఇతరులపై అధారపడి నిర్ణయాలు తీసుకుందని.. దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఆ పార్టీ విధానాలు మారలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు, దాని మిత్రపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వందే మాతరం చుట్టూ వివాదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
ఏ దేశమైన దాని నిజమైన స్వభావం మంచి సమయాల్లో కాదు, సవాళ్లు, సంక్షోభాల సమయంలోనే బయటపడుతుందని, అప్పుడు ఆ దేశ స్థిరత్వం, బలం, సామర్థ్యం అనే గీటురాయిపై పరీక్షించి నిలబడుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సవాళ్లు, ప్రాధాన్యతలు మారినప్పటికీ.. దేశ స్ఫూర్తి, జీవశక్తి మాత్రం అలాగే స్పూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత్ సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడల్లా, వందే తరం స్ఫూర్తితో ముందుకు సాగిందని ప్రధానమంత్రి అన్నారు. నేటికీ ఆగస్టు 15, జనవరి 26 వంటి సందర్భాల్లో ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్నప్పుడు ఆ భావన ప్రతి చోటా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఆహార సంక్షోభం సమయంలో దేశ ప్రజల ఆకలిని తీర్చేందుకు రైతులకు వందేమాతరం స్ఫూర్తినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు, రాజ్యాంగాన్ని చీల్చి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశం మళ్లీ పైకి లేచి అధిగమించడానికి దోహదపడేలా చేసింది వందేమాతరం బలమేనని అన్నారు. దేశంపై యుద్ధాలు జరిగినప్పుడు, పోరాటాలు తలెత్తినప్పుడు, సరిహద్దుల్లో సైనికులు దృఢంగా నిలబడేలా చేసింది, భారతమాత జెండా విజయంతో రెపరెపలాడేలా చేసింది వందేమాతరం స్ఫూర్తేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ 19 వంటి ప్రపంచ సంక్షోభ సమయంలో కూడా దేశం అదే స్ఫూర్తితో నిలబడి, సవాలును ఓడించి, ముందుకు సాగిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే దేశ బలం, దేశాన్ని భావోద్వేగాలతో అనుసంధానించే శక్తిమంతమైన శక్తి ప్రవాహం, చైతన్య స్రవంతి, పురోగతిని ముందుకు నడిపించే చెక్కుచెదరని సాంస్కృతిక ప్రవాహానికి ప్రతిబింబమని ప్రధామంత్రి వ్యాఖ్యానించారు. ‘‘వందేమాతరం కేవలం జ్ఞాపకాల కాలం కాదు, కొత్త శక్తి, స్పూర్తిని పొందేందుకు దానికి మనల్ని మనం అంకితం చేసుకునేందుకు ఒక సమయం’’ అని పేర్కొన్నారు. మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన మార్గాన్ని సృష్టించిన వందేమాతరానికి దేశం రుణపడి ఉందని, కాబట్టి దానిని గౌరవించడం మన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి సవాలును అధిగమించే సామర్థ్యం భారత్కు ఉందని, వందేమాతరం స్ఫూర్తి ఆ బలాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది కేవలం ఒక పాట లేదా శ్లోకం మాత్రమే కాదని, దేశం పట్ల మన కర్తవ్యాల వైపు మనల్ని మేల్కొల్పే ప్రేరణకు మూలమని, దానిని నిరంతరం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను మనం సాధించాలనుకున్నప్పుడు వందేమాతరం మన స్పూర్తిగా నిలుస్తుందన్నారు. కాలాలు, రూపాలు మారవచ్చు, కానీ మహాత్మా గాంధీ వ్యక్తం చేసిన భావన నేటికీ బలంగా ఉందని, వందేమాతరం మనల్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గొప్ప నాయకుల కల స్వతంత్ర భారతదేశమైతే, నేటి తరం కల సంప్న భారతదేశమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం కలను వందేమాతరం స్ఫూర్తి ఎలా పోషించిందో అలాగే సమృద్ధి కలను కూడా పెంపొందిస్తుందని అన్నారు. ఈ భావనతో ముందుకు సాగాలని, స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యానికి 50 సంవత్సరాల ముందు అందరూ స్వేచ్ఛా భారత్ గురించి కలలు కన్నట్లే.. 2047కి 25 సంవత్సరాల ముందు మనం కూడా సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశం గురించి కలలు కనగలమని, దానిని సాకారం చేయడానికి మనల్ని మనం అంకితం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మంత్రం, సంకల్పంతో వందేమాతరం మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుందని, మన రుణాన్ని గుర్తు చేస్తుందని, దాని స్ఫూర్తితో మనల్ని ముందుకు నడిపిస్తూ, ఈ కలను నెరవేర్చడానికి దేశాన్ని ఏకం చేస్తుందని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ చర్చ దేశాన్ని భావోద్వేగంతో నింపడానికి, దేశానికి స్పూర్తినిచ్చేందుకు కొత్త తరానికి ఉత్తేజపరిచేందుకు ఒక కారణమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2200656)
आगंतुक पटल : 6